18, మే 2018, శుక్రవారం

పిడకలు -ప్లిప్ కార్ట్ -ప్రజాస్వామ్యం

‘‘ఈ కాలం పిల్లలకు బొత్తిగా లోకజ్ఞానం లేకుండా పోయిందండీ రావుగారూ! ఆన్‌లైన్‌లో.. అదే ప్రపంచమని బతికేస్తున్నారు.’’
‘‘స్మార్ట్ ఫోన్  పుట్టినప్పటి నుంచి ఉన్నదే కదా? ఇప్పుడు కొత్తగా ఏమైందని?’’
‘‘అది కాదండీ రావుగారూ.. మా వాడు ఏమన్నాడో తెలుసా? అన్‌లైన్‌లో ప్రజాప్రతినిధుల అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు కదా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క‘ర్నాటకం’ ఎందుకు? అని అంటున్నాడు’’
‘‘ఐదు రోజుల మ్యాచ్‌ను ఎంజాయ్ చేసిన తరం మనది, 20ట్వంటీని కూడా బోర్ అంటున్న తరం వాళ్లది. వాళ్లకు బాల్ బాల్‌కూ ఫలితం తేలిపోవాలి.’’
‘‘అది కాదురా అని అబ్బాయికి రాజకీయం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే వాడేమన్నాడో తెలుసా? మరీ చాదస్తంగా మాట్లాడకు డాడీ నాలెడ్జ్ లేనిది నాకు కాదు మీకే... ఇంకా సంచీ పట్టుకుని షాప్‌కు వెళ్లి పప్పులు, ఉప్పులు తేవడం కాదు. అప్‌డేట్ కావాలి. కూరగాయలు కోసం అమ్మతో కలిసి సంతకు వెళ్లడం కాదు. ‘బిగ్ బాస్కెట్’కు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే పాలకూర కట్టలు కూడా ఇంటికొచ్చి ఇచ్చి పోతారని నాకే క్లాస్ తీసుకుంటున్నాడు. రెండు రూపాయలు విలువ చేసే పాలకూర కట్ట ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్ వాడు పది రూపాయలకు మూడు పిడకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రజాప్రతినిధుల ధర పిడకల కన్నా తక్కువగా ఉంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకమ్మరు? అని ప్రశ్నిస్తున్నాడు. ’’
‘‘నాకూ అలానే అనిపిస్తుంది. స్టార్ హోటల్స్, క్యాంపు లు ఇవన్నీ అవసరమా? ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపి, అమ్మకం పన్ను కూడా వసూలు చేస్తే ప్రభుత్వానికి బోలెడు ఆదాయం. సమయం ఆదా అవుతుంది. ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ వాళ్లు కొన్నారట కదా? అమెరికా వాడి తెలివే తెలివి. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దొరకనివి కూడా ఇప్పుడు దొరుకుతాయి చూస్తూ ఉండండి.. ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ చేపట్టగానే ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధుల అమ్మకాలు కూడా ఆన్‌లైన్‌లో మొదలవుతాయి. అసలు ధర ఎంతో తెలియక రహస్యంగా అమ్మకాలు, కొనుగోళ్లు సాగడం వల్ల అమాయకులు త క్కువ ధరకు అమ్ముడు పోతున్నారు. ప్రజాస్వామ్యం అన్నప్పుడు అందరికీ సరైన ధర లభించాలి. ఆన్‌లైన్‌లో అయితే అమ్మేవారికి, కొనేవారికి న్యాయం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని మార్కెట్‌లను ఆన్‌లైన్ చేసినప్పుడు ‘ప్రజాస్వామ్యం’ అమ్మకాలను ఆన్‌లైన్ ఎందుకు చేయరు? అదే జరిగితే ఫలితాలు వచ్చిన గంటలోనే కర్నాటకలో పాలన మొదలయ్యేది. ఇలా ఐతే ప్రజాస్వామ్యం ఎలా ముందుకు వెళుతుంది? ’’
‘‘రావుగారూ మీకు కామర్స్ తెలుసుకానీ, రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే ఏమీ తెలియదు! అబ్బాయితో అంటే వాడేమన్నాడో తెలుసా? ’’
‘‘ప్రపంచం మారిపోయిందన్న విషయం నీకే తెలియడం లేదు డాడీ! గ్రామ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కోసం గ్రామాల్లో వేలం వేస్తారు. వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. గ్రామానికి వర్తించిన ఈ సూత్రం మొత్తం నియోజక వర్గానికి అప్లై చేసి వేలం వేస్తే వందల కోట్లు వస్తాయి.. ఆ నిధులను నియోజక వర్గ అభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. జిఎస్‌టి వసూలు చేయవచ్చు. మహారాష్టల్రో పండే సంత్రాలను, కాశ్మీర్‌లో పండే ఆపిల్స్‌ను రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలానే నేతలు ఒక ప్రాంతంలో అమ్ముడు పోవడం ఏమిటి? మార్కెట్ ఎక్కడుంటే అక్కడ లభించాలి. ఉల్లిగడ్డలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో అత్యంత ఖరీదైన నేతలకు ఈ సౌకర్యం ఉండొద్దా? మొన్న బాబాయ్ బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని వెళ్లిపోతూ ఇక్కడ ఓటును రద్దు చేసుకుని అక్కడ నమోదు చేసుకున్నాడు కదా? ఓటరు దేశంలో ఎక్కడికి వెళ్లినా తన ఓటును అక్కడ నమోదు చేసుకోవచ్చు. మరి ఓటరుకు ఉన్న సౌలభ్యం నేతలకు ఎందుకు ఉండరాదు? ఒకసారి గెలిచిన వారు దేశంలో ఎక్కడైనా చెలామణి కావాలి. దీని వల్ల గిట్టుబాటు ధర లభిస్తుంది. అవసరం అయిన వారికి సరైన ధరలో నేతలు లభిస్తారు. టెక్నాలజీ లేక ముందు రాసుకున్న నిబంధనలు మార్చాల్సి అవసరం ఉంది డాడీ అని మా వాడు వాదిస్తున్నాడండి. పాలన అంటే పాలకూర కట్టలు కొనడం అనుకున్నారా? ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు.’’
‘‘మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ అని తెలుసు?’’
‘‘ప్రజాస్వామ్యం పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టు ఉండదని నాకు తెలియదా? నేనన్నది నేతలను కొనడం అంత ఈజీ కాదు అని. కర్నాటకలో వైస్రాయ్ హోటల్ లేకపోవడమే అసలు సమస్య అని ఓ కుర్రకుంక అంటున్నాడు. అసలు వీళ్లకు రాజకీయం ఏం తెలుసు? వైస్రాయ్ హోటల్ వల్లనే అధికారం వస్తే ఆ హోటల్ ఓనరే సీఎం అయ్యేవాడు. రాజకీయాలంటే ఎన్ని తెలివి తేటలు ఉండాలి? విలువలు మరచి నీతులపై ఉపన్యాసాలు ఇవ్వాలి. ఏం మాట్లాడతారు.. తెలిసీ తెలియకుండా! మార్కెట్‌లో వినియోగదారుడే దేవుడు కానీ డెమొక్రటిక్ మార్కెట్‌లో క్రయవిక్రయాలు ఈజీ కాదు. ఆ మధ్య కొనుగోళ్లకు వెళ్లి 50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చి చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో పొరుగు రాష్ట్రం పోలీస్ స్టేషన్లు పెడతాం అని వార్నింగ్ ఇచ్చిన వాళ్లు. కొనుగోళ్ల వ్యవహారం కెమెరాకు, కొన్నవారి గొంతు సెల్‌ఫోన్‌కు చిక్కగానే పదేళ్ల ఉమ్మడి బంధం కూడా వదులుకొని రాత్రికి రాత్రి సొంత ఊరు వెళ్లాల్సి వచ్చింది. ’’
‘‘అయినా ఇవీఎంలను రిమోట్‌తో కంట్రోల్ చేసి కావలసిన ఫలితాలు తెచ్చుకున్నారట కదా? అదేదో సరిగా ఆపరేట్ చేయవచ్చు కదా? ఎటూ కాకుండా ఈ ‘హంగ్’ లెక్కలెందుకు?’’
‘‘చూడండి.. రావుగారూ.. పైకి చెప్పుకోవడానికి మొహమాట పడతాం ప్రతివాడూ మేధావే. ఫలితాలు ఇలా వస్తాయని ఒక లెక్క చెబుతాం. ఫలితాలు వచ్చాక మన అంచనా నిజం కాకపోతే మన ఇగో హర్ట్ అవుతుంది. ఇవీఎంలను మేనేజ్ చేశారని మన ఈగోను సంతృప్తి పరుచుకుంటాం.’’
‘‘సరే.. ఇంతకూ గద్దె ఎవరికి? ?’’
‘‘ఏ దేశమైనా 11 మంది బృందంతో క్రికెట్ అడుతుంది. కానీ పాకిస్తాన్ జట్టు మాత్రం పనె్నండు మందితో ఆడుతుంది- అని ఆప్పట్లో ఓ జోక్. అంటే- రిఫరీ కూడా వారి జట్టులో సభ్యుడే’’
‘‘అది కాదండీ.. నేను కర్నాటక గురించి అడిగితే మీరు పాక్ క్రికెట్ జట్టు గురించి మీరేదో చెబుతున్నారు’’
‘‘మీరడిగిందే నేను చెప్పానండి రావుగారూ.. మీరే అర్థం చేసుకోలేదు’’

  ‘‘ విశ్వ శాంతి , దేశాభివృద్ధి ,ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం పదిమంది కర్ణాటక ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షానికి మద్దతు ఇచ్చినట్టు తెల్లవారు జామున కల వచ్చింది . నిజమవుతుందా ?’’
‘‘ తెల్ల వారు జామున వచ్చిన కళలు నిజమవుతాయి ’’
‘‘ప్రజాస్వామ్యం లో విలువలు రోజు రోజుకు పెరుగుతున్నాయి . ఒకప్పుడు కోటి రూపాయలు పలికిన సరుకు ఇప్పుడు వంద కోట్లు పలుకుతుందట . నిజానిజాలు స్వామికి తెలియాలి ’’
‘‘ఏ స్వామికి ?’’
‘‘వెంకన్న స్వామికి 
‘‘పాపం ఆయనే  కష్టాల్లో ఉన్నారు .’’ 
-బుద్దా మురళి (జనాంతికం 18-5-2018)

2 కామెంట్‌లు:

  1. వంద కోట్లు ఎక్కడికి సరిపోతాయండీ, ఇంత అన్యాయమా? కనీసం వెయ్యి కోట్లయినా పలుకకపొతే పార్టీ మారను

    ఇట్లు భవదీయుడు కక్కుర్తి రామయ్య (అవినీతినగర్ ఎమ్మెల్యే)

    రిప్లయితొలగించండి
  2. నిజమే జనాలు ఓటేసి ఎన్నుకొంటే, పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు. రాష్ట్రాభివృద్ధి కోసం మనస్సాక్షిని నమ్ముకొని, యడ్యూరప్పని ముఖ్యమంత్రిని చేస్తారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం