23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

బ్యాం‘కింగ్’ల ఆత్మకథ

నా ఆత్మకథ ఆవిష్కరణకు నువ్వు తప్పకుండా రావాలి!
‘‘ఏం పొడిచేశావని అప్పుడే ఆత్మకథ. ఆత్మకథ రాయాలనే నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. అనుకున్నదే తడువుగా రాసేసిన నీ కార్యదక్షతకు సలాం చేస్తున్నాను. ఈ ఆలోచన నీకు ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?’’
‘‘టీవిలో ఇంటర్వ్యూలా అలా ప్రశ్నలు అడుగుతూ పోతూనే ఉంటే ఎలా? నిజానికి అదో పెద్ద కథ. నేను ఆత్మకథ రాస్తానని ఎప్పుడూ ఊహించలేదు. రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. ’’
‘‘అప్పుడెప్పుడో నే పలికెడిది భాగవతం, పలికించేది రామభద్రుడు అని పోతన చెప్పినట్టు ఆత్మకథ రాయాలి అని నువ్వు అనుకోక పోతే నీ ఆత్మ అనుకుందా? ఒకందుకు మంచి పని చేశావు. ఆవిడెవరో లక్ష్మీపార్వతి ఆత్మకథ రాసేందుకు ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించడం, దీన్ని సాకుగా చూపించి అల్లుడు ఎన్టీఆర్ ఆత్మక్షోభించేట్టు చేయడం తలుచుకుంటే జాలేస్తుంది. ఆత్మకథ బాధ్యత ఎవరికో అప్పగించి, ఇంట్లో కుంపటి సీరియల్‌కు తెర లేపకుండా నీ ఆత్మకథ నువ్వే రాయాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయం.’’

‘‘నన్ను ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పక ముందే నువ్వే చెబుతున్నావ్?’’
‘‘సరే ఆత్మకథ రాయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందో తరువాత ఆత్మకథ పుస్తక ప్రచురణ ఆలోచన ఎలా వచ్చింది. దాని కెంత ఖర్చయిందో చెప్పు రేపు నేను కూడా ఆత్మకథ రాసుకుంటే ఉపయోగపడుతుంది. ’’
‘‘నా ఆత్మకథ బ్యాంకుకే అంకితం చేశాను. వారి వల్లనే రాశాను. వారిచ్చిన లోన్‌తోనే ప్రచురించాను. బ్యాంకు ఆవరణలోనే ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాను. ఒక రకంగా నా ఆత్మకథ నేను రాయలేదు. బ్యాంకు వాళ్లు నాతో రాయించారు. ’’
‘‘డైలీ సీరియల్‌లా లాగకు, న్యూస్ పేపర్ కాలంకు సరిపోయేంతగా సూటిగా చెప్పు?’’
‘‘వరుసగా నా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. పర్సనల్ లోన్ కావాలా? అంటూ పెద్దగా పట్టించుకోలేదు. కొందరు కాల్ చేసి అడగడం మొదలు పెట్టారు. ఒక అమ్మాయి అద్భుతమైన గొంతుతో సార్ పర్సనల్ లోన్ తీసుకోండి అని కోరింది. అవసరం లేదన్నాను. మీకు అవసరం లేకపోవచ్చు కానీ మాకుంది సార్. కస్టమర్ల టార్గెట్ పూర్తి చేయకపోతే తనకు చాలా కష్టం అంది. అంత చక్కని గొంతున్న అమ్మాయి మాట ఎందుకు కాదనాలి అని సరేలే అన్నాను. నిజానికి నాకు లోన్ అవసరం లేదు కానీ ఈ వంకతో అంత అందమైన గొంతు రూపం ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనుకున్నాను. ’’
‘‘లేటు వయసులో అన్నగారు వదిన ప్రేమలో పడ్డట్టు నువ్వు అందమైన గొంతుకు ఫిదా అయ్యావన్న మాట కథ ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఆత్మకథలో అమ్మాయి ఉందంటే హిట్టయినట్టే.. ప్రొసీడ్’’

‘‘ఆ అమ్మాయి గొంతు తప్ప ఆమె ఎవరో నాకు ఇప్పటి వరకు తెలియదు అతిగా ఊహించుకోకు’’
‘‘వావ్ అమ్మాయి ముఖం కూడా చూడకుండా ప్రేమలో పడడం అంటే అమలిన శృంగారం అని ఏదో అంటారు కదా? అలాంటిదన్న మాట. ఆత్మకథ రాయమని ఆ కనిపించకుండా వినిపించిన సుందరి చెప్పింది. నువ్వు రాశావు అంతే కదా? ’’
‘‘కాదు నాతో ఆత్మకథ రాయించింది. సుందరి కాదు సుందరుడు’’
‘‘ఇదేం ట్విస్ట్ నువ్వు ప్రేమించిన సుందరిని ఈ సుందరుడు తన్నుకుపోయాడా?’’
‘‘‘‘సుందరుడా వాడి బోందనా చమట కంపు ముఖం వాడూను. వాడి పేరు సుందర్’’‘‘కథ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఆత్మకథకు దారి తీసిన కథ చెప్పు ?’’

‘‘ఆ అమ్మాయి ఎంతో మధురమైన గొంతుతో పర్సనల్ లోన్‌కు అప్లయ్ చేయండి అని కోరితే సరే అని బ్యాంకుకు వెళ్లాను. నేను వెళ్లగానే ఆ ఆమ్మాయి స్వాగతం పలుకుతుంది అనుకున్నాను. కానీ ఆమె లేదు. లోన్ సెక్షన్‌లో సుందర్ అని చమట ముఖం వ్యక్తి కనిపించి ఓ పెద్ద పుస్తకం చేతికి అందించాడు. ఇంజనీరింగ్‌లో ఆల్ ఇన్ వన్ బుక్ కూడా అంత పెద్దగా ఉండదు. ఆ బుక్‌లోని ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. 360 పేజీల పుస్తకంలో మొత్తం 642 సంతకాలు పెట్టాను. ఐదువందల 76 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నేను చెప్పిన వివరాలన్నీ తిరిగి చదువుకున్న తరువాత నాకే ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎడిట్ చేస్తే నా ఆత్మకథ అవుతుందని అక్కడే ఐడియా వచ్చింది. సాంక్షన్ అయిన ఆ లోన్‌తోనే నా ఆత్మకథ ముద్రించాలని నిర్ణయించుకున్నాను. కొత్తగా ముందు మాట రాయడం తప్ప మిగిలిందంతా లోన్ కోసం దరఖాస్తులో రాసిందే.’’
యూరేకా.. యూరేకా’’
‘‘నా ఆత్మకథ వెనుక కథకు నేను యూరేకా అని అరవాలి కానీ విన్న నువ్వు అరవడం ఏమిటి?’’
‘‘నీ ఆత్మకథ కథ విన్నాక నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు లోన్ తీసుకుని విదేశాలకు చెక్కేసిన మహానుభావుల ఆత్మకథలు కూడా బ్యాంకుల్లో ఉంటాయి కదా? వాటి ఆధారంగా వారెక్కడకు వెళ్లింది? ఎక్కడ ఉన్నది? డబ్బు ఎక్కడ పెట్టింది? బంధువులు ఎవరు? పుట్టుమచ్చలెక్కడ ఉన్నాయి తెలుస్తాయి కదా? ఈ ఆధారాలతో వారిని వెతికి పట్టుకుని బొక్కలో వేయొచ్చు కదా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్? నీకసలు బుద్ధుందా? లక్ష రూపాయల పర్సనల్ లోన్‌కు వెళితే, రైతు వ్యవసాయ రుణానికి వెళితే ఆత్మకథ రాయిస్తారు. వేల కోట్ల లోన్ కావాలంటే కనీసం బ్యాంకులో అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాంకులే వారి ఇంటికి వెళ్లి దర్శనం కోసం పడిగాపులు కాస్తాయి. అలా వేల కోట్ల రుణాలతో దేశం విడిచి పారిపోయిన వారు గతంలో అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్న  ఫోటోలు తప్ప మరే వివరాలు ఉండవు. ఆయనెవరో నిరవ్ మోడీకి ఏ దేశ పౌరసత్వం ఉందో ఇంకా తేల్చలేకపోయారు. ఇక జీవిత చరిత్ర ఎలా తెలుస్తుంది.’’
‘‘మన మాటలు వింటూ మీ అబ్బాయి తనలో తానే ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. ఏం లెక్కలు బాబు’’
‘‘అంకుల్ నాదో డౌట్ మీరే తీర్చాలి. బోర్డు తిప్పేయడం కోసం బ్యాంకు ఏర్పాటు చేయడం, బ్యాంకులో భారీ లోన్, బ్యాంకులో పిఐఓ ఉద్యోగానికి ప్రిపేర్ కావడం ఈ మూడింటిలో ఏది ఈజీ అంటారు?’’
‘‘బ్యాంకులో పిఓ ఉద్యోగానికి చాలా కాంపిటేషన్ ఉంటుంది. మిగిలిన రెండింటిలోనీకు ఏది సాధ్యమో  నువ్వే తేల్చుకో...’’
బుద్దా మురళి (జనాంతికం 23-2-2018)

19, ఫిబ్రవరి 2018, సోమవారం

మాయదారి మల్లిగాడు

తెల్లని ఖద్దరు దుస్తులు, బొజ్జ, తల పై టోపీ. చూడగానే విలన్ అనిపించేట్టు చూపులు. ఇవన్నీ కనిపి స్తే అతను రాజకీయ నాయకుడు. మన సినిమాలు మన బుర్రలో నింపిన రాజకీయ నాయకుని రూపం ఇది. హీరోలను మించిన అందంతో కళ్ళముందు ఎంతమంది రాజకీ య నాయకులు కనిపించినా మనం నాయకుడు అంటే ఇలానే ఉంటాడు అని సినిమా లు చూపిన రూపానికి ఫిక్స్ అయిపోయాం.

దేశరాజకీయాల్లో రాజీవ్‌గాంధీ అంత అందగాడు సినిమా హీరోల్లో కూడా లేడు. రాజీవ్‌గాంధీ విధానాలను, పాలనను వ్యతిరేకించిన వారుండవచ్చు. రాజకీయాల్లో ఆయనకు ప్రత్యర్థులు ఉండవచ్చు కానీ, రాజీవ్‌గాంధీ అందగాడు కాదు అని ఆయన ప్రత్యర్థులు కూడా అనరు. ఆయనే కాదు, రాజకీయాల్లో కొన్ని వందలమంది అందగాళ్ళు, అందమైన మహిళలున్నారు. కానీ, మన మెదడులో సినిమాలు చిత్రించినరూపమే ఉండిపోయింది. ఐఐటీల నుంచి వచ్చినా, చిన్నప్పుడు చదువుకున్న పద్యాలనూ అలవోకగా ఇప్పటికీ చెప్పే ముఖ్యమంత్రులున్నా సినిమా పుణ్య మాని రాజకీయ నాయకుడు అంటే ఏమీ తెలియని వారు అనే బలమైన ముద్ర సినిమాలు వేసేశాయి.

గళ్ళ లుంగీ, మెడలో రుమాలు, చేతిలో కర్ర.. ఈ రూపం వర్ణిస్తే ఎవరు గుర్తుకు వస్తారని ప్రశ్న పూర్తికాకముందే ఇంకెవరు పాత సినిమాల్లో చిల్లర రౌడీ గుర్తుకువస్తాడు అనే సమాధానం వస్తుంది. నిజమే మన పాత సినిమాలన్నింటిలో విలన్ల రూపం ఇదే. జగ్గారావుకు ఈ రౌడీ రూపంపై పేటెంట్ హక్కులు కల్పించవచ్చు కూడా. మరి అదే గళ్ళ లుంగీ, చేతిలో దొడ్డుకర్ర, మెడ లో రుమాలుతో ఎవరైనా సినిమా హాల్లోకి ప్రవేశిస్తే బ్లాక్ టికెట్లు అమ్ముకొనేవాడేమోనని చూస్తారేమో. కానీ, 1973లో అలా చూడలేదు, వింతగా చూశారు. వీధిరౌడీ డ్రెస్‌లో ఉన్న సూపర్ స్టార్ సినిమాను విరగబడి చూశారు. అదే డ్రెస్‌లో సినిమాకు వచ్చిన అభిమానిని వింతగా చూశారు.

1973లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన మాయదారి మల్లిగా డు సినిమా సూపర్‌హిట్. గళ్ళ లుంగీ, మెడలో రుమాలు, చేతి కర్రతో అచ్చం పాత సినిమాలో విలన్‌లా ఉంటాడు, ఈ సినిమాలో హీరో కృష్ణ. కృష్ణ అభిమాని ఒకరు అచ్చం ఇలాంటి దుస్తులతోనే హైదరాబాద్ నగరంలో సినిమా టాకీసుల్లో హడావుడి చేశాడు. అందరూ అతన్ని వింతగా చూసినా అతను పట్టించుకోలేదు. ఆ సినిమా నడిచినన్నిరోజులు అలానే ఉన్నాడు. మేక ప్ లేకపోయినా ఎంతో అందంగా ఉండే మంజుల మాయదారి మల్లిగాడు సినిమాలో హీరోయిన్. అంతందంగా ఉన్న, మంజు ల రౌడీని ప్రేమించేస్తుంది. ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో తెలియదు. అందుకే ప్రేమ గుడ్డిది అన్నారేమో. పాపం మంజుల అయినా ఏంచేస్తుంది. అసలే తెలుగులో హీరోయిన్‌గా తొలి సిని మా. దర్శకుడు ఎవరిని ప్రేమించమంటే వారిని ప్రేమిస్తుంది. నిజ జీవితంలో మాత్రం ఆమె సహనటుడు విజయకుమార్ ప్రేమించి పెళ్లిచేసుకున్నది.

వారి ప్రేమ సంగతి వదిలేస్తే..
అవింకా మార్కెట్‌ను రెడీమేడ్ దుస్తులు ఆక్రమించుకోని కాలం. వీధికో టైలర్ ఉండేవాడు. ఆ వీధిలోనివారికి అతనే ఫ్యాషన్ డిజైనర్. వాణిశ్రీ, భారతి చీరలు, జాకెట్లు, కొప్పు, మం జుల బుగ్గల జాకెట్లు అంటూ అమ్మేవారు. కానీ చందన బొమ్మ నా, చెన్నైలు ఇంకా పుట్టనికాలం.ఆ రోజుల్లో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు సినిమాల్లో ఏ దుస్తులు వేసుకుంటే వారి అభిమానులు పలువురు తమ గల్లీలోని ఫ్యాషన్ డిజైనర్‌తో అలాంటి దుస్తులు కుట్టించుకొని అవి వేసుకొని దర్జాగా సినిమాకు వెళ్లేవారు. వీరి సంఖ్య తక్కువే అయినా సినిమా హాలులో వీరు ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన మాసపత్రికలు, వారపత్రికల్లో ముందుగానే వచ్చేది కాబట్టి ఆ ప్రకటనలోని పోస్టర్ చూసి హీరోలా దుస్తులు కుట్టించుకొనేవారు.వేటగాడు, అడవిరాముడు కాలంలో ఎన్టీఆర్ బెల్‌బాటమ్ దుస్తులు ఫ్యాషన్ ప్రపం చంలో ఓ ఊపు ఊపాయి. అలాఇలా ఊప డం కాదు, ఒకరకంగా స్వచ్ఛభారత్‌కు శ్రీ కా రం చుట్టింది ఆ కాలంలోనే. బెల్‌బాటం ప్యాంట్లు రోడ్డును. ఆ ప్యాంట్‌కు కిందివైపు ఓ జిప్పు కూడా ఉండేది. రోడ్డును ఊడ్చడం వల్ల ప్యాంట్ త్వరగా చిరిగిపోకుండా జిప్పు ఏర్పాటు చేసేవారు. దాదాపు నాలుగైదేండ్ల పాటు బెల్‌బాటం ప్యాంట్లు రాజ్యమేలాయి.

సినిమాలో హీరోను అనుకరించడం బహుశా అక్కినేని సిని మాతోనే ప్రారంభమై ఉంటుంది. ఎవరినైనా వన్‌సైడ్ ప్రేమ అయినా, ప్రేమ విఫలమైనా నలుగురి దృష్టిలో పడేవిధంగా గడ్డం పెంచి దీనంగా దేవదాసులా కనిపించేవారు. ఇప్పుడు కాలం మారింది, ఎందుకైనా మంచిదని ఒకేసారి అరడజను మందిని ప్రేమించేస్తున్నారు. ఒకరు కాకపోతే ఒకరైనా తిరిగి ప్రేమిస్తారని. తుం నహీతో ఔర్ సహీ ఔర్ నహితో ఔర్ సహీ అని ఈ ప్రేమల మీద చాలాకాలం కిందట రాష్ట్రీయ సహారా పత్రిక ఓ కథనం రాసింది. దేవదాసులా ఒకరి కోసమే ఎదురు చూసే రోజులు పోయాయని నువ్వు కాకపోతే మరొకరు, ఇంకొకరు కాకపోతే మరొకరు అంటూ నేటి యువత కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రేమను వెనక్కినెట్టారు.సినిమాలో ముస్లిం అంటే తెలుగు మాట్లాడటం రాదు, సగం తెలుగు సగం ఉర్దూ కలిపి మాట్లాడుతారు. ముస్లిం అంటే సినిమాల పుణ్యమాని మన బుర్రలో ముద్రించుకుపోయిన రూప మిదే. బాబూ బయట సమాజం సంగతి వదిలేయ్, మీ సినిమా ల్లోనే చక్కగా తెలుగులో పాటలు పాడే నాగూర్‌బాబు ముస్లిం. తెలంగాణ వ్యక్తి అంటే రౌడీలా మాట్లాడుతాడు అని సినిమా వారి గట్టి నమ్మకం. సినిమానే నిజమైన ప్రపంచం అనుకొనే వారి నమ్మకం కూడా..తెలంగాణకు చెందిన సి.నారాయణరెడ్డి, దాశరథి లాంటి ఉద్ధండ పండితులు సినిమారంగంలో ఉన్నా.. తొలి తెలుగు గేయ రచయిత చందాల కేశవదాసు తెలంగాణకు చెందినవారే అయినా.. సినిమా వారు ఆ ముద్ర నుంచి బయటపడలేదు. చివరకు తెలంగాణనే వారినుంచి బయటపడింది.
 
సినిమాలో చూపించేది అవాస్తవికం, సినిమాలో చూపేది వేరు వాస్తవ ప్రపంచంలో కనిపించేది వేరు అని వాదిస్తుంటాం. కానీ కొన్నిసార్లు రెండూ ఒకటే. ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ అందమైన అమ్మాయిలతో జల్సాచేసి విదేశాలకు పారిపోతాడు. అచ్చం విజయ్ మాల్యా అలానే చేశాడు కదా. అందమైన అమ్మాయిలతో జల్సా జీవితం తానూ గడపడమే కాకుండా నలుగురి కోసం అందమైన అమ్మాయిల క్యాలెండర్లు మన కోసం వదిలి తాను మాత్రం సినిమా విలన్ లానే విదేశాలకు పారిపోయాడు. ఆయనెవరో వజ్రాలు, నగల వ్యాపారి నీరవ్ మోదీ కూడా అలా నే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయాడు. ముందు విదేశాలకు చెక్కేశాడు. కాబట్టి విజయ్ మాల్యాను గురువు అనా లా? విజయ్ మాల్యా కన్నా ఎక్కువ మొత్తంతో విదేశాలకు ఉడాయించాడు. కాబట్టి నీరవ్ మోదీని గురువు మాల్యాను శిష్యుడు అనాలా అని కొందరి సందేహం. దారిచూపిన వాడే గురువు. ఇద్దరికి దారిచూపిన మహానుభావునికే గురుపీఠం అధిష్టించి అర్హ త ఉంటుందని కొందరి వాదన. మాయదారి మల్లిగాడు అంటే పాత రోజుల్లో లా  గళ్ళ లుంగీ తోనే ఉండడు వజ్రాలతో మెరిసి పోతుంటారు కూడా 

బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 17-2-2018)

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మాకో దేశం కావాలి..!


‘‘రాజాదరణ ఉంటేనే కళలు రాణిస్తాయి, కానీ కళాకారులే పాలకులు కావడం మన అదృష్టం. ’’
‘‘కళాకారులు కళకు ఫుల్ స్టాప్ పెట్టి జీవనోపాధి వెతుక్కుంటుంటే నువ్వేమో ఏకంగా కళాకారులే రాజుల్లా పాలించేస్తున్నారంటావ్’’
‘‘రాజుల్లా పాలించడం కాదు.. రాజులే అంటున్నాను. కళాకారులు అంటే గ్రామ చావిడిలోనో లేకుంటే గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి యక్షగానం, హరికథలు, బుర్రకథలు చెప్పేవారు అనుకుంటున్నావా? ఆ తరహా కళాకారులు కనిపించకుండా పోయారు. వారి కళను పాలకులు లాక్కున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై కళాకారుల పాత్రల్లో జీవిస్తున్న వారి గురించి నేను చెబుతున్నాను. దేశ ప్రధాని మొదలుకొని, గ్రామ ప్రధాన్ వరకు తమ కళాప్రతిభను ప్రదర్శిస్తూ మీడియా దృష్టిని ఆకట్టుకుంటున్నారు.’’
‘‘డొంక తిరుగుడుగా నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమైందిలే? పెద్దల సభలో మహిళా సభ్యురాలు వికటాట్టహాసం చేస్తే ‘పెద్దాయన’ ఏదో సరదాగా అప్పుడెప్పుడో రామాయణం సీరియల్‌లో వికటాట్టహాసం తరువాత తిరిగి అంతటి నవ్వును ఇప్పుడే చూస్తున్నానని అన్నారు. అదీ తప్పేనా? నీకీ మాటే గుర్తుంది కానీ అంత కన్నా ముందు ఆయన చెప్పిన మాట గుర్తు లేదా? చట్టసభలు మరీ సీరియస్‌గా మారిపోతున్నాయి, గతంలో అన్నిపక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునే వారని, అలాంటి వాతావరణం మళ్లీ రావాలని అన్న మాట గుర్తు లేదా? ఆ భావనతోనే ఏదో ఛలోక్తి విసిరారు.. దానికి అంత రాద్ధాంతం చేయాలా?’’
‘‘ఎందుకన్నారో మాకేం తెలుసుకానీ, అధికార పక్షం ప్రజాప్రతినిధి ఒకరు ఆయన ఛలోక్తిని మరీ విడమరిచి చెప్పారు కదా? శూర్పణఖను గుర్తు చేశారని, ఆ ఛలోక్తికి అర్థం అదే అని ట్విట్టర్‌లో చెప్పారు కదా? ’’
‘‘ఆయన గొప్ప ఉపన్యాసకుడు అను.. ఒప్పుకుంటాను. ఆయన కళాకారుడెలా అవుతాడు?’’
‘‘మిమిక్రీ కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చి పద్మశ్రీ అవార్డు పొందిన నేరెళ్ల వేణుమాధవ్ జన్మించిన ప్రాంతానికి చెందిన నీ నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని అస్సలు ఊహించలేదు. మిమిక్రీని నువ్వు కళగా గుర్తించడం లేదా? మిమిక్రీ చేసే వ్యక్తిని కళాకారుడిగా గుర్తించడం లేదా? చౌర్యాన్ని కూడా కళగా గుర్తించి ‘చోరకళ’ అని గౌరవించారు మన పూర్వీకులు. నువ్వు ఒక కళను అవమానించడం సహించరానిది’’
‘‘నీమీద ఒట్టు.. నేను చౌర్యాన్ని కూడా కళగానే భావిస్తాను. చాలా కాలం క్రితం మా ఇంట్లో సైకిల్ ఎత్తుకెళితే చోరకళాకారుడిని అవమానించవద్దని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయలేదు.’’
‘‘నేనన్నది మిమిక్రీ కళలో నైపుణ్యం ఉన్న పాలకుడిని కళాకారుడిగా గుర్తించక పోవడం గురించి ’’
‘‘కళాకారుడు ఎలా అవుతాడు’’
‘‘రాహుల్ గాంధీ ఎలా మాట్లాడతారో అచ్చం అదే విధంగా మిమిక్రీ చేసి చూపించిన ప్రధాన పాలకునిలో నీకు కళాకారుడు కనిపించ లేదా? మొన్నటికి మొన్న ఐదు రోజుల పాటు పార్లమెంటు ముందు చిందు భాగవతం మొదలుకుని వేమన వరకు అన్ని వేషాలు వేసిన కళాకారులు నీకు కనిపించలేదా? ’’
‘‘అవన్నీ నేను చూడలేదు కానీ ఆ శివప్రసాద్ ఏకపాత్రాభినయం మాత్రం నాకు బాగా నచ్చింది. ఆయన స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచి కళాకారుడే. నటుడు, దర్శకుడు అయినా అయన ప్రతిభను సినిమా రంగం సరిగా ఉపయోగించుకోలేదు. కళలను ఆదరించడం రాజుల బాధ్యత. రాజులు ఆ పని చేయనప్పుడు శివప్రసాద్ ఆ బాధ్యతను తన భుజ స్కంధాలపై మోస్తూ రోజుకో వేషంతో తెలుగునాట ఎన్ని కళలు ఉన్నాయో లోకానికి పరిచయం చేశారు. దక్షిణాది అంటే తమిళనాడు మా త్రమే అనుకునే జాతీయ మీడియాకు తెలుగు అనే ఒక భాష ఉంది, ఆ భాషీయులకు అనేక కళలు ఉన్నాయని పరిచయం చేశారు. తెలుగు కళలను ప్రపంచ పటంలో పెట్టారు. ’’
‘‘నీకలా అనిపించిందా?’’
‘‘ఇంకో కళాకారుడిని మరిచిపోయాను. మాకు అన్యాయం చేస్తే, మేం తెలుగుదేశంగా వేరే దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కదా? ’’
‘‘పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న రోజుల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంటే అందరూ ఆయుధాలు కావాలంటే, ఒకడు మాత్రం తనకో శతఘ్ని కావాలని కోరాడు. ఎందుకయ్యా.. అని అతడిని మెల్లగా అడిగితే ప్రభుత్వాలు మనం ఎంతో అడిగితే గీసి గీసి కొంత మాత్రమే ఇస్తుంది. మనం శతఘ్ని అడిగితే కనీసం రివల్వర్ అన్నా ఇవ్వకపోదు కదా అని బదులిచ్చాడు.’’
‘‘అంటే శతఘ్ని అడగాలంటావా?’’
‘‘కాదు. మా తెలుగు ముక్కను దేశం నుంచి విడదీసి మాది మాకిచ్చేయండి మేం వేరే ఖండంతో కలుస్తాం.. అని అడిగితే.. న్యాయం జరిగేది.మరో లోకం లో కలిపినా సరే అనాల్సింది ’’
‘‘ఆయనెవరో మురళీమోహనుడు.. అలానే అడిగాడు కదా? మాకు దక్షిణ భారత దేశం ఇచ్చేయండి అని’’
‘‘మా రాజమండ్రి మాకిచ్చేయండి అంటే అక్కడి ప్రజలందరి అభిప్రాయం అదే కావచ్చు అనుకుందాం. దక్షణ భారత దేశం అంటే ఒక్క రాజమండ్రే కాదు కదా? కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా? వీళ్లంతా ఆయన డిమాండ్‌కు ఒప్పుకుంటారా? కనీసం పొరుగున ఉన్న తెలంగాణ ఆయన డిమాండ్‌కు ‘సై’ అంటుందా? ఆ మాట తరువాత.. దక్షణాదిలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో లెక్క పెట్టి వారితో మాట మాత్రంగానైనా చెప్పి ఈ డిమాండ్ చేస్తే బాగుండేది.’’
‘‘ఇంతకూ ఏ మంటావు?’’
‘‘విభజన చట్టాన్ని ఎంత వరకు అమలు చేశారు? ఏ రాష్ట్రానికి ఏమిచ్చారో కేంద్రం లెక్కలు చెప్పదు. మీరు ఇచ్చింది ఇది.. మాకు ఇంకా రావలసింది ఇది- అని రాష్ట్రం లెక్కలు చెప్పదు. మంత్రివర్గం నుంచి బయటకు రాం, కానీ దేశం నుంచి విడిపోతాం అంటే డ్రామాలు అనే విమర్శ రావడం సహజమే కదా?
‘‘జీవితమే నాటక రంగం అన్నప్పుడు రాజకీయాలు నాటకాలు కాకుండా ఎలా ఉంటాయి? తెరపైన బొమ్మలను చూస్తున్నామని తెలిసినా సినిమా రక్తికట్టినప్పుడు అందులో లీనమవుతాం, వారు నవ్వితే మనం నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం. రాజేంద్ర ప్రసాద్ సినిమా అయితే నవ్వులు, శారద సినిమా అయితే కన్నీళ్లు వస్తాయి. అలానే రాజకీయాల్లో కొన్ని పాత్రలు నటనలో జీవించినప్పుడు ఇది నాటకం అని ఆడేవారికి తెలుసు, ఆడించే వారికి తెలుసు, చూసే వారికి తెలుసు. మనం నాటకంలో లీనమవుతున్నాం అంతే. అద్భుతమైన సినిమా దాన వీర శూర కర్ణ కూడా నాలుగు గంటలకు మించి లేదు . ఎంత గొప్ప రాజకీయ డ్రామా అయినా తెర పడాల్సిందే ఏదో ఒక రోజు ’’ *

బుద్దా మురళి (జనాంతికం 16-2-2018)

12, ఫిబ్రవరి 2018, సోమవారం

శివరాత్రి ఓ మధుర జ్ఞాపకం:ఉదయం బడిపంతులు రాత్రి నర్తన శాల

శివరాత్రి జాగారానికి ఏం ఏర్పాటుచేస్తున్నారు? ఈ రోజుల్లో ఇలాంటి ప్రశ్న వేస్తే అలా అడిగినవారిని చిత్రంగా చూడాల్సి వస్తుంది. మరో లోకం నుంచి వచ్చినట్టు చూసినా ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో ప్రతిరోజు జాగారమే. ప్రత్యేకంగా జాగారం ఏర్పాట్లు ఎందుకు?

కాలం మారింది ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేదు. రోజంతా నగరం మేల్కొనే ఉం టున్నది. అయితే టీవీ, లేదంటే ఫోన్‌లో కావలసినవి చూస్తూ రాత్రంతా మెలుకువగానే ఉంటున్నారు. రోజూ జాగారం చేసే ఈ కాలంవారికి నాలుగైదు దశాబ్దాల కిందట ఏడాదికి ఒకరోజు జాగారం చేసేందుకు వారంముందు నుంచి ఏర్పాట్లు చేసుకొనేవారు అంటే వింతగా అనిపించవచ్చు.

దశాబ్దాల కిందట హైదరాబాద్ నగరంలో ఇలా ఉండేది కాదు. తెలంగాణలో పండుగలు ఎక్కువగా సామూహికంగా జరుపుకుంటారు. దీనికి హైదరాబాద్ నగరం మినహాయింపు కాదు. నాలుగైదు దశాబ్దాల కిందట కాలనీలు, అపార్ట్‌మెంట్లు హైదరాబాద్ నగరాన్ని కమ్మేయకముందు అచ్చం గ్రామాల మాదిరిగానే నగరంలో సామూహికంగా పండుగలు జరుపుకొనే ఆనవాయితీ ఉండేది. శివరాత్రి వస్తుందంటే చాలు ముందుగానే జాగారానికి ఏర్పాట్లు జరిగేవి. 
ఈ రోజుల్లో వైకుంఠపాళి అంటే తెలుసా అని ఎవరినైనా అడిగితే రాజకీయ విశ్లేషణలో తరచూ కనిపించే పదంగా మాత్రమే తెలిసి ఉండవచ్చు. కానీ అది హైదరాబాద్‌లో ఆ కాలంలో శివరాత్రికి అందరూ ఆడే మెదడుకు పనిచెప్పే ఒక ఆట.

అష్టాచమ్మ, వైకుంఠపాళి, భజనలు, నాటకాలు, పాటలు.. ఇవన్నీ శివరాత్రి రోజున వినిపించే మాటలు, కనిపించే ఆటలు. పెద్దలకు జాగారం ఎలా అనేది ప్రధాన ఆలోచనయితే పిల్లలకు రోజంతా తినకుండా ఉపవాసం ఎలా అనేది అం తకన్నా పెద్ద సమస్య. ఉదయం మార్నింగ్‌షో బడిపంతులు సినిమా చూసి ఆకలి మరిచిపోవడం, అర్ధరాత్రి సుదర్శన్ టాకీస్‌లో నర్తనశాల సినిమా చూడటం బాల్యంలో ఓ మధుర జ్ఞాపకం.


ఆర్టీసీ క్రాస్‌రోడ్ అంటే సినిమా ప్రియులకు స్వర్గధామం. ఇం కా టీవీలు రంగప్రవేశం చేయని ఆ రోజుల్లో వినోదం అంటే సినిమాలే. సినిమాలు చూడాలంటే టాకీసులే శరణ్యం. ఒక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోనే అరడజను సినిమా హాల్స్ ఉండేవి. ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా. ఏదో ఒక సినిమా టికెట్ దొరుకడం గ్యారంటీ అనే బోలెడు నమ్మకంతో చలో ఆర్టీసీ క్రాస్‌రోడ్ అని సినిమా అభిమానులు క్రాస్‌రోడ్ బాట పట్టేవారు.
భోలక్‌పూర్ పెద్ద మసీదు వద్ద ముస్లింల సంఖ్య ఎక్కువ. దగ్గరలో అక్కడక్కడ హిందువులు ఉండేవారు. అపార్ట్‌మెంట్లు లేవు. ఇండిపెండెంట్ ఇళ్లకన్నా దొడ్డి అని ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఖరీదైనవాళ్లు నివసించే వాటిని గేటెడ్ కమ్యూనిటీ అం టున్నారు. అప్పుడు దాదాపు ఒకటి రెండెకరాల్లో దొడ్డి పిలిచే గృహసముదాయాలుండేవి. భోలక్‌పూర్‌లోని పండరయ్య దొడ్డి లో దాదాపు 15 కుటుంబాలు ఉండేవి. దిగువ, మధ్య తరగతి కుటుంబాలు. దగ్గరలో వెంకయ్య గల్లీ. చుట్టుపక్కల హిందువులుండే గల్లీలు. పండుగ వచ్చిందంటే వీరి హడావుడి కనిపించే ది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్యలో ఉండే నగరంలోని నిజంగా నడిబొడ్డు ప్రాంతం భోలాక్‌పూర్‌లో దాదాపు పదెకరాల స్థలంలో చిన్న శివాలయం. దేవునితోట ఈ రోజుకు కూడా ఆక్రమణలకు గురికాకుండా దాదాపు పదెకరాల స్థలం శివాలయానికి ఉండటం విచిత్రం. రంగారెడ్డి అనే స్థానిక భూస్వామి దశాబ్దాల కిందట అక్కడ వ్యవసాయం చేసే రోజుల్లో ఆలయానికి ఆ భూమి విరాళంగా ఇచ్చారు. దేవాదాయశాఖ స్వాధీనం తర్వాత అధికారిక ఆక్రమణ తప్ప ఇప్పటివరకు నగరం నడిబొడ్డులో అత్యంత ఖరీదైన ఆ భూమి ఆక్రమణలకు గురికాకపోవడం దైవ నిర్ణయమేమో అనుకుంటారు స్థానికులు. దేవుని తోటలోని చిన్న శివాలయంలో శివరాత్రి రోజు పూజ లు, వెంకయ్య గల్లీ వద్ద శివరాత్రి జాగారం కోసం సినిమా ప్రదర్శన, ఆటపాటలు, నాటకాల ప్రదర్శన ప్రతి ఏటా తప్పనిసరిగా కనిపించే దృశ్యాలు. టీవీ వచ్చేంతవరకు హైదరాబాద్‌లోని బస్తీల్లో ఈ దృశ్యాలు సర్వసాధారణం. విశ్వభారతి యువజన సం ఘం, తొలి హైదరాబాద్ మున్సిపల్ స్థానిక కౌన్సిలర్ శంకర్‌రావు వంటివారు ప్రారంభంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట రమేష్ అనే వ్యక్తి నాటకంలో సీత వేషం వేస్తే అతన్ని ఇప్పటికీ సీత అనే పిలుస్తారు. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో ఆ కాలం నాటక సమాజాలు బలంగా ఉన్నా ఎందుకో నాటక సమాజాల చరిత్రలో వీటికి పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇంట్లో వైకుంఠపాళి, అష్టా చెమ్మా ఆడేవారు కొందరు. చాలా ముందుగానే రోడ్డుమీద సినిమా సందర్శనకు స్థలం రిజర్వ్ చేసుకొనేవారు కొందరు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక స్లాబ్ విధానం అమలుచేయడం, అదే సమయంలో టీవీల ప్రవేశం మొదలుకావడంతో క్రమంగా టాకీస్‌లకు గడ్డుకాలం మొదలైంది. అప్పటివరకు ఉద యం ఆటలు తక్కువ రేటుతో పాత సినిమాలు ప్రదర్శించేవారు. మూడు షోలు కొత్త సినిమాలు ప్రదర్శించేవారు. శివరాత్రి రోజు జాగారం ఉండేవారి కోసం అర్ధరాత్రి 12.30కి ఒక షో, 3.30కి ప్రత్యేకంగా రెండు షోలు ప్రదర్శించేవారు. అంటే దాదాపు ఉద యం ఆరుగంటల వరకు సినిమా ప్రదర్శన ఉండేది. ఆ విధంగా సినిమా టాకీసులోనే వేలాదిమంది శివరాత్రి జాగారం పూర్తయ్యేది. 1976లో శివరాత్రి రోజున ఒకేరోజు అర్ధరాత్రి దాటాక 3.30కి దీపక్‌లో, సాగర్, శిష్‌మహల్ హైదరాబాద్‌లో, సికింద్రాబాద్‌లో ప్యారడైజ్‌లో ప్రత్యేకంగా పాండవ వనవాసం ప్రదర్శించారు. ఒక సినిమా విడుదలన పాతికేళ్ల తర్వాత ఒక నగరం లో నాలుగు టాకీసుల్లో ప్రదర్శించడం విశేషం. శివరాత్రి రోజున అర్ధరాత్రి ప్రత్యేకంగా ప్రదర్శించే సినిమాల్లో తప్పనిసరి గా నర్తనశాల, శ్రీ సీతారామ కళ్యాణం (సుదర్శన్ 35 ఎం. ఎం.), పాం డురంగ మహత్యం, దక్షయజ్ఞం (సుదర్శన్ 70 ఎం.ఎం.) మాయాబజార్, ఎన్టీఆర్ శివాజీ గణేశన్ నటించిన కర్ణ, శ్రీ కృష్ణవిజయం, లవకుశ, శ్రీకృష్ణ పాండవీయం, అక్కినే ని, యస్.వరలక్ష్మి నటించిన సతీసావిత్రి, అక్కినేని, జమున నటించిన శ్రీకృష్ణమాయ, చెంచు లక్ష్మీ, శ్రీ సత్యనారాయణ వ్రత మహత్యం వంటి సిని మాలు తప్పనిసరిగాఉండేవి. ఇప్పుడంటే వినాయక మంటపాల్లో కొన్ని ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్సులు ప్రదర్శిస్తున్నారుకానీ ఆ రోజుల్లో శివరాత్రి అంటే టాకీసుల్లో ఎక్కువగా పౌరాణిక సినిమాలే ప్రదర్శించేవారు. కొన్ని టాకీసు ల్లో పౌరాణిక సినిమాలు దొరక్కపోతే సాంఘిక సినిమాలు ప్రదర్శించేవా రు . జమ్రుద్ వంటి టాకీసుల్లో శివరాత్రి రాత్రి 12:45 కు బ్రహ్మ విష్ణు మహేష్ వంటి హిందీ పౌరాణిక సినిమాలు ప్రదర్శించేవారు.
వైకుంఠపాళిలో పాము పెద్ద ప్రమాదం. దాన్ని తప్పించుకొం టూ వైకుంఠం వరకు వెళ్ళాలి. వైకుంఠపాళిలో పాము బారిన పడ్డట్టుగానే స్లాబ్ సిస్టం సినిమా హాళ్లను మింగేసింది. నాగరికత హైదరాబాద్ బస్తీల్లోని సామూహిక పండుగల సంస్కృతిని మిం గేసింది. ఇంట్లో అందరూ కలిసి పండుగ జరుపుకొంటే ఈ రోజు ల్లో అదే సామూహికంగా పండుగ జరుపుకోవడం.
బుద్దా మురళి (జ్ఞాపకాలు 11-1-2018)
టాకీస్ 8 


9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మీ రోగమే మా భాగ్యం!

‘‘ఏరా..! అలా మెలికెలు తిరిగిపోతున్నావ్? ఏదో చెప్పాలనుకుంటున్నావ్?’’
‘‘ఆఫీసులో సుజాత అదోలా చూసింది..’’
‘‘చూడదా? కలిసి పనిచేస్తున్న వారికి ఆ మాత్రం అనిపించకుండా ఉంటుందా? కాటికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఎదురు చూస్తున్న వాడిలా కనిపిస్తున్నావ్.. నీకు అసలేమైంది?’’
‘‘వెటకారం చాలులే, నాకేమీ కాలేదు. నా కొత్త లుక్‌ను చూసి, జెలసీతో ఏదో మాట్లాడుతున్నావ్! హీరోలా ఉన్నాను నాకేంటి? ’’
‘‘నేనూ అదే అంటున్నాను. 45ఏళ్ల వయసు కూడా లేదు అప్పుడే తెలుగు సినిమా హీరోలా అరవై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నావు. బహుశా షుగర్ కావచ్చు.. టెస్ట్ చేయించుకున్నావా? ’’
‘‘షుగర్, బీపీ, థైరాయిడ్, న్యుమోనియా, ఓల్డ్ మోనియా అన్ని టెస్ట్‌లు చేయించుకున్నా.. నాకేమీ కాలేదు’’
‘‘పోనీ.. ఆ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉన్న యంత్రాలన్నీంటికీ పని కల్పిస్తూ అన్ని టెస్ట్‌లు చేయమనాల్సింది. ఏదో ఒక రోగం కచ్చితంగా బయటపడేది. ’’
‘‘రోజురోజుకూ నేను స్లిమ్‌గా తయారవుతున్నానని నీకు కుళ్లు..’’
‘‘ఏదో అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావ్ .. కొంపదీసి ..’’
‘‘్ఛ..్ఛ.. జీవితంలో సుఖమే లేదు ఇక సుఖరోగమా?’’
‘‘మరేంటిరా.. అలా అయిపోతున్నావ్... సడన్‌గా చూస్తే నేను కూడా నిన్ను అస్సలు గుర్తు పట్టలేదు. ’’
‘‘నువ్వేంటి.. వారం రోజుల పాటు పుట్టింటికి వెళ్లి వచ్చిన మా ఆవిడే చూడగానే నన్ను గుర్తు పట్టలేదు. ’’
‘‘నువ్వు ఏదో దాస్తున్నావు.. మహా నాయకులు, దేశాధినేతలు అనారోగ్యంతో ఉంటే వెంటనే ప్రకటించరు. రాజ్యం అల్లకల్లోలం అవుతుందని, పెద్ద పెద్ద కంపెనీల పాలకులూ అంతే. నువ్వో సాధారణ ఉద్యోగివి, వీలునామా రాసేంత ఆస్తి కూడా లేదు’’
‘‘అనారోగ్యం అని ఎందుకు అనుకుంటావ్? ఆరోగ్యం, కొత్త శక్తి వల్ల ఇలా అయ్యాననే ఆలోచన నీకు ఎందుకు రావడం లేదు’’
‘‘ఏదో దాస్తున్నావనేది మాత్రం నిజం’’
‘‘ టుమ్రీరావు ఆరోగ్య ఫార్ములాను అనుసరిస్తున్నా. దాని ఫలితమే ఇది. ’’
‘‘ఏంటో ఆ ఫార్ములా?’’
‘‘గురుముఖంగా నేర్చుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ట్రేడ్ సీక్రెట్ ఎవరికీ చెప్పవద్దన్నారు. ఐనా మిత్రుడివి కాబట్టి చెబుతున్నాను. నువ్వు ఉదయం ఏం చేస్తావ్?’’
‘‘ఏం చేస్తాం.. మా ఆవిడ లేస్తే టిఫిన్ చేస్తుంది.. నేనూ తింటాను. ముందు నేనే లేస్తే టిఫిన్ చేస్తాను.. ఇద్దరం తింటాం’’


‘‘మరదే.. అల్పమానవులు మీరంతా ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. రాత్రి నిద్ర పోతారు. కానీ మేమలా కాదు. టుమ్రీరావు ఫార్ములా దీనికి భిన్నమైంది. మేం ఉదయం భోజనం చేస్తాం. మధ్యాహ్నం టిఫిన్ చేస్తాం. పగలు పడుకుంటాం, రాత్రి మేల్కొంటాం. ఆఫీసు పని ఇంట్లో చేస్తాం. ఇంట్లో పని ఆఫీసులో చేస్తాం. భార్యను పలకరించం, పక్కింటావిడ చెప్పిన పని చేస్తాం . దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో నూటపాతిక సంవత్సరాలు బతుకుతాం.. నూటపాతికకు ఐదో పదో ఎక్కువే తప్ప తగ్గే ప్రసక్తే లేదని టుమ్రీ రావు గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పాడు.’’
‘‘నిజమా?’’
‘‘ఇలాంటి అపనమ్మకులతో ఈ ఫార్ములా గురించి మాట్లాడవద్దని, విశ్వాసుల వద్దనే మాట్లాడాలని టుమ్రీరావు అందుకే చెప్పారు’’
‘‘సరే.. నూటపాతిక సంవత్సరాలు బతుకతావనే అనుకుందాం. అంత కాలం బతికి ఏం చేస్తావురా? ఒంటరిగా బోరుకొట్టి పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకుంటావు. దాని కన్నా సకాలంలో మరణం మంచిది కదా?’’
‘‘నా మనోభావాలను అవమానిస్తున్నావ్..’’


‘‘టుమ్రీరావు ఈ ఫార్ములా రహస్యం నీకు చెప్పి ఎంత తీసుకున్నాడు’’
‘‘ఏడాదికి ఇంత అని నూటపాతిక సంవత్సరాల మొత్తం నాలుగు ఇన్‌స్టాల్ మెంట్లలో తీసుకున్నాడు.’’
‘‘అంత గ్యారంటీ ఇచ్చినప్పుడు ఫీజేదో నీకు నూటపాతిక సంవత్సరాలు వచ్చిన తరువాత తీసుకుంటే బాగుండేది కదా?’’
‘‘్ఫర్ములాపై నాకు నమ్మకం లేకపోతే కదా?’’
‘‘దీనే్న మార్కెట్ మాయాజాలం అంటారురా అప్పిగా .. రాందేవ్ బాబా  పతంజలి బ్రాండ్ పుణ్యమాని ఆయుర్వేదానికి, ఆరోగ్య రహస్యాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. టుమ్రీరావు కన్నా ముందు ఇంకో రావు ఇలానే బాగుపడ్డాడు..ఆకులు అలములు తిని శాశ్వతంగా బతకొచ్చు అని పాపం బాగానే చెప్పారు . చెప్పడం వరకు పరవాలేదు ఆచరించాడు కూడా . ఆకులూ అలములు తిన్న అయన ఆరోగ్యం , అయన మాట విన్న వారి ఆరోగ్యం ప్రమాదం లో పడిపోయింది . వాళ్ళు వీళ్లూ చెబితే నమ్మలేదు కానీ చివరకు అయన పరిస్థితే ప్రమాదం లో పడ్డాక కనిపించకుండా పోయారు .   టుమ్రీరావుల ప్రకృతి ఆహారానికి మంచి
 మార్కెట్ ఏర్పడింది. మహా మహా కోల్గెట్ కంపెనీ వాడే పతంజలి దెబ్బకు వేదాంత కోల్గెట్ అంటూ పురాణాలను నమ్ముకున్నాడు. నీకో రహసహ్యం చెప్పనా? ఈ మార్కెట్ టెక్నిక్ మీ టుమ్రీ రావు కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. కోల్గెట్ వంటి బహుళజాతి కంపెనీ పతంజలి కన్నా ముందే ఈ టెక్నిక్‌ను ఇండియాలో అమలు చేసింది. ఉదయం లేవగానే మనం టీ తాగుతాం కదా? దీనిపై నీ అభిప్రాయం?’’
‘‘ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.. టుమ్రీ రావులే కాదు నువ్వు ఏ డాక్టర్‌ను అడిగినా చెబుతారు.’’


‘‘నిజమే కదా? కానీ మొదట మన దేశంలో టీ అలవాటు చేసేందుకు ఏం చెప్పారో తెలుసా? దీర్ఘాయుష్షు కోసం టీ తాగమని ప్రకటనలు ఇచ్చారు. సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం ‘ఇండియా టీ వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుంది’ అని 4.1.1937 నాటి గోల్కొండ పత్రికలో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చారు. ఆయుష్షు పెరగడానికి టీ తాగమని ఆనాడే విస్తృత ప్రచారం చేశారు. కావాలంటే నెట్‌లో దొరుకుతుంది చూడు. ఏదో సమాచారం కోసం ఇంటర్నెట్‌లో అనే్వషిస్తుంటే ఆ ప్రకటన కనిపించింది. టీ ఎలా తయారుచేయాలో కూడా ఆ ప్రకటనలో నేర్పించారు. ఒకసారి మనకు అలావాటు అయ్యాక టీ లేనిదే బతక లేని స్థితికి చేరుకున్నాం. బ్రిటీష్ వాడు దేశం వదిలి వెళ్లినా ఆ కాలంలో వాడు అలవాటు చేసిన టీ మనల్ని ఇంకా వదలలేదు.’’
‘‘అంటే.. నిజం కాదా? ’’
‘‘అదేదో కంపెనీ అండర్‌వేర్ ధరిస్తే అందమైన అమ్మాయిలు మన వెంట పడతారనే ప్రకటనలు నమ్మడం లేదా? అలానే దీర్ఘాయుష్షు కోసం ఫలానా హోటల్‌లో తినండి, ఫలానా హీరో సినిమాలే చూడండి అని చెప్పినా మనం నమ్మేస్తాం. మన నమ్మకమే వారి వ్యాపారం. ఆరోగ్యం పేరుతో మనకు ఏదైనా అమ్మవచ్చునని 80 ఏళ్ల క్రితమే బ్రిటీష్ కంపెనీలు కనిపెట్టాయి.’’

బుద్దా మురళి (జనాంతికం 9-2-2018)

5, ఫిబ్రవరి 2018, సోమవారం

లవకుశులు తప్ప ఏదీ లేదు .. నటరాజ్‌లో లవకుశ




తెలుగు సినిమాల్లో అజరామరంగా నిలిచిపోయే సినిమాల పేర్లు కొన్ని చెప్పమంటే అందులో లవకుశ ఉండితీరుతుంది . 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో ఒక సంచలనం. చుట్టుపక్కల గ్రామాల నుం చి ఎడ్లబండ్లను కట్టుకొని ఈ సినిమాను చూసేందుకు వచ్చేవారు.సికింద్రాబాద్‌లోని నటరాజ్‌లో ఈ సిని మా విడుదలైంది. నటరాజ్‌కు దగ్గరలో ఉన్న క్లాక్‌టవర్ పార్క్ వద్ద ఆ రోజుల్లో జాతరలా ఉండేది. టికెట్ దొరక్కపోతే అక్కడే వండుకొని తిని తర్వాత షో చూసి వెళ్లేవారు. ఆ టాకీసు చరిత్రలోనే ఇదో సంచలనం. సికింద్రాబాద్‌లోని వీధులన్నీ ఇరుకిరుకుగా ఉంటాయి. నిజాంకాలంలో సికింద్రాబాద్ ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేరుగా ఉండేది. ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్రలో సికింద్రాబాద్‌ను పెద్ద బస్తీ అని పేర్కొన్నారు.

నాటి బ్రిటిష్ పాలకులు 1930 ప్రాంతంలో రోడ్ వెడల్పు చేద్దామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం నుంచి పుట్టిందే విశాలమైన కింగ్స్ వే.. దీనికి కూడా అనేక మలుపులున్నాయి. ఆ కాలంలోనే కొందరు బ్రిటిష్ అధికారులకు 15 వేల లంచం ఇచ్చి తమ దుకాణాలుపోకుండా ప్రయత్నించారు. 1930 ప్రాం తం నాటి ఈ వ్యవహారాన్ని ఆ కాలం వాళ్లు చెబుతుంటారు.

కింగ్స్ వే నుంచి నేరుగా వెళ్తే.. వందేండ్ల కిందట స్వామి వివేకానందుడు ప్రసంగించిన మహబూబ్ కాలేజీ హైస్కూల్ కనిపిస్తుంది. విశాలమైన ఆ స్కూల్ ఆవరణలో ఒకవైపు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ.. ఆ కాలేజీ ఎదురుగానే నటరాజ్ టాకీస్. ఆ కాలేజీ విద్యార్థిగా రోజూ నటరాజ్‌ను దర్శనం చేసుకున్న జ్ఞాపకాలు. నటరాజ్ టాకీస్‌కు బయటినుంచి దారి ఉండేవిధంగా ఇరానీ హోటల్. జేబులో డబ్బులుంటే అక్కడ టీ తాగుతూ సిని మా పోస్టర్ చూస్తూ చర్చలు. ఆమ్మో మీరు టీ తాగేందుకు హోటల్‌కు వెళ్తారా? మా ఇంట్లో వాళ్లు చూస్తే ఇంకేమన్నా ఉందా? అని ఆశ్చర్యపోయిన మిత్రుడు చదువు ముగిశాక సకల కళా వల్లభుడు అయ్యాడని తెలిసి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని పాడుకోవడం తప్ప ఏం చేయగలం. మహబూ బ్ కాలేజీ అంత కాకపోయినా విశాలంగా ఉండే ఆ జూనియర్ కాలేజీ ఇప్పుడు బక్కచిక్కిపోయి ఓ మూలకు పరిమితమైంది. చైతన్య నారాయణల వ్యాధిన పడి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల వలె సికింద్రాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా చిక్కి శల్యమైంది. అప్పటి కాలేజీలో ఇప్పుడు ఇంజినీరిం గ్ కాలేజీ పుట్టింది. సికింద్రాబాద్ పోస్టాఫీస్‌కు దగ్గరలో ఉం టుంది నటరాజ్ టాకీస్.

ఔను ఇప్పుడు అక్కడ టాకీస్ మాత్రమే ఉంటుంది. సినిమా ల ప్రదర్శన మాత్రం జరుగదు. ఇప్పుడు అక్కడో ఫర్నీచర్ షాప్. సినిమా టాకీస్‌ను యథాతధంగా అలానే ఉంచారు. నటరాజ్ అనే టాకీస్ పేరు కూడా అలానే ఉంది. టాకీస్ లోపల ఉన్న ఫర్నీచర్, కుర్చీలో అన్నీ తొలిగించి నటరాజ్‌లో ఫర్నీచర్ షాప్ ఏర్పాటుచేశారు.

80 ప్రాంతం నుంచి నటరాజ్‌లో అన్నీ హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. కానీ అంతకుముందు అద్భుతమైన తెలుగు సినిమాలెన్నో ఇందులో విడుదలయ్యాయి. దాదాపు ఐదేండ్ల కిం దట నటరాజ్ సినిమా హాల్‌గా మూతపడి ఫర్నీచర్ షాప్‌గా కొత్తరూపు సంతరించుకున్నది. తెలంగాణ, ఆంధ్ర, పట్టణాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ అనే తేడా లేకుండా లవకుశ సినిమా విడుదలైన ప్రతిచోట సంచలనమే.

సికింద్రాబాద్ నాలా బజార్ గవర్నమెంట్ స్కూల్‌లో ఏడవ తరగతి చదివేరోజుల్లో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరికి వెళ్ళాలంటే రెండు బస్సులు మారాలి. అలా తిరుమలగి రి వెళ్లి ఇంతదూరం నుంచి సికింద్రాబాద్‌కు రోజూ ఎలా వస్తాడో అని మిత్రుడిపై బోలెడు జాలిచూపాను. ఇప్పుడు తిరుమలగిరి దాటి 4 కిలోమీటర్లు వెళ్తే మా ఇల్లు. తిరుమలగిరి, అల్వాల్, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి, కాప్రా, నెరేడ్‌మెట్ ప్రాంతాలన్నీ ఆ రోజుల్లో గ్రామాలే, అమీర్‌పేట కూడా ఆ రోజుల్లో ఓ పల్లె, ఇటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆ రోజుల్లో గ్రామాలే. కొన్ని ప్రాంతాలు తొలుత గ్రామ పంచాయితీలు, తర్వాత మున్సిపాలిటీలు. 11 శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేశారు. అంతకుముందు అవన్నీ గ్రామాలు. 

ఇలాంటి గ్రామాలనుంచి ఎడ్లబండ్లపై లవకుశ సినిమా చూసేందుకు నటరాజ్‌కు వచ్చేవారు. ఈ రోజుల్లో మాదిరిగా అప్పుడు ఒకే సినిమాను వందల టాకీసుల్లో విడుదల చేసేవారు కాదు. ఇంత పెద్ద మహానగరంలో లవకుశ విడుదలైంది నటరా జ్, బసంత్ రెండు టాకీసుల్లో మాత్రమే. కొన్నిరోజుల తర్వాత సినిమా మరో టాకీస్‌లోకి మారేది. లవకుశ మాత్రం ఎన్నిరోజు లు అయినా నటరాజ్ దాటకపోవడంతో ఇతర ప్రాంతాలవారు బండ్లు కట్టుకొని నటరాజ్‌కు వచ్చేవారు. ఇప్పటి క్లాక్‌టవర్ పార్క్ లో ఎడ్లబండ్లను నిలిపి అక్కడే వంటలు వండుకొని సినిమా చూసి వెళ్లారని ఆ కాలంవారు చెబుతుంటా రు. ప్రధానమైన టాకీసుల్లో సినిమా ఓ వారం నడిచాక ఖైరతాబాద్‌లోని రీగల్ టాకీస్, అమీర్‌పేటలోని విజయలక్ష్మి టాకీస్‌కు ఆ సినిమాలు వచ్చేవి. ఆ రోజు ల్లో బేగంపేట రైల్వే స్టేషన్ ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో ముని ఆశ్రమంలా ఎంత ప్రశాంతంగా ఉందో చూడాలంటే పూల రంగడు సినిమా చూడొచ్చు. అందులో జమున కూరగాయలు అమ్ముకొంటున్నట్టు చిత్రీకరించింది అక్కడే. నాగేశ్వర్‌రావు గుర్రపు బండితో నిలుచునేది అక్కడే.

లవకుశ సినిమా విడుదలైన అన్ని టాకీసుల్లోనూ సంచలన మే. బసంత్, నటరాజ్, ఖమ్మంలో సుందర్, వరంగల్‌లో రాజేశ్వర్, నిజామాబాద్‌లో మోహన్ టాకీస్‌లలో ఈ సినిమా విడుదలైంది. లవకుశలో ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్, అం జలి, నాగ య్య, కాంతారావు, శోభన్‌బాబు, రేలంగి, రమణారెడ్డి, కన్నాం బ, గిరిజ, సూర్యకాంతం, యస్.వరలక్ష్మి ఇప్పుడు వీళ్ళెవరూ లేరు. దర్శకులు సి.పుల్లయ్య, సి.యస్.రావు, నిర్మాత శంకర్‌రెడ్డి, సంగీతం అందించిన ఘంటసాల వీరెవరూ ఇప్పుడు లేరు. ఆ సినిమా ప్రదర్శించిన టాకీసులు లేవు. లవకుశ సినిమా ప్రకటన నాటి ప్రముఖ పత్రికలు గోల్కొండ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జనతాలో ప్రధానంగా ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు ఆ పత్రికలూ లేవు. లవకుశులుగా నటించిన మాస్టర్ సుబ్రహ్మణ్యం, నాగరాజులు అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో కనిపించేవారు.

భారత చలనచిత్ర చరిత్రలో సంచలనం సృష్టించిన ఎన్నో సినిమాలను నటరాజ్‌లో ప్రదర్శించారు. షోలే సినిమా చాలారోజులు నడిచింది. అమర్ అక్బర్ అంథోని, ఖూన్ పసీనా, కభీ కభీ, మిస్టర్ నట్వర్ లాల్ సినిమాలు ప్రదర్శించారు. నిన్నేపెళ్లాడతా నటరాజ్‌లో చెప్పుకోదగిన చివరి సినిమా వందరోజుల ప్రదర్శన. ఫిరోజ్‌ఖాన్ నటించిన చార్ ధర్ వేశ్, దేవానంద్, మధుబాల నటించిన షరాబీ, అశోక్ కుమార్ నటించిన విక్టోరియా నెంబర్ 203, దాదిమా, యా దొంకి బారా త్ వంటి సూపర్‌హిట్ సినిమాలు ప్రదర్శించారు.

అక్కడివారిని పలుకరిస్తే ఇక్కడ టాకీసు ఉండగా మేం చూడలేదన్నారు. ఇప్పుడు అక్కడ పేరు నటరాజ్ అని ఉంది. కానీ అక్కడ సినిమా జ్ఞాపకాలేమి లేవు. పలుకరిస్తే నటరాజ్‌లో అమ్ముతున్న ఫర్నీచర్ గురించి చెప్పేవారే కానీ, నటరాజ్ లో ప్రదర్శించిన సినిమాలు, టాకీసు జ్ఞాపకాలను చెప్పేవారు అక్కడ కనిపించలేదు

బుద్ధా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 4. 2. 2018) 
టాకీస్ 7 

2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సూర్యుడి కిడ్నాప్!

‘‘శేఖర్.. అర్జంట్‌గా నువ్వు మా ఇంటికి రావాలి. ఆయన మాట అదోలా ఉంది. మీ ఇద్దరూ కూర్చున్నప్పుడు, కవితా పఠనంలో ఇలాంటి మాటలు చాలా సార్లు విన్నాను, కానీ పట్టించుకోలేదు.. నాతో కూడా అలానే ఏవేవో మాట్లాడుతున్నారు. ’’
‘‘ఏరా! నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. నువ్వే ఉల్కలా ఊడిపడ్డావ్.. మా ఆవిడ కంగారుపడి కాల్ చేసింది కదూ! నా మదిలో ఓ అద్భుతమైన ప్లాన్ మెదిలింది. సక్సెస్ అయితే ప్రపంచం మనకు దాసోహం అంటుంది.’’
‘‘అంత గొప్ప ప్లాన్ ఏంటో చెప్పు’’
‘‘మనం భూకంపం సృష్టించబోతున్నాం. ప్రపంచ దేశాలను మన మార్గం పట్టించబోతున్నాం.’’
‘‘దావోస్‌ను మా ఊరికి  లాక్కోస్తానంటూ ఆయనెవరో గత రెండేళ్ల నుంచి చెబుతున్నట్టు నువ్వు ప్రపంచ దేశాలను మీ అపార్ట్ మెంట్ కు లాక్కురావాలనుకుంటున్నావా?’’
‘భూకంపం సృష్టిస్తా .. భూ మార్గం పట్టిస్తా- అని మహాకవి శ్రీశ్రీ అప్పట్లో అంటే అంతా ‘ఆహా.. ఓహో..’ అన్నారు. నేను నిజంగానే భూ కంపం సృష్టించే ఐడియా చెబుతానంటే ‘హీ..హీ’ అని నవ్వుతున్నావా? ’’
‘‘కవిత్వంతో ఆలోచనల భూకంపం వేరు, నువ్వు చెబుతున్న భూకంపం వేరు. ’’
‘‘తాన్‌సేన్ రాగాలతో వర్షాన్ని కురిపించినప్పుడు, మంటలు సృష్టించినపుడు నిజమని నమ్మినప్పుడు నా మాటలెందుకు నమ్మవు.’’
‘‘ఇంతకూ ప్రపంచాన్ని కుదిపేసే ఆ విషయం ఏంటో చెప్పు ’’
‘‘సూర్యుడ్ని కిడ్నాప్ చేద్దాం..’’
‘‘వాడెవడు? మీ ఆఫీసులో క్లర్కా? నగరమనంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆఫీసులో ఏవైనా గొడవలు ఉంటే, మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా కిడ్నాప్ చేస్తామనడం మంచిది కాదు’’
‘‘ నేను సూర్యుడి కిడ్నాప్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆఫీసులో బోడి సూర్యారావు గురించి చెబుతున్నావ్..’’
‘‘సూర్యుడేమన్నా మనిషా గొంగడి కప్పి కారులో కిడ్నాప్ చేసేందుకు.?. ’’
‘‘ఆయనెవరో రుషికి కోపం వచ్చి సముద్రాన్ని కమండలంలో బంధించ లేదా? మూడు లోకాలపై మూడు కాళ్లు పెట్టిన దేవుడి అవతారం గురించి తెలియదా? వీరహనుమాన్ బాల్యంలోనే సూర్యుడిని మింగేందుకు వెళితేనే కదా మూతి ఎర్రగా కాలింది.వాళ్లకు సాధ్యం అయింది మనకు కదా మనిషిని తక్కువగా అంచనా వేయు కు మానవుడే మహనీయుడు అని ఘంటసాల ఎప్పుడో అన్నారు ’’
‘‘అవన్నీ పురాణాలు ’’
‘‘ఒక నాటి చరిత్రే తరువాత  పురాణాలు. చంద్రగ్రహం, సూర్యగ్రహం వంటివి నమ్ముతావు కదా? రాహుకేతువులు తెలుసు కదా? రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడం సాధ్యం అయినప్పుడు కిడ్నాప్ చే యడం ఎందుకు సాధ్యం కాదు?’’
‘‘సరే.. నిజమే అనుకుందాం కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెడతావు? మీ డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో దాచిపెడతావా? ’’
‘‘ఎక్కడ దాచిపెడదామనేది తరువాత. ఈ కిడ్నాప్‌లో నువ్వు నాకు సహకరించాలి’’
‘‘అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టు మొదటి కిడ్నాప్ సూర్యుడితోనే ఎందుకు? పోనీ చంద్రుడ్ని కిడ్నాప్ చేస్తే కొంచెం సేఫ్ కదా!’’
‘‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే  కొట్టాలి. కిడ్నాప్ చేస్తే సూర్యుడ్నే చేయాలి, బ్రాండ్ అంబాసిడర్ హక్కులుమనమే  సాధించాలి. ’’
‘‘కిడ్నాప్ చేసి ఏం చేద్దామని నీ ఆలోచన?’’
‘‘చార్మినార్ వద్ద మదీనా హోటల్ గురించి తెలుసా? ’’
‘‘మదీనా లో సూర్యుడ్ని దాచి పెడతావా? అందులో టీ చాలా బాగుంటుంది. సూర్యుడ్ని అందులో దాచడం సాధ్యం కాదు. ’’
‘‘పూర్తిగా విను.. ఇప్పుడు పెట్రోల్ డబ్బులతో సంపన్న దేశాలుగా వెలిగిపోతున్న ఎన్నో గల్ఫ్ దేశాల కన్నా మన దేశం సంపన్నంగా ఉండేది. మక్కా యాత్రీకులకు సహాయం చేసేందుకు ఆ కాలంలో మదీనా హోటల్ కట్టారు. పెట్రోల్ వల్ల గల్ఫ్ దేశాలు, సాంకేతిక విప్లవం వల్ల యూరప్ దేశాలు, సహజ వనరులతో మరెన్నో దేశాలు సంపన్న దేశాలుగా మారాయి. సూర్యుడ్ని కి డ్నాప్ చేస్తే అమెరికా, దావోస్, గల్ఫ్.. వాళ్ల అబ్బలాంటి దేశాలు కూడా జీ హుజూర్ అంటూ మనలను వేడుకోవలసిందే. వాళ్లు పెట్రోల్ అమ్ముకొని బలిసినట్టు, మనం సూర్యుడి వేడిని అమ్ముకుని సంపన్నుల మవుదాం. ’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘సూర్యుడు లేకపోతే జీవరాశి బతుకుతుందా? ’’
‘‘ఒక్క క్షణం కూడా బతకలేదు. చెట్టు, చేమ, పుట్ట, సమస్త జీవకోటి సూర్యుడి వల్లనే బతుకుతుంది. సూర్యుడు లేకపోతే ప్రాణకోటి లేదు, ప్రకృతి లేదు. ’’
‘‘కదా..! అందుకే అలాంటి సూర్యుడినే కిడ్నాప్ చేసేద్దాం. గల్ఫ్ దేశాలు ప్రపంచానికి గ్యాలన్లలా పెట్రోల్ అమ్మి బతికినట్టు, మనకు డబ్బులు చెల్లించిన వారికే సూర్యుడి వేడి అందేట్టు చేద్దాం.’’
‘‘ఈ పనేదో అర్జంట్‌గా చేసేయాలి. ఆలస్యం అయితే సూర్యుడే ఉండడు. సూర్యుడు వృద్ధుడవుతున్నాడని ఓ వెబ్‌సైట్‌లో బ్రేకింగ్ న్యూస్ చూశాను. పది మిలియన్ సంవత్సరాలకు సూర్యుడు వృద్ధుడై అంతరించి పోతాడట! ఇప్పటికే రెండు మిలియన్ సంవత్సరాల కాలం గడిచిపోయిందట.. వెబ్‌సైట్ తమ్ముడు సూర్యుడితో మాట్లాడివచ్చినట్టుగా చక్కని వార్త ప్రసారం చేశాడు.’’
‘‘ప్లాన్ మొత్తం రెడీ అయింది ’’
‘‘ఓ నేత సూర్యుడు మా బ్రాండ్ అంబాసిడర్, సూర్యుడు మొదట ఉదయించేది మా ఊరిలోనే అని చెప్పారు కదా? సూర్యుడ్ని నువ్వెట్లా సొంతం చేసుకోగలుగుతావ్? ’’
‘‘ చెప్పాడు కానీ సూర్యుడి పై అయన ఇంకా కాఫీ రైట్ హక్కులు సాధించలేదు . ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంటూ విస్తృత ప్రచారం ప్రారంభించక ముందే సూర్యుడిని కిడ్నాప్ చేసేస్తాం.. ఎవరికీ తెలియని రహస్యం చెబుతున్నాను- సూర్యుడు మొట్టమొదట ఉదయించేది గోల్కొండ చౌరస్తా నుంచి ముందుకు వెళితే వచ్చే గాంధీనగర్ రెండవ వీధి బంగ్లాపైన . మొన్న పార్టీ ఆలస్యం కావడంతో రాత్రంతా ఆక్కడే ఉండిపోవలసి వచ్చింది. తెల్లారి లేచాక సూర్యుడు మొదట అక్కడే ఉదయించడం కళ్లారా చూసాను.  అది మా ఫ్రెండ్ ఇళ్ళే . రాత్రికి అక్కడ మాటు వేసి సూర్యోదయం కాగానే కిడ్నాప్ చేద్దాం. సూర్యుడ్ని కిడ్నాప్ చేశాక కాపీరైట్ హక్కులన్నీ మనకే ఉంటాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు వాడుకున్నా కప్పం కట్టాల్సిందే’’
‘‘సూర్యుడి కిడ్నాప్ ఆపరేషన్ అమలుకు మెరికల్లాంటి వారు కావాలి. సూర్యుడిని కిడ్నాప్ చేసేందుకు నాతో కలిసి రావాలి  అని జాతి జనులకు పిలుపు ఇస్తున్నాను  ’’
***
‘‘అమ్మాయ్.. మీ ఆయనకు ముందు మజ్జిగ ఇవ్వు. టీవీలో ‘సూర్యుడు మావాడే’ అంటూ సాగుతున్న ఉపన్యాసాలను అదే పనిగా విని, నిద్రపోయి లేచాడు. ఆ ప్రభావం ఇంకా ఉండడంతో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవి మామూలు కలవరింతలే.. కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధ్యం అయినంత వరకు టివిలో ఉపన్యాసాలు , వార్తలను సీరియస్ గా తీసుకోకుండా చూడండి  ’’
*
-బుద్దా మురళి (జనాంతికం 2-2-2018)