8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

తెలుగు సినిమా -భాష -కాంగ్రెస్ -చిరంజీవి

‘‘ఇప్పుడెంతో హాయిగా ఉంది. ఏమవుతుందో అనే టెన్షన్‌తో ఇన్నాళ్లూ బుర్ర వేడెక్కింది. ఇ ప్పుడు ఆకాశంలో పక్షిలా విహరిస్తున్నంత హాయిగా ఉంది’’
‘‘దేనికి టెన్షన్? రైళ్లో వచ్చావా? పరీక్షలన్నాక తప్పే వాళ్లూ ఉంటారు. పట్టాలున్నదే తప్పడానికి, అసలు పట్టాలు తప్పినప్పుడే పట్టాలంటూ ఉంటాయని తెలిసేది. దానికి టెన్షన్ ఎందుకు?’’
‘‘రైలు పట్టాలు తప్పితే ఆశ్చర్యపోయేంత అమాయకుడిలా కనిపిస్తున్నానా?’’


‘‘ టెన్షన్ దేనికి? రింగురోడ్డు మీద కారును బస్సు ఢీకొట్టినట్టు వారం రోజుల్లో అదేదో గ్ర హం వచ్చి భూమిని ఢీ కొడుతుంది. అంతా చనిపోతారని వాడెవడో చెప్పిన జోస్యం గురించా?’’
‘‘వారంలో యుగాంతం అని ప్రతి వారం ఎవరో ఒకరు జోస్యం చెబుతూనే ఉంటారు. చిన్నప్పుడు తెగ భయపడేవాడ్ని, ‘నాసా’నో ఇంకేదో కానీ ఐదువేల ఏళ్లలో భూమి అంతరించి పోతుందని ఓ నాలుగు దశాబ్దాల క్రితం ప్రకటించింది. ప్రతి రోజూ నిద్ర పోయేప్పుడు ఐదువేల ఏళ్లలో ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయని లెక్కపెట్టే వాణ్ణి. ఓ నెల గడిచాక బోర్ కొట్టేసి నేను బతికున్నంత వరకు ఐదువేల ఏళ్లు పూర్తి కావని తెలిసింది. నేను పోయాక కొన్ని వేల ఏళ్ల తరువాత భూమి ఆంతరిస్తే ఇప్పటి నుంచే ఆందోళన అవసరమా? అని నన్ను నేను సముదాయించుకున్నాను. చిన్నప్పుడు ‘నాసా’ చెబితేనే తేలిగ్గా తీసుకున్నా. చిలకజోస్యం వాడు చెబితే పట్టించుకుంటామా? ’’


‘‘రోజూ అబద్ధాలతో నీ బుర్ర వేడెక్కింది. ఇప్పుడు బాబుగారు అన్నీ నిజాలే మాట్లాడాలంటూ కర్తవ్యబోధ చేశారు అందుకే కదా నీలో సంతోషం ’’
‘‘పిచ్చోడా!ప్రతివాడూ ఎదుటి వాడు నిజాలు మాట్లాడాలని కోరుకుంటాడు. ఆ ప్రతివాడిలో నువ్వూ ఉంటావు, నేనూ ఉంటాను బాబూ ఉంటారు. తాను తప్ప అంతా నిజాలే మాట్లాడాలని అనుకోవడంతో ఏతావతా తేలేది ఏమంటే నిజాలు ఎవరూ మాట్లాడరు. రాజుగారింట్లో పెళ్లికి తలో చెంబుడు పాలు తెమ్మంటే ప్రతివాడూ ఎవరు చూడొచ్చారని నీళ్లు పోస్తాడు.. ఆ కథ తెలుసు కదా? ఆ పాల చెంబులోని నీళ్ల లాంటివే నిజాలు. టెక్నాలజీ పెరిగితే- ఊపిరి పీల్చుకోకున్నా బతికే రోజులు వస్తాయేమో కానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా రాజకీయాల్లో ఉంటూ నిజాలు మాట్లాడే రోజులు రావు. నీ ప్రశ్న సిల్లీగా ఉంది. అబద్ధాలు లేని ప్రపంచాన్ని ఊహించలేం’’
‘‘అంటే అందరివీ అబద్ధాలేనా?’’


‘‘అష్టాదశ పురాణాల్లో అబద్ధం చెప్పని ఏకైక పాత్ర ధర్మరాజు. చివరకు అతనూ అబద్ధం ఆడాడు. దేవుళ్లే అబద్ధాలు అడందే బతకలేనప్పుడు? ఇక మనిషి ఎంత? రాత్రి ఆలస్యంగా ఇంటికెందుకు వచ్చావని భార్య అడిగిన ప్రశ్నకు నిజాలు మాట్లాడితే బతుకు జడ్కాబండికి చేరుతుంది. రోజా చెంప దెబ్బకొడుతుంది, జీవిత తిడుతుంది. సుమలత ఏడిపిస్తుంది. ఇంటర్వ్యూకని చెప్పి ఎక్కడికెళ్లావురా? అని తండ్రి అడిగినపుడు కొడుకు నిజం చెబితే రోడ్డున పడతాడు. బాస్ అడిగిన వాటికి నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది. అంతెందుకు? ఈ భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో తెలుసా? అబద్ధం అనే ఇరుసును ఆధారంగా చేసుకుని తిరుగుతుంది. అబద్ధం లేకపోతే జీవితమే కాదు, అసలే భూమి నిలువదు. అంత పవిత్రమైన అబద్ధాన్ని తక్కువ చేయడం అన్యాయం. మన జీవితానికి ఆసరా ఇచ్చే అబద్ధాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. ఓటుకు నోటు కేసులో బాబైనా, కెసిఆరైనా నిజం చెబితే ఇంకేమైనా ఉందా? కేసు భయం, పదవీ గండం ఆయనది, సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతిలో శాంతిభద్రతల సమస్య ఈయనది. నిజం ఇద్దరికీ నష్టం.. అబద్ధం ఇద్దరికీ క్షేమం. విన్‌విన్ స్ట్రాటజీ అన్నట్టు. అబద్ధం ఇద్దరినీ గెలిపించి, ఆశలు పెట్టుకున్న జగన్‌ను ఓడిచింది. ఇద్దరం జైలు నేతలమే అని జగన్‌కు చెప్పుకునే చాన్స్ లేకుండా చేశారు’’
‘‘ఐతే హైదరాబాద్ పోలీసులు హత్యాయత్నం చేసిన కేసును పన్నెండు  గంటల్లోనే ఛేదించినందుకా సంతోషం?’’
‘‘నువ్వేక్కడున్నావ్? హైదరాబాద్‌లో జరిగిన సంఘటన హైదరాబాద్‌లో ఉండే పోలీసులు చేధించేందుకు పన్నెండు  గంటలు పట్టింది. కానీ దేశంలో అక్కడెక్కడో హత్య జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిజిపి కూడా ఎవరు చేశారో చెప్పలేదు కానీ వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో ఐదు నిమిషాల్లో నిందితులు ఎవరో చెప్పడమే కాకుండా శిక్షను కూడా ఖరారు చేశారు. టెక్నాలజీ బాగా పెరిగింది.. నువ్వే చాలా వెనుకబడి ఉన్నావ్’’


‘‘నేనూహించలేను నువ్వే చెప్పేయ్. కొంపతీసి ముఖ్యమంత్రి పిల్లలు కనమని చెప్పారని ఆ పనిలో పడతావే ఏంటి? ’’
‘‘మనకంత అదృష్టమా? అది కాదు కానీ.. కనీసం మనం ఇంకా ఓ 20 ఏళ్లు బతుకుతాం కదా?’’
‘‘ఈ పొల్యూషన్ ఇంత కన్నా పెరగకుండా ఉంటే మందులతో బతకొచ్చు’’
‘‘ఈ 20ఏళ్ల జీవితం ఎలా గడపాలా? అని జీవితంలో చాలా టెన్షన్‌గా ఉండేది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, రవితేజ కుమారుడు, పూరీ జగన్నాథ్ కుమారుడు హీరోలుగా నటించేందుకు అంగీకరించారు. ఈ జీవితానికి ఇంకేం కావాలి? మన శేషజీవితం హాయిగా గడిచిపోవడానికి మనమీద కరుణించి వాళ్లు హీరోలుగా నటించేందుకు ఒప్పుకున్నారంటే ఇంత కన్నా అదృష్టం ఏముంటుంది? ఆ వార్త తెలిసినప్పటి నుంచి ఆకాశంలో తేలిపోయినట్టుంది. ఆ తరువాత నాగచైతన్య సమంత సంతానం ఎలాగూ మనల్ని ఆదుకుంటుంది. హీరోలుగా నటించేందుకు ఒప్పుకుంటూ..’


‘‘నీ సంతోషం నీ ఇష్టం. కాంగ్రెస్, తెలుగుసినిమా ఒకే విధంగా ఉందనిపిస్తోంది. ఒకటి వంద దాటింది. ఇంకోటి వందకు చేరువగా ఉంది. రెండూ క్రమంగా క్షీణిస్తున్నాయి. ఆరుపదులు దాటిన  యువ నేతలు, సినిమాల్లో ఆ వయసు వారే హీరోలు. రెండూ ఒకప్పుడు బాగా బతికాయి. కాలం తెచ్చిన మార్పులను అర్థం చేసుకోలేక రెండూ దెబ్బతింటున్నాయి. రెండింటికి వారసులే గుదిబండగా మారారు. అన్ని సినిమాలను హనుమంతన్న ఆదుకోలేడు కదా? ఆ బాబా ఎవరో కాళ్లతో తన్నడమే దీవించడం అట .. పోస్టర్ చింపడమే హనుమన్న దీవెనలు .. సినిమా పోస్టర్ లు చింపడం లో పడిపోయి పార్టీ పోస్టర్ చిరిగిపోతున్న విషయం మరిచి పోతున్నారు  ’’
‘‘కాంగ్రెస్‌కు, తెలుగు భాషకు, తెలుగు సినిమాకు మరణం లేదు.’’
‘‘మరణం లేకపోవడం వేరు, బతకడం వేరు. బతకడం వేరు, బాగా బతకడం వేరు. బతికి బట్టకట్టాలంటే రెండింటికీ కొత్తరక్తం కావాలి. కొత్త ఆలోచనలు కావాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 8. 9. 2017) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం