10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

పురుచ్చితలైవి- 2

‘‘తెలుగు పాపులర్ సినిమా తమిళ్ డబ్బింగ్ చూస్తున్నట్టుగా ఉంది?’’
‘‘న్యూస్ చానల్స్‌లో సినిమానా?’’
‘‘తెలుగునాట 1995లో జరిగింది. 22ఏళ్ల తరువాత ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది. కథ పాతదే కానీ, కాలానికి తగ్గట్టు పాత్రలను కొంత మార్చారు. ఇక్కడ ఎన్టీఆర్ సమాధి వద్ద కనిపించిన సీన్ లే  అక్కడ- చెన్నైలో మెరీనా బీచ్ వద్ద జయలలిత సమాధి లో రిపీట్ అవుతున్నాయి . ’’
‘‘ప్రాంతీయ పార్టీని, ఉచిత పథకాలను, పసుపు రంగును తమిళనాడు నుంచి తెలుగునాడు కాపీ కొడితే, ఇప్పుడు జరుగుతున్న సినిమా మొత్తం తెలుగునాడు నుంచి తమిళనాడు కాపీ కొట్టింది. ’’
‘‘నిజమా?’’
‘‘అనుమానం ఎందుకు? ఇంకో విచిత్రం 1984 నాటి సినిమా గుర్తు చేసుకో, ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియో గోడ మీద నిలబడి ప్రజాస్వామ్య విజయం అంటూ వెంకయ్యనాయుడు ఆవేశపూరిత నినాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. విద్యాసాగర్‌రావూ ఉన్నరక్కడ. ఇప్పుడు వాళ్లే అదే కథతో తమిళ సినిమాలో ప్రత్యర్థి వైపు ప్రధాన పాత్రధారులుగా నిలబడ్డారు. అవే పాత్రలు మళ్లీ పోషించేందుకు వాళ్లది చిన్నా చితక పార్టీ కాదాయె.. కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న పార్టీ ’’
‘‘ఇంతకూ తమిళనాడులో ఏం జరుగుతోంది ?’’
‘‘అంతా కొండ- వెంట్రుక ఆటాడుతున్నారు’’
‘‘జల్లికట్టులా ఇలాంటి ఆట కూడా ఉందా?’’
‘‘ప్రతి మనిషి జీవితంలో ఈ కథ తత్త్వం ఇమిడి ఉంటుంది. నీలో- నాలో సైతం ’’
‘‘ నేనెప్పుడూ వినలేదు’’


‘‘ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరిగా ఎంపిక కాగానే పిచ్చి కవిత్వమంతా కక్కేసి ఆమెకు ప్రేమలేఖ రాశావు. ఆమెకు తెలుగు రాదు అంటే నువ్వేమన్నావ్? కన్నడ లిపి, తెలుగు లిపి దగ్గర దగ్గరగానే ఉంటాయి. చదివి ఆమె మురిసిపోతే ఓకే.. లేదంటే ఒక ఉత్తరమే కదా అని అన్నావా? లేదా? ’’
‘‘ ఆ రోజుల్లో అందంగా ఉన్న హీరోయిన్‌లందరికీ ఇలానే లవ్ లెటర్స్ రాసే వాడిని. ఒక్క లెటర్‌కూ రిప్లై రాలేదు’’
‘‘దీన్నే  కొండ- వెంట్రుక తత్త్వం అంటారు’’
‘‘ ఆ రోజుల్లో ఐశ్వర్యారాయ్‌ని ప్రేమించనోళ్లు ఉన్నారా? నేను రాయి వేశా, నువ్వు వేయలేదు. ఐనా- తమిళనాడు రాజకీయాలకు, నా ప్రేమకథలకు సంబంధం ఏంటి?’’


‘‘ఓ ఉత్తరం- వస్తే ఐశ్వర్యారాయ్ అనుకున్నట్టే, తమిళనాడులో కేంద్రం సహా అంతా ఇదే ఆట ఆడుతున్నారు. కొండను వెంట్రుకతో లాగడం అంటారు దీన్ని. వస్తే కొండ వస్తుంది. పోతే ఓ వెంట్రుక పోతుంది. ’’
‘‘1995లో తెలుగునాట ఎం జరిగిందో, తమిళనాడులో ఇప్పుడు అదే జరుగుతోంది. అందుకే ఫలితం ఎలా ఉంటుందా? అని తమిళులతో పాటు తెలుగువారు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథ రోజుకో మలుపు తిరుగుతోంది. కమెడియన్ అనుకున్న తమిళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఒక్కసారిగా ‘కబాలి’ అన్నట్టు డైలాగులు మార్చేస్తున్నాడు. అసలేం జరుగుతోంది? ’’


‘‘ అదేదో సినిమాలో గంగ ‘చంద్రముఖి’గా మారినట్టు జయలలిత మృతి తరువాత తమిళనాడులో నేతలంతా ఒక్కసారిగా తమ తమ పాత స్టైల్‌ను పాతరేసి విజృంభించేస్తున్నారు. చివరకు కేంద్రం, గవర్నర్ సైతం.. ’’
‘‘వీళ్లు కొట్లాడుకుంటే వాళ్లేం చేస్తారు? ప్రధానమంత్రేమో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ‘స్నాన’ విశేషాలను పార్లమెంటులో చెబుతున్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ విద్యాసాగర్‌రావు పెళ్లిళ్లు, పేరంటాళ్లకు తిరుగుతున్నారు. మధ్యలో వాళ్లనెందుకంటావు? ’’
‘ఢిల్లీ లో  చక్రం తిప్పిన అనుభవంతో మోదీని అరెస్టు చేస్తా అని పలికిన బాబు అదే మోదీ వద్ద వంగి నిలుచోవడం చూశావు కదా? సర్వ స్వతంత్ర తెలంగాణ సిఎం కెసిఆర్‌కు మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చి టైం లేదు పో అన్నారు కదా? మరి జయలలిత విషయానికి వస్తే మోదీనే  చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్లి పరిచయం చేసుకుని వచ్చారు. తమిళనాడు అంటే అంత శక్తిమంతమైంది. దేశంలోనే స్వతంత్ర దేశం లాంటిది. శత్రు దుర్బేధ్యం లాంటి తమిళనాడు కోటకు బిజెపి వెంట్రుక వేసి లాగింది. వస్తే కోట వస్తుంది. పోయేందుకు తమిళనాడులో ఆ పార్టీకి ఏమైనా ఉంటే కదా? దీన్నే  కొండను వెంట్రుకతో లాగడం అంటారు. ఈ అటలను మొదట బిజెపి మొదలు పెట్టింది. తరువాత అంతా ఫాలో అవుతున్నారు.’’
‘‘అంతే అంటావా? ’’


‘‘ఇంకా అనుమానం ఎందుకు? ప్రాంతీయ పార్టీలో బలమైన నేతను ఏ నాయకుడూ నమ్మడు. అందుకే జయలలిత పన్నీర్ సెల్వంను పదే పదే ముఖ్యమంత్రిని చేసింది. ఆ నమ్మకాన్ని సెల్వం నిలబెట్టుకున్నాడు. పట్టుమని పది మంది మద్దతు కూడా కూడగట్టుకోలేక పోయాడు. తనకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ చెబితే, ఆరుగురు ఎమ్మెల్యేలు వెంట రాగా పన్నీరు సెల్వం గవర్నర్ ముందు బల నిరూపణ చేస్తానంటే అర్థం కావడం లేదా? అచ్చంగా సెల్వం కూడా అంతే.. వస్తే సిఎం పీఠం, కొత్తగా పోయేదేముంటుంది?’’
‘‘మరి డిఎంకె?’’
‘‘ఇంకో నాలుగేళ్లు విపక్షంలోనే ఉండాలి. అధికార పక్షం రెండుగా చీలిపోతే అధికారం ముందస్తుగానే వస్తుంది. అందుకే పన్నీరు సెల్వంకే మా ఓటు అని స్టాలిన్ ప్రకటించాడు. వస్తే అధికారం, కొత్తగా పోయేదేమీ లేదు. అలనాడు కాంగ్రెస్‌ను నమ్ముకొని చరణ్‌సింగ్ ప్రధానమంత్రి పదవి చేపట్టినట్టు ఉంటుంది- డిఎంకెను నమ్ముకుని అన్నాడిఎంకె నేత ముఖ్యమంత్రి పదవి కి పోటీ పడడం .’’


‘‘సెల్వం క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే? ’’
‘‘వైస్రాయ్‌లో చంద్రబాబు క్యాంపులా అంత పాపులర్ కాలేదు. కానీ అప్పుడు ఎన్టీఆర్ గోల్కొండ హోటల్‌లో ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించారు. రోజురోజుకూ పలచబడడంతో తిండి దండగ అని క్యాంపు ఎత్తేశారు. తమను గెలిపించిన ఎన్టీఆర్‌నే ఎమ్మెల్యేలు వదిలేశారు. మళ్లీ కనీసం తానైనా గెలుస్తాడో లేదో తెలియని పన్నీరు సెల్వంను నమ్ముకుని ఎమ్మెల్యేలు ఉంటారా? ‘చిన్నమ్మ’లోనే ‘అమ్మ’ను చూసుకోక తప్పదు. సెల్వం మరో లక్ష్మీపార్వతి కావడం ఖాయం.’’


‘‘అంటే- శశికళ తప్ప అందరిదీ కొండ- వెంట్రుక తత్త్వమేనా? ’’
‘‘ఆమెకు వచ్చేదే తప్ప పోయేది ఏమీ లేదు’’
‘‘టెన్షన్‌తో గుండెపోటు వస్తుందేమో?’’
‘‘రాదు.. అమె మూడు దశాబ్దాల పాటు జయలలితకు నీడలా ఉంది.జయలలిత నీడ కూడా భయపడదు ’’


‘‘ఇంతకూ ఏం జరుగుతుందో చెప్పలేదు?’’
‘‘శశికళ నిన్నటి వరకు జయలలితకు చెలికత్తె. బిజెపి వారు కొండ-వెంట్రుక ఆటతో ఆమెను ‘పురుచ్చితలైవి- 2’ను చేశారు. కేంద్రాన్ని ఎదిరించిన వీరవనితగా జయలానే అభిమానులతో ఆమె పూజలు అందుకునేట్టు చేశారు.’’ *

బుద్ధా మురళి (జనాంతికం 10-2-2017)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం