11, సెప్టెంబర్ 2016, ఆదివారం

నడుస్తున్న సినిమా!

‘‘వాళ్లిద్దరూ ఎన్టీఆర్ సావిత్రిలా, అక్కినేని వాణిశ్రీలా, శోభన్‌బాబు జయలలితలా, రాజబాబు, రమాప్రభలా చెట్టాపట్టాలేసుకొని తిరిగే వారు కదా? ఇప్పుడేమైంది. అలా తిట్టుకుంటున్నారు.’’
‘‘ఎన్టీఆర్, అక్కినేనిల మునిమనవళ్లు, దూరపు బంధువులు కూడా హీరోలయ్యారు. నువ్వు అక్కడే ఆగిపోయావు’’
‘‘ మరీ సాంకేతికంగా తప్పులను వెతికి చూడకు. ఆ పంచాయితీ ఏంటో తెలిస్తే చెప్పు’’


‘‘వాళ్లిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగింది నిజమే! పెళ్లి అనే పదం ఉపయోగించేందుకు సాంకేతికంగా ఇబ్బంది వస్తుంది. భార్య హోదా కన్నా ఎక్కువ హోదా ఇస్తాను అని ప్రపోజ్ చేశాడట! అమ్మాయి అన్నయ్యకు చిర్రెత్తి మాట ఇచ్చేప్పుడు ఈ సంగతి గుర్తుకు రాలేదా? అని వాడి మూతి పగులగొట్టాడు’’
‘‘రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది’’


‘‘ఊరక రారు మహానుభావులు’’
‘‘రాజకీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామని వచ్చాను’’
‘‘కల్వకుర్తి ఎత్తి పోతల పథకాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 12ఏళ్ల క్రితం తొమ్మిదేళ్లపాటు మేం పాలించినప్పుడే ప్రాజెక్టు పూర్తి చేశాం, ప్రాజెక్టు కనిపించకుండా దాచిపెట్టి ఇప్పుడు చూపిస్తున్నారని తెలంగాణ టిడిపి నాయకులు గోల. నీలం సంజీవరెడ్డి కాలంలోనే ప్రాజెక్టు పూర్తి చేసి బిజీగా ఉండడం వల్ల ప్రారంభోత్సవం మరిచిపోయామని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు. హరీశ్‌రావు అర్థరాత్రి వరకు ప్రాజెక్టు వద్ద నిద్ర చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు అని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు’’
‘‘ప్రాజెక్టుల కోసమే ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న వాళ్లు ఒక రోజు ముందో వెనకో ప్రాజెక్టులు కట్టుకుంటారు. అందులో పెద్ద విశేషం ఏముంది కానీ.. నేను అడిగేది దాని గురించి కాదు.. విశేషాలు ఏంటీ? అని ’’
‘‘చోళీకే పీచే క్యా హై అని మంచి వయసులో మాధురీ దీక్షిత్ అంటే దేశంలో కుర్ర కారు ఊగిపోయారు. ఈ ముసలి వయసులో నెల్లూరు కమల నాయుడు, చిత్తూరు ఎర్ర నారాయణ నాయుడు పంచల చాటున ఏ ముంది? అని సరసమాడుకోవడం సిల్లీగా ఉంది ’’
‘‘నువ్వు పుట్టక ముందు నెల్లూరు నాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడట! ఇక ఆయన గెలిచేది లేదు, ఆయన పార్టీ పరిస్థితి అంతే, నారాయణ పుట్టిన కొత్తలో కమ్యూనిస్టులు గెలిచారు. ఇప్పుడు వాళ్లు డైనోసార్స్‌లా అంతరించి పోయా రు. ఈ వయసులో పంచెల గోల అవసరమా? ఇంతకు మించి విశేషాలు లేవా?’’
‘‘డొంక తిరుగుడు ఎందుకు నేరుగా అడగ వచ్చు కదా? పవన్ కళ్యాణ్ సభ గురించే కదా? అదియూ నీ పతి ప్రాణంబులు తప్ప అని యముడు సావిత్రితో అన్నట్టు ఏదైనా మాట్లాడతాను పవన్ ఉపన్యాసం తప్ప ’’
‘‘అదేంటి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అభిమానివా? ’’
‘‘అదేంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయితే పవన్ గురించి మాట్లాడవద్దా? ఈ సంగతి నాకు తెలియదే? ’’
‘‘మరి పవన్ ఉపన్యాసం తప్ప ఏదైనా మాట్లాడతాను అని ఎందుకంటున్నావ్?’’


‘‘ నిజం చెప్పాలా? పవన్ ఏం మాట్లాడాడు? అని అడుగుతావ్! నాకు అర్ధమై చస్తేకదా? ఏదో అర్ధమైన నాలుగు ముక్కలు చెబితే అలా ఎందుకు మాట్లాడాడు అంటావు? పవన్‌ను ఎన్నికల్లో పోటీ చేస్తాడా? బాబుకు అనుకూలమా? జగన్‌కు వ్యతిరేకమా? బిజెపి నడిపిస్తుందా? టిడిపి స్పాన్సర్డ్ మీటింగ్‌లా? చిరంజీవి ముందున్నాడా? కాపునాడు పక్కనుందా? వెనక ఎవరున్నారు? జనసేన రాజకీయ పార్టీనా? అభిమాన సంఘమా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తావు? అన్నీ చెబితే పవనిజం అంటే ఏమిటి? అంటావు. ఈ ప్రశ్నలకు ముందు సమాధానం నాకు తెలియాలి కదా?’’
‘‘నిజంగా తెలియదా?’’
‘‘నాకే కాదు బహుశా పవన్‌కు కూడా తెలియదేమో?’’
‘‘తెలియకుండా మీటింగ్‌లు ఎందుకు?’’
‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కాలం చెబుతుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు ఫలితం ఆశించకు అని గీతాకారుడు చెప్పాడు కదా? బహుశా పవన్ అది నమ్మి ముందు మీటింగ్‌లు పెడుతున్నారేమో’’
‘‘నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అనే సామెత చెప్పినట్టు బాబు ఒకందుకు పవన్‌ను ఉపయోగించుకోవాలనుకుంటే పవన్ మరొకందుకు మీటింగ్‌లు పెడుతున్నారేమో?’’


‘‘రాజకీయాల్లో బయటకు కనిపిస్తున్నది, చెబుతున్నది నిజం కాదు. చెప్పిన మాటల వెనుక రహస్యం, చూపిన దృశ్యం వెనుక  చెప్పని మతలబు ఏదో ఉంటుంది. హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నట్టు బాబు ముందు ఈ రాజకీయాలు నడవవు. సినిమా రంగంలో కనిపించే దైవంగా పూజలు అందుకున్న ఎన్టీఆర్‌నే నమిలి మింగేసి వాతాపి జీర్ణం అన్నట్టు జీర్ణం చేసుకుని విగ్రహం ఏర్పాటు చేసి పూజించేట్టు చేసిన గొప్ప నేత బాబు. దేవుడినే విగ్రహాన్ని చేసిన బాబుకు చిరంజీవి తమ్ముడు ఒక లెక్కా’’


‘‘ఇంతకూ మీటింగ్‌పై నీ అభిప్రాయం ఏంటి?’’
‘‘ఏదేశమేగినా...పొగడరా... రాసింది రాయపోలు సుబ్బారావు అని మనం ఇంత కాలం అనుకుంటున్నాం... కాదట! గురజాడ అప్పారావు రాశారని పవన్ చెప్పేంత వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. గురజాడను రాయప్రోలు వారు కాపీ కొట్టారన్న మాట!
‘‘నిజమా?’’
‘‘పవన్ ఉపన్యాసంలోఇంకా చాలా సమాచారం ఉంది. తాపేశ్వరం, బందరు లడ్డూలు తియ్యగా ఉంటాయని అందరికీ తెలిసొచ్చింది. సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేదు కానీ విజయవాడ బాబాయ్ హోటల్‌లో ఇడ్లీ సాంబర్ బాగుంటుంది, ఆత్రేయ పురంలో పూతరేకులు, నెల్లూరులో రెడ్డి మెస్‌లో భోజనం, విజయవాడ వెళ్లేప్పుడు సూర్యాపేటలో పూరీ, హైదరాబాద్‌లో బిర్యానీ, మదీనా హోటల్‌లో ఇరానీ టీ, నీలోఫర్‌లో ఉస్మానియా బిస్కట్లు, కరీంనగర్‌లో సర్వపిండి చాలా బాగుంటుందని చెప్పడానికి సమాచారం సేకరించినా, సమయం లేక చెప్పలేకపోయాడని తెలిసింది’’
‘‘ఇంతకూ ఏమంటావు’’
‘‘తెలుగునాట సినిమా ప్రభావం కొంచం ఎక్కువే. ఇది నడుస్తున్న సినిమా, కథేమిటో? హీరో ఎవరో? విలన్ ఎవరో? ముగింపు ఏమిటో సినిమా ముగిసేంత వరకు తెలియదు. సినిమా చూస్తూ ఉండాలి అంతే.’’

-జనాంతికం - బుద్దా మురళి (11-9.2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం