28, ఫిబ్రవరి 2016, ఆదివారం

వాచీ ఉంగరాల సిద్ధాంతం!

‘మన వీరవాసరం వాళ్ల అమ్మాయికి ఆ నారపల్లి సంబంధం బాగా సరిపోతుంది. నా ఓటు నారపల్లి అబ్బాయికే’’
‘‘ ఆ అమ్మాయి ఐటి ఉద్యోగి. అబ్బాయికి పెద్దగా చదువు సంధ్య లేనట్టుగా ఉంది నీకెలా నచ్చిందమ్మా’’


‘వీడు పిల్లాడు వీడికేం తెలియదు. ఆ సంబంధాన్ని ఖాయం చేసుకోమని నా మాటగా చెప్పండి. అబ్బాయి చేతికి వాచీ లేదు,వేలికి ఉంగరం లేదు. నచ్చడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి.’’
‘‘మమీ వాచీ లేని బేవార్స్ సంబంధాన్ని ఆ అమ్మాయికి కట్టబెట్టడం అవసరమా? ’’
‘‘మీ మాటలు వింటుంటే నాకు కాంతం గుర్తుకొస్తుంది’’
‘‘వింటున్నా, పెళ్ళీడు కొచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నాడనే జ్ఞానం లేకుండా రోజుకో కొత్త పేరు కలవరిస్తున్నారు. ’’
‘‘అయ్యో అపార్థం చేసుకున్నావు. కాంతం అంటే లెడీసే కానీ నువ్వనుకునే లేడీస్ కాదు. ఛా..్ఛ... నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్ధం కావడం లేదు.’’
‘‘అంతే లేండి ప్రేమలో నిండా మునిగితే మాటలు ఇలానే తడబడతాయి.’’
‘‘ అది కాదు డార్లింగ్.. రచయిత మునిమాణిక్యం పాత్ర కాంతం గురించి నేను చెప్పింది. ఆమె కూడా అచ్చంగా ఇలానే లాజిక్ లేకుండా వాదించడం గుర్తుకొచ్చింది. నచ్చడం, నచ్చక పోవడానికి వాచీ ఉంగరం ప్రాతిపదికేంటి మీ పిచ్చి కాకపోతే ’’
‘‘రాజకీయం మాకూ తెలుసు.. మాకు తెలుసన్న సంగతి మీకు తెలియదు అంతే. ఆడవాళ్లు రాజకీయం మాట్లాడడం ఏమిటని మీకు చిన్నచూపు అంతే. ’’
‘‘ఈ రోజు నా పరిస్థితి బాగాలేదు. నీకు తెలిసింది ఏంటో నువ్వే చెప్పు వింటాను.’’


‘‘నాకు వాచీలేదు, ఉంగరం లేదు, ఎంత పేదరికంలో ఉన్నానో చూడు అని మొన్న ఆంధ్రరాష్ట్ర అధినేత చెప్పాడు కదా? నారాపల్లి అబ్బాయికి వాచీలేదు, ఉంగరం లేదు అందుకే బోలెడు డబ్బుందనే కదా అర్ధం’’
‘‘చూడు పారిజాతం రాజకీయాల్లో ఒక్కో మాటకు ఒక్కో అర్ధం ఉంటుంది. ఆ మాటల వెనుక ఉద్దేశం ఏమిటని ఆలోచించాలి కానీ ఆ మాటలను నమ్మి, యథాతథంగా తీసుకుని జీవితానికి అన్వయించుకుంటే బోల్తా కొడతాం.. నిజం చెప్పు వాచీ ఉంగరం లేదు కాబట్టి పేదవాడు అని నువ్వు అనుకుంటున్నావా ? లేక అచ్చం రాజకీయ నాయకుడిలానే బోలెడు సంపాదించి ఏమీ లేనట్టు నటిస్తున్నాడని నచ్చాడా ?  ’’


‘‘ మీరెన్నయినా చెప్పండి నా అభిప్రాయాన్ని నేను మార్చుకోను. ’’
‘‘23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం రెం డు ఇడ్లీలు, ఒక పుల్కా తింటాను నాకెందుకు డబ్బు అని చెప్పారు గుర్తుందా? 13 జిల్లాలకు సిఎం అయ్యాక రెండిడ్లీలు ఒక్కటయ్యాయా? దేశంలో కెల్లా సంపన్నుడు అంబానీ ఈ లెక్కన రోజుకు లక్షలాది ఇడ్లీలు, వేలాది చపాతీలు తింటారా? ఐనా తినే తిండికి సంపాదనకు సంబంధం ఏమిటోయ్’’
‘‘ అంటే ఎంత కష్టపడ్డా పొట్ట నింపుకోవడానికే అని ఎన్నోసార్లు మీరే అన్నారు. ఎన్టీఆర్ పిసినారి అని విన్నాను కానీ ఏంటండి అల్లుడికి పెళ్లిలో కనీసం ఉంగరం, వాచీ కూడా పెట్టలేదా?. మన పెళ్లికే మా నాన్న సైకిల్ కట్నంగా ఇచ్చారు. ’’


‘‘ పొట్టకూటికోసం కష్టపడేది మనలాంటి వేతన జీవులు, సామాన్యులు. మనం మాట్లాడుతున్నది పాలితుల గురించి కాదు పాలకుల గురించి. కట్నంగా సైకిల్ ఏం కర్మ వేల కోట్లు విలువ చేసే సైకిల్ పార్టీనే మామ నుంచి బలవంతంగా కట్నంగా తీసుకున్నాడు కదా? ’’
‘‘కానీ జగన్‌కు ఉంగరం, వాచీ రెండూ ఉన్నాయి. వైఎస్‌ఆర్‌కు కూడా ఉందండి టీవిలో చూశాను ’’
‘‘ అలా అంటే మహాత్మాగాంధీకి ఉంగరం లేకపోయినా నడుముకు వాచీ ఉంది. కాబట్టి సగం అవినీతి పరుడంటావా? వాళ్ల సంగతెందుకు నాకు వాచీ లేదు, ఉంగరం లేదు. నీ దృష్టిలో నేను కోటీశ్వరున్నా, అవినీతి పరున్నా ఏంటో చెప్పు ’’
‘‘ సర్లేండి బడాయి. మీరూ మీ చచ్చుప్రశ్నలు. రోజంతా రాజకీయాల గురించి ఆలోచిస్తారు కానీ ఆనాయకుల కున్న తెలివి తేటలు మీకెక్కడివి. మీ ఉంగరం, నా బంగారం ఎప్పుడూ బ్యాంకులోనే తాకట్టులో ఉంటుంది కదా? సెల్ ఫోన్ వచ్చాక వాచీ వాడడం లేదు. నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. దీంతో దేశ రాజకీయాలు ఒక మలుపు తిరుగుతాయి’’
‘‘ ఏంటో ఆ ఐడియా? ’’
‘‘ దేశంలో రాజకీయ నాయకుల్లో ఎవరి చేతికి వాచీ, ఉంగరం ఉందో వాళ్లను అవినీతి పరులుగా ప్రకటించాలి’’
‘‘ ఆ’’


‘‘ ఇప్పటి వరకు కెసిఆర్ అందరినీ ఇరికిస్తూ వచ్చాడు. ఈ దెబ్బతో కెసిఆర్ ఇరుక్కు పోతాడు. ఆయన చేతికి ఎప్పుడూ వాచీ ఉంటుంది. ’’
‘‘ ఇదేం లెక్క’’
‘‘సచివాలయంలో సొరకాయ అన్నవాళ్లు తెలంగకాణ వాళ్లు, అనపకాయ అనే వాళ్లు ఆంధ్ర ఉద్యోగులని ఆయన ఒక్క ముక్కలో తేల్చేయలేదా? ఇదీ అంతే’’
‘‘ చూడు పంకజం నిజాయితీ పరుడు నేను నిజాయితీ పరున్ని అని ముర్ఛ బిళ్ల కట్టుకుని తిరిగినట్టు చెప్పుకోవలసిన అవసరం లేదు. అది లేనప్పుడే పదే పదే తన నిజాయితీ గురించి తాను చెప్పుకోవలసి వస్తుంది. నువ్వన్నట్టు వాచీ, ఉంగరం ధరించడం, తినే ఇడ్లీలు, పుల్కాల సంఖ్యను బట్టి ఏ నాయకుడు ఎలాంటి వారో నిర్ణయిస్తే ఒక్కరు తప్ప దేశంలో నాయకులంతా అవినీతి పరులే అని తేలుతుంది. మీ పెదనాన్న కొడుక్కు ఎలర్జీ వాచీ పెట్టుకోడు, నక్కలపాడు పెదబావ కూతురుకు బంగారం పడదు. ఇంకొకరికి పువ్వులు పడవు. సామాన్యులు పడని వాటికి దూరంగా ఉంటారు. పాలకులు రాజకీయంగా ఉపయోగపడుతుందని ప్రచారం చేసుకుంటారు అంతే తేడా?
బంగారం తాకట్టుపెట్టిన దశ నుంచి ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఒడ్డున పడేసిని పివి నరసింహారావు వాచీ, ఉంగరం రెండూ ధరించేవారు. జీవితాన్ని దేశానికే అంకితం చేసిన వాజ్‌పాయి వాచీ లేకుండా కనిపించరు. మన్మోహన్‌ను వౌనముని అంటారేమో కానీ అవినీతి పరుడని ప్రత్యర్థి పార్టీలు కూడా వేలెత్తి చూపవు ఆయనా వాచీ పెట్టుకుంటారు. అంతెందుకు ప్రధాని మోదీకీ వాచీ ఉంది. ’’


‘‘ మీరు ఏవేవో చెప్పి అద్భుతమైన సిద్ధాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారు.’’
‘‘  మీ అభిమాన నేత కనిపెట్టిన సిద్ధాంతమే నిజం అని 
నువ్వూఅనుకుంటే వాచీతో పాటు ఉంగరం కాదు, ఏకంగా ఉంగరాలు ధరించిన నీ అభిమాన విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీరామారావే దేశంలో కెల్లా అత్యంత అవినీతి పరుడు అవుతాడు మరి ఒప్పుకుంటావా?   వాచీ ఒక్కటే ధరించినా ఆయన ఉంగరాలు మాత్రం చాలా ధరించే వాడు ’’
-బుద్దా మురళి (జనాంతికం 27-2-2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం