6, డిసెంబర్ 2015, ఆదివారం

మద్రాస్ వరదల్లో కొట్టుకు పోయిన అసహనం

‘‘ముళ్ల మీద కూర్చున్నంత ఇబ్బందిగా కూర్చున్నావు? ఏమైంది’’
‘‘ఏమీ లేదు’’
‘‘కానీ, గాంధీభవన్‌లో దానం నాగేందర్‌లా కూర్చున్నావు.. ఆయన పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదు. వెళతానని చెప్పడం లేదు. బయటకు దూకాలా వద్దా అని గుమ్మం పై అసహనంగా కూర్చొని ఉన్నాడు. నువ్వు కూడా అచ్చం అలానే కనిపిస్తున్నావు.
‘‘ అంటే?’’
‘‘ ముఖం చూస్తే తెలుస్తుంది ఆ లక్షణం. బయటపడేందుకు కారణాలను ఆనే్వషించే చూపులు అవి. నువ్వు కూడా నన్ను తప్పించుకొని వెళ్లిపోవడానికి కారణం వెతుకుతున్నట్టుగా అనిపిస్తే’’
‘‘ నీతో నాకేం భయమా? అలాంటిదేమీ లేదు.. మద్రాస్‌ను తలుచుకుని’’
‘‘ నిజమే మద్రాస్ పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. ’’
‘‘ దాని గురించి కాదు. జాతీయ చానల్స్ చూస్తున్నావా? ’’
‘‘చూస్తున్నా.. ఎప్పుడూ లేని విధంగా జాతీయ చానల్స్ కూడా మద్రాస్ పరిస్థితిని చూపిస్తున్నాయి. ’’


‘‘ అది కాదు... జాతీయ చానల్స్‌లో మొన్నటి వరకు అసహనంపై అద్భుతమైన డిబేట్స్ జరిగేవి. ఎక్కడెక్కడి రంగు రంగుల మేధావులు ఆవేశంగా మాట్లాడేవారు. ఈ మద్రాస్ తలనొప్పితో ఆ చర్చలు ఎక్కడా కనిపించడం లేదు. అదీ నాబాధ’’
‘‘ నిజమే టీవిల్లోనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ మద్రాస్ గురించే చర్చలు. రామకృష్ణమఠం, ఆర్‌ఎస్‌ఎస్ వంటి ఎన్నో సేవా సంస్థలు మద్రాస్‌లో వరద బాధితులను ఆదుకుంటున్నాయి. ఆహార పొట్లాలు అందిస్తున్నాయి. సిక్కుల సేవా సంస్థ కూడా పెద్ద ఎత్తున అక్కడే వంటకాలు చేసి బాధితులకు వడ్డిస్తోంది. మానవత్వం చచ్చిపోలేదు బతికే ఉందని గట్టిగా అరవాలన్నంత బాగా అక్కడ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ’’
‘‘ అన్ని హిందూ సంస్థల గురించి చెప్పావు కానీ నీకు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి సహాయ సామగ్రిని మద్రాస్ పంపిన వార్త కనిపించలేదా? మద్రాస్‌లో మసీదులను బాధితుల కోసం తెరిచి మంచినీళ్లు అందిస్తున్న వార్త కనిపించలేదా? ’’


‘‘ నిజమే సరిగ్గా గుర్తు చేశావు. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి సహాయ సామగ్రిని పంపినట్టు చూశాను.  పలు ముస్లిం సంస్థలు సహాయ చర్యలు చేపట్టారు . మతాలకు అతీతంగా మద్రాస్‌లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తెలుగు వారు తమిళులు అనే తేడా లేకుండా బాధితులను ఆదుకున్నారు. మతం గురించి ఎవరూ గుర్తు చేసుకోలేదు. మానవత్వం చనిపోలేదు అని అప్పుడప్పుడు మనుషులకు గుర్తు చేయడానికేనేమో ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. నేపాల్‌లో భారీ భూ కంపం వస్తే వాళ్ళేవరో మత గ్రంథాలను భారీ ఎత్తున పంపించి అభాసు పాలయ్యారు. మద్రాస్‌లో మాత్రం అలా కాకుండా మతానికి ప్రమేయమే లేకుండా మనుషులు స్పందించారు. వరద నీటికి మతం, కులం, భాష తేడా ఉండదు. దానికి తెలిసింది ప్రకృతి ధర్మం ఒక్కటే. ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపినప్పుడు మనిషి తనలోని మానవత్వాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంటుంది అనిపించింది మద్రాసీలకు చేయూతనందించే చేతులను చూసినప్పుడు. తమిళ హీరోలు నల్లగా ఉంటారని మన తెలుగు సినిమాల్లో వెటకారం చేస్తాం. కానీ ఆ నల్లని హీరోల మనసు ఎంత విశాలమో వరద సహాయంలో చూశాం. ’’
‘‘ ఇక చాల్లే... నేను చెప్పాలనుకున్నదాన్ని చెప్పనివ్వకుండా నువ్వు ఏదేదో చెబుతున్నావు’’


‘‘ నువ్వు చెప్పింది మద్రాస్ వరదల గురించి నేను చెబుతున్నది అదే కదా? ’’
‘‘ అదే కానీ కోణం వేరు. మా మేధావులు ఎంతో కృషి చేసి దేశంలో అసహన పరిస్థితిపై ఒక చక్కని వాతావరణం సృష్టించాం. చివరకు మేం సృష్టించిన వాతావరణ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పని చేసింది. అంత అసహనం పనికి రాదు అని తీవ్రవాద దేశాలు సైతం ఇండియాకు సుద్దులు చెప్పేంతగా అసహనం పై ప్రచారం చేయగలిగాం. జాతీయ ఛానల్స్‌లో ఎక్కడ చూసినా అసహనంపై చర్చలే. ఎంతటి సహన వంతుడికైనా అసహనం పుట్టేంతగా మేం ప్రచారం చేస్తే, మద్రాస్ వరదలు మా ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చేసింది. ’’
‘‘ పాపం మద్రాసేం చేసింది’’


‘‘ వందేళ్లలో ఎప్పుడూ లేనంత వర్షాలు ఇప్పుడే కురవాలా? మరీ బుద్దిలేకపోతే సరి 50 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం ఏమిటి? జాతీయ చానల్స్ దృష్టిలో దేశం అంటే ఢిల్లీ, ముంబై మాత్రమే. కానీ భారీ వర్షాల దెబ్బతో మద్రాస్ కూడా దేశంలో భాగమే అని, దక్షిణ భారత దేశం కూడా ఇండియాలో భాగమేనని మద్రాస్ వరదల్లో చానల్స్ మునిగితేలక తప్పలేదు. అక్కడికే మా ప్రయత్నం మేం చేశాం. రోజు కొక మేధావి మీ టీవి చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అసహనంపై చర్చించండి అని సందేశం పంపినా పట్టించుకోలేదు. మేం ఎంతో కష్టపడి తయారు చేసిన అసహన వాతావరణం వరదల్లో కొట్టుకు పోయింది. ఒక వాతావరణం సృష్టించడం, దాన్ని నమ్మడం, నమ్మించడం అంత ఈజీ కాదు. అంతా పోయింది వరదల్లో కొట్టుకు పోయింది. ’’


‘‘ అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. సరే మళ్లీ ప్రయత్నించవచ్చు కదా’’
‘‘ఒక రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసి విడుదల చేసిన సినిమా ఢమాల్ మంటే ఒక పాట కలిపి మళ్లీ విడుదల చేస్తే ఎలా ఉంటుందో ఇదీ అంతే. ఒక ఇష్యూ మూత పడిందంటే చానల్స్ మళ్లీ వాటికి ప్రాధాన్యత ఇవ్వవు. ’’
‘‘ సరే ఏం చేస్తారు.. మరో అవకాశం కోసం వేచి చూడండి. అయినా మన కళ్ల ముందే కనిపిస్తుంది కదా? మద్రాస్‌లో మతాలు, కులాలకు అతీతంగా ఒకరినొకరు ఆదుకుంటున్నారు ఇంకా ఈ దేశంలో మత ‘అసహనం’ ఉం దంటావా? ఆ మత సంస్థలు మద్రాస్‌లో సేవ చేస్తున్నాయి కదా? మీరు సేవలో వారితో పోటీ పడి ప్రజల మనసు దోచుకోవచ్చు కదా? ’’
‘‘ మా ఉద్యమాలే దోపిడీకి వ్యతిరేకం. మనసే కాదు దోచుకోవడం ఏదైనా కావచ్చు మేం   దానికి వ్యతిరేకం. ’’


‘‘నిజమేలే అంత దూరం వెళ్లి సేవ చేయాలంటే ఓపిక ఉండాలి, మనసు రావాలి ఓ పది మందైనా ఉండాలి. కానీ టీవిలో అసహనం అంటూ గట్టిగా బల్లగుద్ది వాదించాలంటే ఒక వ్యక్తి చాలు. అతనికి నోరుంటే చాలు!! వరదల్లో కొట్టుకు పోయిన అసహనం వెతికేందుకు ప్రయత్నించండి.  ఎక్కడో ఒక చోట దొరక్క పోదు .  ’’  - బుద్దా మురళి (జనాంతికం -6. 12. 2015)

2 కామెంట్‌లు:

  1. కానీ, గాంధీభవన్‌లో దానం నాగేందర్‌లా కూర్చున్నావు.. ఆయన పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదు. వెళతానని చెప్పడం లేదు. బయటకు దూకాలా వద్దా అని గుమ్మం పై అసహనంగా కూర్చొని ఉన్నాడు. నువ్వు కూడా అచ్చం అలానే కనిపిస్తున్నావు.

    haribabu
    మీరు మరీ 70mm సినిమాస్కోప్ తీసినంతగా వర్ణిస్తున్నారు.
    :-)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం