12, జులై 2015, ఆదివారం

అమాయక ‘భారతం’

‘‘భారత దేశ జనాభా 128 కోట్ల ఒకటికి చేరింది?’’
128 కోట్లు అని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. నిన్ననే నాకో మనవడు పుట్టాడు. ఆవిషయాన్ని ఇలా చెప్పాను’’
‘‘ఓహో అదా ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడేవాడివి, జనాభా లెక్కలు చెబుతుంటే ’’
‘‘ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కూడా అందుకే టాపిక్ మార్చాను. అది సరే ఈ 128 కోట్లలో అమాయకులు ఎంత మంది ఉంటారు, మాయకులు ఎంత మంది? ’’
‘‘ఆడా మగ లెక్కలు, మైనారిటీ, మెజారిటీ లెక్కలే కానీ ఎవరు ఎలాంటి వారనే లెక్కలుండవు. అటూ ఇటూ కానీ మూడో జాతి వారి లెక్కలు సైతం సేకరించాల్సిందే అని ఆ మధ్య వాళ్లు గొడవ చేసినట్టున్నారు’’
‘‘సాంకేతికంగా ఇంత పురోగతి సాధించినప్పుడు ఎవరు ఎలాంటి వారో లెక్కలు తేలిస్తే వచ్చే నష్టమేముంది? ఎలాంటి వాళ్లు ఎంత మందో తేలితే దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయి. ఎలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందో తేలితే రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో అలాంటి వారికి వరాలు కురిపిస్తాయ ’’


‘‘ ప్రతి ఒక్కడూ పైకి ఒకలా కనిపిస్తాడు. లోన మరోలా ఉంటాడు. పైగా నాకు మంచివాడుగా కనిపించిన వాడు నీకు చెడ్డవాడుగా కనిపించవచ్చు.. అంతెందుకు? దావుద్ ఎలాంటి వాడని నువ్వనుకుంటున్నావో చెప్పు’’
‘‘అనుకోవడానికేముంది వాడో ముదనష్టపు సచ్చినోడు, దేశ ద్రోహి...’’
‘‘మొన్నొకాయనతో మాట్లాడితే దావుద్ అంత అమాయకుడు మరోడు ఉండడు అన్నాడు. ’’
‘‘అమాయకుడా !ఎలా? ’’
‘‘రెడ్ హ్యాండెడ్‌గా పూర్తి ఆధారాలతో పట్టుపడిన ఎమ్మెల్యేలు కూడా ఎంత చక్కగా విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి మా ఎదుగుదలను చూసి సహించలేని వాళ్లు మాపై కుట్ర పన్నారు. మేం చాలా మంచి వాళ్లం కావాలంటే ఆరవ తరగతిలో స్కూల్‌లో ఇచ్చిన కాండక్ట్ సర్ట్ఫికెట్ చూడండి అని చెబుతున్నారు. పైగా ఇలాంటి వాళ్లు బెయిల్‌పై బయటకు వస్తే అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. దావూద్‌కు ఈ తెలివి లేక దేశం కాని దేశంలో రహస్య జీవితం గడుపుతున్నాడు. ఇండియా వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశంలోనాకున్న పాపులారిటీ చూసి రాజకీయ పార్టీ పెట్టి దేశాన్ని ఏలేస్తాడనే భయంతో కుట్రతో నన్ను కేసులో ఇరికించారు అని చెపితే సరిపోయేది. జైలుకు వెళ్లి వెంటనే బెయిల్‌పై బయటకు వస్తే దేశ వ్యాప్తంగా లక్షల మంది అభిమానులతో దేశంలోనే అత్యంత పెద్ద ర్యాలీ నిర్వహించవచ్చు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు రహస్య జీవితం గడుపుతున్నాడంటే అమాయకుడు కాదా? లాడెన్ వీడికన్నా అమాయకుడు. ప్రపంచ వ్యాప్తంగా నా అభిమానుల సంఖ్య పెరగడాన్ని చూసి ఓర్వలేక అమెరికా కుట్ర పన్నుతుంది అని మీడియా సమావేశంలో ప్రకటిస్తే సరిపోయేది రహస్యంగా దాచుకుని రహస్యంగానే అంతమయ్యాడు అమాయకుడు ’’


‘‘ఏంటీ దావూద్, లాడెన్‌లే నీ దృష్టిలో అమాయకులా? వామ్మో ఇంకా నయం హిట్లర్, ఈదీ అమీన్‌లు కూడా ప్రపంచ ప్రఖ్యాత అమాయకులని కితాబు ఇచ్చేస్తావ్’’
‘‘ అబ్బా ఈ మాట అన్నది నేను కాదోయ్ చెప్పాను కదా? వీళ్లు అమాయకులు అని బలమైన వాదన వినిపించారు. అదే నీకు చెబుతున్నాను’’
‘‘ఆ సంగతేమిటో కానీ కుట్రలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయనేది మాత్రం నిజం. పాపం ఆవిడెవరో పాత సినిమాల్లో సావిత్రి గారంత అమాయకంగా కనిపిస్తున్నారు. కుమార్తెని దారుణంగా హింసించారని అరెస్టు చేశారు. పినతల్లి కావడమే ఆమె చేసిన నేరమా? తనపై కుట్ర జరిగిందని ఎంత బాగా చెప్పింది. గృహిణిగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పు రాజకీయాల్లో వచ్చి ఉంటే రాణించడమే కాకుండా బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు అభిమానులు బ్రహ్మరథం పట్టి ఉండేవారు. ’’
‘‘బ్లాక్‌టికెట్‌లు అమ్ముతుంటే పట్టుపడ్డవాడు, జేబులు కత్తిరిస్తూ దొరికిపోయిన వాడు మొదలుకొని అంతా కుట్ర అంటున్నారు. ఇంత మంది అంటున్నారు కాబట్టి నిజంగానే కుట్రేనేమో అనిపిస్తోంది ఒక్కోసారి’’
‘‘ ఔను పాపం చివరకు లండన్‌లో తలదాచుకున్న లలిత్‌మోదీపైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులపైన, సుస్మాస్వరాజ్‌పైన ఏదో కుట్ర జరుగుతోంది. ’’


‘‘నిజమేనంటావా? తెలుగు ముఖ్యమంత్రిపైన కూడా కుట్ర జరిగిందంటున్నారు’’
‘‘జరగడం కాదు జరుగుతూనే ఉంది. వాళ్లు అమాయకులు కాబట్టి కేసు వేయడం లేదు కానీ వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే కెసిఆర్ ఇరుక్కుపోతారు’’
‘‘ఎలా? ’’
‘‘ ఓటుకు నోటులో బేరం ఆడింది నిజమే. 50లక్షల రూపాయల నగదు చెల్లించి ఓటుకు బేరం కుదుర్చుకున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయి. అంటే వస్తువు అమ్మకం, కొనుగోలుకు ఒప్పందం కుదిరిపోయింది. ఒప్పందాన్ని అమలు చేయకుండా వినియోగదారుడ్ని మోసం చేసినందుకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే తెలిసొస్తుంది. 50లక్షలు తీసుకున్నప్పుడు ఓటు వేయాలి, లేదా 50లక్షలు తిరిగి చెల్లించాలి ఇక్కడ ఈ రెండూ జరగలేదు అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించి వినియోగదారుడ్ని మోసం చేసినట్టే కదా? ’’
‘‘ నిజమే కానీ పాపం ఆయనపై ప్రపంచ వ్యాప్తంగా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా ఉంది. చివరకు వీకిలిక్స్ వాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలుకు బేరం కుదుర్చుకున్న విషయాన్ని బహిర్గతం చేశాడు కదా? ఇదేనా పద్ధతి. కొనుగోలు, అమ్మకాల బేరాలను ఇలా బయటపెడితే విదేశాలను నమ్మేదెవరు? ’’
‘‘టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను దించడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది అంటే నవ్వుకున్నాం కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. కుట్రను చేధించలేమా? ’’
‘‘ఐపిసి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కుట్ర కేసు కూడా రుజువు కాలేదు’’

‘నీ అంచనా ప్రకారం దేశంలో ఎంత మంది అమాయకులు ఉన్నారంటావు?’’
‘‘ఎంత మందో తెలియదు కానీ.. మాపై కుట్ర పన్నారు అని మీడియా ముందు ప్రకటించే ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడం దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం