29, డిసెంబర్ 2014, సోమవారం

పెద్ద పీట ఒక భ్రమ- కుర్చీ నిజం.

‘‘బాబాయ్ ఆ ఒక్క కాంట్రాక్టు మనకు దక్కిందంటే మన దశ తిరిగి పోతుంది ’’
‘‘ఏరో నువ్వు కాంట్రాక్టులు కూడా చేస్తావా? ’’
‘‘ఇప్పటి వరకు లేదు బాబాయ్ నీ ఆశీర్వాదం ఉంటే మొదలు పెడతాను ’’
‘‘నీ దుంప తెగ మళ్లీ ననే్న ఇరికించావు. కాంట్రాక్టుల సంగతి నాకు తెలిస్తే టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ ఎందుకుంటానురా? ఆ కాంట్రాక్టులేవో నేనే చేసుకుంటూ ఉండేవాడిని కదా? విభజన అనివార్యం అని, కొత్త రాజధాని గుంటూరు- విజయవాడల మధ్య ఉంటుందని అడిగినోడికీ అడగనోడికీ మూడేళ్ల నుంచి చెబుతూ వచ్చాను కానీ ముందస్తుగా అక్కడ ఓ ప్లాట్ కూడా కొనలేదు. ఇప్పుడు కొనాలన్నా జీవిత కాలంలో సంపాదించింది అంతా కలిపినా కొనలేను. అలాంటి నన్నొచ్చి అడుగుతావేంటిరా అబ్బాయ్’’
‘‘జ్ఞానం ఉన్నోడి దగ్గర డబ్బుండదు. డబ్బున్నోడి దగ్గర జ్ఞానం ఉండాలనేమీ లేదు. రోజూ అరడజను పత్రికలు చదివి విభజన ఖాయం, ఎవరు గెలిస్తే కొత్త రాజధాని ఎక్కడో నువ్వు ఊహించావు కానీ కనీసం ఒక్క పేపర్ కూడా చదివే అలవాటు లేని ఎంతో మంది అక్కడ ఎకరాలకు ఎకరాలు కొనేశారు బాబాయ్. భూములు కొనాలంటే కావలసింది జ్ఞానం కాదు డబ్బు. అయినా నేను నీ దగ్గరకొచ్చింది పెట్టుబడి కోసం కాదు బాబాయ్ జ్ఞానం కోసం. రాజకీయాల గురించి తెగ ఉపన్యసిస్తుంటారు కదా? పెద్దలకు చెప్పి నాకో కాంట్రాక్టు ఇప్పించొచ్చు కదా? ’’
‘‘అది సరేరా? చెక్కబల్లలు చేసుకునే నువ్వేం కాంట్రాక్టులు చేస్తావు, నీకెవరిస్తారు? ’’


‘‘ఇప్పుడు పాయింట్‌కొచ్చావు బాబాయ్. ఇంత కాలం ఐడియా లేక ఇలా ఉండిపోయాను కానీ నిన్న ఇంటికి మిర్చి బజ్జీల పొట్లం తీసుకొస్తుంటే అందులో పోయిన నెల వార్త ఒకటి చదివాక నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది... ఇదిగో నిన్న తెచ్చిన మిర్చీ బజ్జీల పొట్లం పేపర్. ’’
‘‘నూనె మరకలు తప్ప ఏముందిందులో అంత బ్రహ్మాండమైన ఐడియా వచ్చేందుకు? ’’
‘‘అదే బాబాయ్ బిజినెస్ ఆలోచనలున్న నాకు మీకు తేడా. కార్యకర్తలకు పెద్ద పీట..ఈ వార్త ఓసారి చదువు’’
‘‘అబ్బా నా చిన్నప్పటి నుం చి వింటున్నాను ఈ మాట ఇం దులో పెద్ద విశేషం ఏముంది?’’
‘‘అక్కడికే వస్తున్నా... ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఆ పార్టీకి 50లక్షల మంది కార్యకర్తలున్నారు. ఉభయ రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు ఎంత తక్కువ అంచనా వేసుకున్నా రెండు కోట్ల మంది సభ్యులైనా ఉంటారు కదా? బాబాయ్’’
‘‘ఏమో ఆ సంగతి నాకు తెలియదు కానీ ఉభయ రాష్ట్రాల్లో కుటుంబాల సంఖ్యను మించి పార్టీలకు కార్యకర్తలు ఉంటారంటే నమ్మబుద్ధి కావడం లేదురా? సంఖ్య సంగతి ఎందుకు కానీ ఎంత మంది కార్యకర్తలుంటే నీకేంటి? ’’
‘‘నీకు అన్నీ అనుమానాలే. కావాలంటే ఆన్‌లైన్‌లో అడ్రస్‌లు కూడా చూసుకోవచ్చు. ఇక అక్కడికే వస్తున్నా? నిజమైన కార్యకర్తలకు పెద్దపీట వేయాలని ఈసారి పాలకులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ గతంలో చెప్పిన వాటికి సంబంధం లేదు.కనీసం ఒక్క పార్టీ వారిని మంచి చేసుకున్నా 50లక్షల పీటలు తయారీ కాంట్రాక్టు దక్కుతుంది. ఇక మీలాంటి వారు సహకరిస్తే అన్ని పార్టీలకు మనమే పీటలు పంపించగలిగామంటే రెండు కోట్ల పీటలంటే ఆలోచించుకో బాబాయ్ .. మన పంట పండుతుంది. ఈ దెబ్బతో తరతరాలుగా కూర్చోని తినొచ్చు. ’’
‘‘నిజంగా కార్యకర్తల కోసం పెద్ద పీటలు వేయాల్సి వస్తే ఏ సింగపూర్ కంపెనీకో, జపాన్ కంపెనీకో కాంట్రాక్టు ఇస్తారు కానీ తొట్టెంపూడిలో కర్ర బెంచీలు చేసుకొని బతికే నీకెందుకిస్తారు.? నీకు విషయం అర్ధం కావడం లేదు. పెద్ద పీట అనేది నాయకుల ఊతపదం దాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టున్నావ్. ఎన్నికల ముందు దళితులకు పెద్ద పీట అన్న విషయం గుర్తుం దా? ఒకాయన పెద్ద దళితుడను అవుతాను అంటే మరొకాయన పెద్ద పీట కాదు పెద్ద కుర్చీనే దళితులకు ఇస్తాను అన్నారు. అంతకు ముందు ఒక్కో కుల సమావేశాన్ని నిర్వహించి మీ కులానికే పెద్ద పీట అని మాట ఇచ్చారా? లేదా? ’’
‘‘నేనూ అదే చెబుతున్నాను కదా బాబాయ్. క్యాడర్‌కు, ఇన్ని కులాలకు పెద్ద పీటలు తయారు చేసే కాంట్రాక్టు మనం దక్కించుకుంటే మన దశ తిరిగిపోతుంది. ఇప్పుడంటే మన ఊళ్లో ఎవరూ పీటలు చేయించుకోవడం లేదు కానీ పీటలు తయారీలో మాకున్న అనుభవం మీకు తెలియంది కాదు. పీటలు తయారు చేసేవాళ్లు దొరక్క ఇంత కాలం పెద్దపీటలు వేయలేదేమో? ’’


‘‘నీ దారి నీదే కానీ నీకస్సలు లోకజ్ఞానం లేదురా అబ్బాయ్. ఏదో మాట వరుసకు మీకే పెద్ద పీట అని ఎన్నికల ముందు అలా అంటారు కానీ నిజంగా పెద్ద పీట వేయరు.. ఇదిగో మన టీకొట్టు సాయేబు చాయ్‌పే చర్చ అని మోదీ అనగానే మోదీ ప్రధాని అయితే టీకొట్టు వాళ్లకు పెద్దపీట వేసేస్తారని తెగ సంబరపడ్డాడు. ఏమైంది ఎప్పటిలానే ఈ పాకలో బెంచీల మీద కుర్చున్న వారికి టీ అందిస్తూ వాడి జీవితం ఎప్పటిలానే గడిచిపోతోంది కానీ ఈ బెంచీల నుంచి విముక్తి కలగలేదు, వాడాశించినట్టు పెద్ద పీట దక్కలేదు. ఈరోజుల్లో పీటలెవరు ఉపయోగిస్తున్నారు. పెళ్లిళ్లలో రెండు రెండు మూడు గంటల కోసం పీటలు తప్ప నిజంగా పెద్ద పీటలు ఉండవు.’’
‘‘అంతే నంటావా బాబాయ్’’


‘‘నువ్వంటే ఆమాయకుడివి కాబట్టి పెద్ద పీట అనగానే పీటలు తయారు చేసే కాంట్రాక్టు కోసం ఆలోచించావు. ఇంకో విషయం తెలుసా? నాయకులు ఎన్నికల్లో పెద్ద పీట వేస్తాం అనగానే చదువుకున్న వారు కూడా నిజంగానే పెద్దపీట వేస్తారని కలలు కంటారు. నాయకులు కుర్చీమీద కూర్చోవడానికే పెద్దపీటలనే హామీలు ఉపయోగపడతాయి కానీ నిజానికి ఎవరూ ఎవరికీ పెద్దపీట వేయరు. అంతెందుకురా? కనీసం ఈ టీకొట్టు సాయేబు కూడా మనకు బెంచీనే వేస్తాడు కానీ పెద్ద పీట వేయడు. రాజకీయ నాయకుల కలల్లో కుర్చీ ఉంటుంది కానీ పెద్ద పీట నిజంగా ఉండనే ఉండదు. పెద్ద పీట ఒక భ్రమ- కుర్చీ నిజం.’’

21, డిసెంబర్ 2014, ఆదివారం

గ్రామానికో గాడ్సే విగ్రహం!

అంతరించి పోయిన రాక్షస బల్లులను తిరిగి పుట్టించేందుకు చాలానే ప్రయత్నాలు జరుగుతున్నాయట! జురాసిక్ పార్క్ సినిమా పుణ్యమా అని రాక్షస బల్లులపై జనంలో ప్రేమ బాగానే పెరిగింది. తిరిగి పుడితే బాగానే ఉండనుకునేవారికి కొదవ లేదు. అంతరించి పోయిన జాతులను తిరిగి పుట్టించేంతగా శాస్తవ్రిజ్ఞానం అభివృద్ధి చెందితే పోయినోళ్లను తిరిగి పుట్టించడం కూడా సాధ్యం కావచ్చు. ఇప్పటికే అధిక జనాభాతో ప్రపంచం సతమతమవుతోంది. అప్పుడు చచ్చిన వాళ్లు తిరిగి పుడితే ఇంత జనాభాలో సమస్యలతో బతకలేక ఆ చచ్చిపుట్టినోళ్లు మళ్లీ చచ్చి ఊరుకుంటారు. 

నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని చిన్నప్పుడు స్కూల్స్‌లో పిల్లలను అడగడం ఉపాధ్యాయులకు ఓ అలవాటు. ఏదో పెద్ద అనుకున్నదే అయినట్టు. అలా ప్రశ్నించిన ఉపాధ్యాయులేమైనా పెద్దయ్యాక తాము ఉపాధ్యాయులు కావాలని చదువుకునేప్పుడు ఏమైనా అనుకున్నారా? ఏమిటి? ప్రధానమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని అవుతాను సేవ చేసేస్తాను అని పిల్లలు ముచ్చటగా చెబుతుంటారు. ఎంసెట్‌లో ర్యాంకర్లు టీవిల ముందు ఎంత చక్కగా చెబుతారో డాక్టర్‌నై పేదలకు సేవ చేస్తాను అని ఎంసెట్ ప్రారంభం అయినప్పటి నుంచి ర్యాంకర్లు చెబుతూనే ఉన్నారు. అలా సేవ చేసేవారు ఎక్కడున్నారా? అంటే ఎంత వెతికినా కనిపించరు. పాకిస్తాన్‌లో కాస్త ఎవరినన్న అడిగితే దావూద్ ఇబ్రహీం ఇల్లు చూపిస్తారేమో కానీ పేదలకు ఉచితంగా సేవ చేసే డాక్టర్లు కనిపించడం కష్టం. కోటి రూపాయల డబ్బుతో సీటు కొనుక్కోని ఐదేళ్లపాటు ఆహోరాత్రులు కష్టపడి చదివే వారి నుంచి పేదలకు సేవ ఆశించడం కూడా ఆత్యాశే.
ఎంసెట్ ర్యాంకర్లు చదువు పూర్తయ్యాక కార్పొరేట్ ఆస్పత్రులు, సొంత ఆస్పత్రిలోనూ కనిపిస్తారు.


ఆ సంగతి వదిలేద్దాం. కాలం మారింది డైనోసార్స్‌ను, చచ్చిన వారిని బతికించే రోజులు వచ్చాక..... నువ్వు ఎవరిని తిరిగి బతికించాలనుకుంటున్నావు? అని టీచర్ ప్రశ్నిస్తే, పిల్లలు చెప్పే సమాధానాలు ఎలా ఉంటా యో?
రావణుడిని తిరిగి బతికించాలని చాలా మంది కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రావణుడిని తిరిగి బతికించినా ఈ లోకంలో పాపం ఆ అమాయకుడు బతకలేక చచ్చి ఊరుకుంటాడు. రావణాసురుడు అత్యాచార యత్నం చేశాడు కానీ అత్యాచారం చేయలేదు. అలాంటిది అడుగడుగునా రావణుడి తాతలు విజృంభిస్తుంటే అమాయక రావణుడు వీళ్ల మధ్య బతుకగలడా? బాబోయ్ నేనీ లోకంలో బతకలేను మళ్లీ వచ్చి మళ్లీ చంపేయమని రాముడ్ని వేడుకోకుండా ఉంటాడా?


ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజున ఆయన కుమారులు మళ్లీ ఎప్పుడు పుడతావు నాన్నా అంటూ ప్రకటనలు ఇచ్చేవాళ్లు. పాపం అల్లుడి చేతిలో మోసపోయిన కుమారులు తండ్రి మళ్లీ పుడితే కానీ తమకు గుర్తింపు లేదని తొందరలోనే గుర్తించారు. ఒకవేళ వాళ్లు అలా కోరినా అల్లుడు వీటోతో వాళ్ల కోరిక అడ్డుకోగలరు.
ఇండియానే ఇందిరా అని బారువా ఎంత మొత్తుకున్నా ప్రపంచంలో చాలా దేశాల్లో ఇండియా అంటే గాంధీజీ పుట్టిన దేశం. ఇండియాను ఇప్పటికే గాంధీజీ దేశంగానే చూసేవాళ్లకు కొదవ లేదు.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ప్రపంచానికి అహింస అనే బలమైన ఆయుధాన్ని పరిచయం చేశారు. తమ మీద పోరాడిన నాయకుడు అయినా ఆయన్ని బ్రీటిష్ వారు సైతం గౌరవించారు. ఇప్పటికీ ఆ దేశంలో గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. ఆఫ్రీకా, ఇంగ్లాండ్, అమెరికా లాంటి అనేక దేశాల్లో గాంధీజీ విగ్రహాలున్నాయి. ప్రపంచాన్ని తెరవెనుక నుంచి పాలించే అమెరికా వంటి శక్తివంతమైన దేశ పాలకులు తమ ఉపన్యాసాల్లో గాంధీజీ బోధనలను సగర్వంగా ప్రస్తావిస్తుంటారు. అలాంటి గాంధీజీని చంపిన గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొందరు చాలా బలంగా వాదిస్తున్నారు. గ్రామ గ్రామాన గాడ్సే విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలట! గాంధీజీ సిద్ధాంతాలను మనం మరిచిపోయినా గ్రామ గ్రామాన గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. కొత్తగా విగ్రహాలను ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ విగ్రహాలనే రీ మోడల్ చేసి గాడ్సే విగ్రహాలుగా మార్చే ప్రతిపాదన వస్తుందేమో చూడాలి. చనిపోయిన వారిని తిరిగి పుట్టించే రోజులు వచ్చినప్పుడు ఈ భక్తులు తమ మొదటి డిమాండ్‌గా గాడ్సేను తిరిగి పుట్టించాలని కచ్చితంగా అడిగి తీరుతారు. 


అమెరికాలో వాడెవడో బీర్లమీద గాంధీజీ బొమ్మను ముద్రించాడు ఇదేం పోయే కాలం అని ఆ దేశంలోని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు. పాపం అమాయకులు దేశం వీడినా వారిలో ఇంకా గాంధీజీపై అభిమానం వీడలేదు. గాంధీజీ అంటే భారతీయతకు ప్రతీక అని భావిస్తూ తమ దేశానికి అవమానం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. పోనీలే అని అమెరికా వాడు ఊరుకుంటున్నట్టుగా ఉంటున్నాడు కానీ దీనిపై న్యాయపోరాటం చేస్తే మన వాళ్లు గాంధీజీ బోధనలతో బలంగా వాదన వినిపిస్తే, ఆ దేశం అడ్వకేట్ ఒక్క ముక్కలో తేల్చి పారేయవచ్చు. పోవయ్యా పో గాంధీజీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఆ గాంధీని చంపిన గాడ్సేనే నిజమైన దేశభక్తుడు అని గౌరవనీయులైన ఎంపి, గాడ్సేకు గ్రామ గ్రామాన విగ్రహాలు విగ్రహాలు కట్టించాలని మీ దేశం వారే డిమాండ్ చేస్తున్నారు అని ఒక్క మాట చెబితే సరిపోతుంది.


ఇది ప్రజాస్వామ్య ప్రపంచం. గొంతున్నవాడు గొంతుతో గొంతు లేని వాడు రాతతో ఏమైనా మాట్లాడవచ్చు. భగవద్గీత హింసను ప్రేరేపిస్తోంది నిషేధించి తీరాల్సిందే అని ఆ మధ్య రష్యాలో కొందరు కోర్టుకు వెళ్లారు. కింది కోర్టు ఔను నిజమే హింసను ప్రేరేపిస్తోంది అని తేల్చి చెప్పింది. పై కోర్టు అంగీకరించక పోవడం వల్ల వారి కోరిక తీరలేదు కానీ లేకపోతే ప్రపంచంలో టెర్రరిజానికి, తాలిబాన్లహింసకు భగవద్గీతే కారణం అని కోర్టు తీర్పు ను సాక్షంగా చూపించి వాదించే వారూ ఉండేవారు. రష్యా కోర్టుకు భగవద్గీతలో హింస కనిపిస్తే అనేక మంది ప్రపంచ మేధావులకు భగవద్గీతలో శాంతి సందేశం కనిపించింది. ఎవరిష్టం వారిది. కానీ ఓ చిన్న కోరిక.

 చనిపోయిన వారు తిరిగి పుట్టే చాన్స్ ఉన్నా ఓ మహనీయులారా! మీరు మాత్రం మళ్లీ పుట్టకండి .

14, డిసెంబర్ 2014, ఆదివారం

శ్మశానాన పడక! పొరుగింటి నిద్ర!

కర్నాటక ఎక్సైజ్ మంత్రి సతీష్ జార్కి హొళి ఒక మంచి ముహూర్తం చూసుకుని బెలగాళి శ్మశాన వాటికలో పదివేల మంది అభిమానులతో కలిసి శ్మశాన నిద్ర చేశారు. కాటికి పోయిన వాడు తిరిగి రాడు అంటారు కానీ నేను వచ్చాను చూడండి అని కాలరెత్తి చూపిస్తున్నాడాయన. ఆ పదివేల మంది ఆక్కడే భోజనం చేసి శ్మశాన వాటికలోనే పడుకున్నారు. ఎందుకయ్యా అలా అంటే నా నిద్ర కోట్లాది మంది ప్రజలకు మేలుకొలుపు, చైతన్యం అంటూ కన్నడంలో ఇలాంటి బోలెడు మాటలు చెప్పుకొచ్చారు. ప్రజల మూఢనమ్మకాల విషయం ఎలా ఉన్నా ఆయనే పెద్ద మూఢనమ్మకంతో ఉన్నాడేమో ననిపిస్తోంది.


శ్మశానంలో ఒక్క రాత్రి నిద్ర పోయి అంతలా ధైర్యవంతునిగా మాట్లాడితే తెలుగు నాట మహనీయులు ఏం మాట్లాడాలి? ఆ మంత్రిగారు అక్కడే తిని, ఆరడుగుల నేలపై మహా అయితే ఐదారు గంటల పాటు పడుకుని ఉంటారు. అదే తెలుగునాట లెక్కలేనంత మంది నాయకులు శ్మశానాలకు చెందిన ఎకరాలు ఎకరాలను స్వాహా చేసి భవంతులను నిర్మించేశారు. ఒక్క రాత్రి తినడం కాదు అక్కడ ఏకంగా స్టార్ హోటల్స్ కట్టించిన వారున్నారు. కర్నాటక మంత్రిని చూశాక ప్రజలను చైతన్య పరచడానికే ఇలా శ్మశానాలను ఆక్రమించేసుకుని భవనాలు కట్టించుకుని నిద్ర పోతున్నామని చెబుతారేమో మన వాళ్లు!


ఒక్క రాత్రి శ్మశానంలో నిద్రతో కర్నాటక మంత్రికి ఆ రాష్ట్ర రాజకీయాల్లో మంచి క్రేజ్ లభించింది. అయితే రాజకీయాల్లో ఈ రాత్రులు కొత్తేమీ కాదు. రాత్రులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇందులో ద్వంద్వార్థం ఏమీ లేదు. అన్ని వ్యాపారాల్లోలానే రాజకీయాల్లో కూడా పోటీ పెరిగిపోయింది. రిస్క్, పోటీ ఎక్కడ ఎక్కువుంటే అక్కడ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందనేది నిజమేననుకోండి. పార్టీలు పెరిగాయి, నాయకులు పెరిగారు. రోజుకు 18 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నామన్నా జనం ఆదరించడం లేదు, పక్కన పెట్టేస్తున్నారు. దాంతో ఇప్పుడు రాత్రి కూడా రాజకీయం కోసమే నిద్ర పోవలసిన పరిస్థితులు వచ్చాయి. తెలుగునాట పల్లె నిద్ర, పట్నం నిద్ర గూడెం నిద్ర అంటూ రకరకాల నిద్రలను ఎన్నికలకు ముందే ఉద్యమ కాలంలో టిఆర్‌ఎస్ నిర్వహించేసింది. అధికారంలోకి వచ్చాక నిద్ర కార్యక్రమాలను పక్కన పెట్టి నిద్ర పోతే అధికారం మరోసారి అంత ఈజీగా చేతికి దక్కదు కదా? ఇప్పుడు ఆస్పత్రి నిద్ర అంటూ కొత్త కార్యక్రమం చేపట్టారు.


ఈ ప్రోగ్రామ్ ఎలా పుట్టిందో తెలియదు కానీ ప్రచారంలో ఉన్న కథ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. అధికారంలోకి వచ్చాక మరోసారి అధికారంలోకి రావడానికి నాయకులు నిద్ర పోకుండా కొత్త కార్యక్రమం కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతూ తెగ ఆలోచించారు. ఐడియా రాలేదు కానీ ఆనారోగ్యం వచ్చి, ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రిలోనూ నిద్ర పోకుండా ఆలోచిస్తూ యూరేకా అని అరిచి అందరి నిద్రను చెడగొట్టారట నాయకులు. ఎందుకలా అరిచాడు అంటే ఆస్పత్రి నిద్ర కార్యక్రమం ఆలోచన రాగానే ఆనందాన్ని పట్టలేక అరిచారట! అక్కడి నుంచే ఆస్పత్రి నిద్ర అని కొత్త కార్యక్రమం ప్రారంభించారు. స్వయంగా వైద్యుడైన ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖను కూడా చూస్తున్న రాజయ్య ఎక్కడ ఆస్పత్రి కనిపిస్తే అక్కడికి బెడ్ తీసుకెళుతూ నిద్ర పోతున్నారు. ఆయన నిద్ర పోని జిల్లా ఆస్పత్రి లేదు. మంత్రిగారూ మీ ఆరోగ్యం జాగ్రత్త మీరిలా ఆస్పత్రి నిద్ర అంటూ జిల్లాలు పట్టుకొని తిరిగితే ఆస్పత్రి పాలవుతారు అని అభిమానులు గోల పెడుతున్నారు. ఇంటి బయట నిద్రలు జీవితంలో భాగం.
పెళ్లయ్యాక మూడు రాత్రులు కొత్త జంటకు జీవితాంతం మిగిలిపోయే మధుర స్మృతి.


కాలం గడిచిన తరువాత కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా పొరుగింటి నిద్రపై దృష్టిపెట్టి జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలకు ఇలాంటి నిద్రలే కారణమని పోలీసు వారి లెక్కలు చెబుతున్నాయి. పక్కింటి నిద్ర మీద దేవుళ్లకు సైతం ఆసక్తే. ఏదో పోటీల్లో విజయం సాధించి గౌతముడు అహల్యను చేపడతాడు. పోటీలో ఓడిపోయినంత మాత్రాన మనసు ఊరుకుంటుందా? కోడి రూపం దాల్చి కొక్కరోకో అని అరిస్తే తెల్లారిందని గౌతముడు బయటకు వెళ్లిపోతే ఆ వేషంలో వచ్చిన ఇంద్రుడు పక్కింటి నిద్ర విజయవంతం అయిందనుకుంటుంటే గౌతముడు మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా ఇంద్రున్ని పట్టుకుని చివరకు ఇంట్లో కూడా నిద్ర పోకుండా నీ శరీరం అంతా కళ్లయి పోవాలని శపిస్తాడు. రెండు కళ్లవాళ్లే నిద్ర పట్టక ఆలోచనలతో సతమతమవుతుంటే పాపం ఇంద్రుడి ఒళ్లంతా కళ్లు కావడం వల్ల ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో.
ఇక మన నాయకుల వద్దకు వస్తే దేవెగౌడ నిద్రకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే కానీ రాజకీయాల్లో అవకాశం రాదు. అలాంటిది దేవగౌడను ఎకాఎకిన ప్రధానమంత్రి పదవి వరించింది. బహుశా రాజకీయాల్లో అవకాశాల కోసం నిద్రలేని రాత్రులు గడిపి బాగా అలసిపోయాక ఆ పదవి వచ్చినట్టుంది. దాంతో ప్రధానమంత్రి పదవి చేపట్టగానే కుర్చీనే బెడ్‌గా మార్చుకుని నిద్ర పోవడం అలవాటు చేసుకున్నారు. నిద్రకు దూరమై రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నాను అని చెప్పుకునే చంద్రబాబు లాంటి వారికి నిద్ర ప్రధానమంత్రిని ఎంపిక చేయడం రాజకీయాల్లో ఓ వింత. నిద్ర పోతే అందరూ సమానమే, మేల్కొంటేనే ముఖ్యమంత్రి, సామాన్యుడు అనే తేడా ఉంటుందనే విషయం బాగా తెలిసిన బాబు ఎక్కువ సమయం మేల్కొని ముఖ్యమంత్రిగా మురిసిపోయేవారు. ఈ సీక్రెట్ దేవెగౌడకు చెప్పి ఉంటే పాపం ఆయన నిద్ర పోయేవారు కాదేమో! నిద్రలోనే ఆయన పదవీ కాలం కాస్తా ముగిసిపోయింది. పదవి పోయాక ఆయన మళ్లీ పదవి కోసం కలలు కన్నా ప్రయోజనం లేకుండాపోయింది.


వారం రోజుల పాటు ఇల్లూ వాకిలి వదిలి ఊరి బయట నిద్ర పోవడం కొన్ని గ్రామాల్లో ఆచారం. అలా చేస్తే ఊరికి పట్టిన శని విరగడ అయి అదృష్టం వరిస్తుందనేది వారి నమ్మకం. వారి నమ్మకం నిజమవుతుందో లేదో కానీ ఈ కొత్త కొత్త రాత్రులు మాత్రం రాజకీయ నాయకులకు బాగా కలిసివస్తున్నాయి.

9, డిసెంబర్ 2014, మంగళవారం

రాజకీయ భిక్ష

రాష్ట్రం ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు కానీ పార్లమెంటులో అయినా అసెంబ్లీల్లో అయినా వారి వారి భాషల్లో మేం పాండవులం మీరు కౌరవులు అని తిట్టని పార్టీ ఉండదు. చిత్రమేమంటే పాండవులు కౌరవులు ఇద్దరూ ఒకే వంశానికి చెందిన వారు అంటే అధికార పక్షం అయినా విపక్షం అయినా అన్ని పక్షాలు కౌరవ పక్షాలే అనేది నిజం. అత్యంత పురాతనమైన వృత్తుల్లో రాజకీయం- భిక్షక వృత్తి ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయాయి. మాతా కబళం తల్లి అన్నట్టుగా మాతా, పితా ఓట్లు తల్లి ఓట్లు బాబాయ్య అని అడుక్కుంటారు అదే తేడా. రాజకీయ ఎత్తుగడల్లో చిత్తయి అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు భిక్షకులుగానే జీవించాల్సి వచ్చింది. భిక్షం అంటే ఇప్పటిలా కాదు


మా రోజుల్లో అని పెద్దలు చెప్పినట్టుగా భిక్షకులు చెప్పుకోరు కానీ పూర్వ కాలంలో భిక్షకులు అంటే అల్లాటప్పా కాదు. ఉద్యోగులు బాస్ ముందు గజగజవణికిపోయినట్టుగా భిక్షకుల ముందు ఇంటి యజమాని వణికిపోవలిసిందే. క్షణం ఆలస్యం అయినా బాస్ క్షమించడు అలానే రెండు సార్లు భవతీ భిక్షాందేహి అని పిలిస్తే పరుగు పరుగున రాకపోతే మునులు శపించేస్తారు. కాళ్లా వేళ్లా పడితే శాప విమోచన మార్గం చెబుతారు. ఇలాంటి కథలు చిన్నప్పుడు ఎన్ని చదవలేదు. సీతను అపహరించే ముందు రావణుడు కూడా భిక్షగాడిగానే వచ్చి భవతీ భిక్షాందేహి అంటూ సీత గీత దాటేట్టు చేసి అపహరిస్తాడు. అన్ని వేషాల కన్నా భిక్షక వేషం సేఫ్ అని రావణుడు ఆ కాలంలోనే గ్రహించాడు.


మీవాడు ఏం చేస్తున్నాడు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం అని ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత గర్వంగా చెబుతారో బహుశా ఆ కాలంలో మా వాడు భిక్షానికి వెళ్లాడు అని గర్వంగా చెప్పుకునే వారేమో! అయినా ఈ రోజుల్లో ఎంత గొప్ప కంపెనీలో పని చేసినా వారికి నచ్చక పోతే అదేదో రంగు కాగితం చేతిలో పెట్టి పంపించేస్తారు కానీ ఆ కాలం నాటి వారిలా శపించేంత సీన్ ఈ కాలం వారికెక్కడుంది?


అప్పుడెప్పుడో అమెరికా అధ్యక్షుడిగా క్లింటన్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భిక్షకులు కనిపించకుండా రాత్రికి రాత్రి శివార్లకు తరలించారు. కాలాన్ని బట్టి భిక్షకులు కూడా మారిపోతున్నారు. మాతా కబళం తల్లి అనే మాట పురాణాల కాలం నుంచి వినిపించిన మాటే అయినా గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఆ మాట వినిపించడం లేదు. భాగ్యనగరంలో సైతం 70-80ల కాలం వరకు ఉదయమే ఇంటింటికి మాతా కబళం బ్యాచ్ వచ్చేది. ఇప్పుడు నగదు రూపంలో తప్ప మరో రూపంలో అంగీకరించడం లేదు. ధర్మం అంతా అన్ని మతాల ప్రార్థనాలయాల వద్ద హోల్‌సేల్‌గా అమ్మేసేట్టుగా కనిపిస్తారు భిక్షకులు. హర్ ఏఖ్ మాల్ 10 రూప్యా అని అరిచినట్టుగా వీళ్లు ఒక్క రూపాయికి ధర్మం అమ్ముతామన్నట్టు అరుస్తుంటారు. ఆలయాలకు వెళితే దైవదర్శనం కన్నా ఈ ధర్మం అమ్మేవారి గోల ఎక్కువ.


ఏవో నాలుగు రాజకీయ ముచ్చట్లు చెప్పకుండా ఆదివారం పూట ఏమిటో అడ్డుక్కునే వారి గోల అంటున్నారా? అక్కడికే వస్తున్నా..
తెలుగు నాట ఈ మధ్య భిక్ష పాపులర్ వర్డ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు రాజకీయ భిక్ష అంటూ మైకులను కొరికేస్తున్నారు.
కెసిఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ భిక్ష చరిత్ర తెరపైకి వచ్చేసింది. కెసిఆర్‌కు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెడితే, బాబుకు రాజకీయ భిక్ష పెట్టింది ఇందిరమ్మ కదా? భిక్ష పెట్టిన తల్లిని అల్లుడి పార్టీ వాళ్లు విమర్శించవచ్చునా? అని కొందరు నిలదీస్తున్నారు. రాజకీయాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం భిక్ష అవుతుందా? బీరువాల్లో ఎంత డబ్బునైనా దాచుకోవచ్చు. బీరువా సైజు సరిపోక పోతే స్విస్ బ్యాంకులో దాచుకోవచ్చు. దాచిపెట్టడానికి చోటు లేదని డబ్బును దానం చేసేవాళ్లు ఎవరూ ఉండరు. అదే రాజకీయాల్లో అయితే ఒక నాయకుడు ఒక స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించాలి. తానే అన్ని నియోజక వర్గాల నుంచి పోటీ చేసి తానే మెజారిటీ సీట్లలో గెలిచి తానే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ఉంటే మన నాయకులు ఆ పనే చేసేవారు. కానీ ప్రజల అదృష్టం కొద్ది రాజకీయాల్లో అలాంటి అవకాశం లేదు. దాంతో ఇష్టం ఉన్నా లేకున్నా, కాళ్లు మొక్కేవాళ్లయినా, కాళ్లు లాగేసే వాళ్లనే అనుమానం ఉన్నా టికెట్లు పంచక తప్పదు. అలా గెలిచిన వారితోనే ప్రభుత్వం ఏర్పడుంది. ఇలాంటి తప్పని సరి తతంగం ఉంది కాబట్టే కులాల వారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా టికెట్లు ఇస్తారు. వందలాది సినిమా హాళ్లను ఒకే కుటుంబం లీజుకు తీసుకుని తమ గుప్పిట్లో పెట్టుకున్నట్టు కొన్ని వందల సీట్లు తమ చేతుల్లో పెట్టుకునే చాన్స్ లేదు. అప్పారావో, సుబ్బారావో, కోన్ కిస్కానో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాల్సిందే. కావాలంటే వారిని బానిసలుగా చూసుకోవచ్చు కానీ ముందు ఇతరులకైతే టికెట్లు ఇవ్వక తప్పదు.


ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ అయినా 294 మందిని పోటీకి నిలబెడుతుంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టక ముందైనా, పెట్టిన తరువాతైనా పోటీలో ఉండేది 294 మందే. కానీ చిత్రంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే భిక్షం అనేది రాజకీయాల్లో ప్రవేశించినట్టుగా కొందరు ఎన్టీఆర్ ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారు అంటున్నారు. అలా అనే పార్టీ అధ్యక్షునికి సైతం 78లో ఇందిరాగాంధీ కొత్తగా పెట్టిన ఇందిరా కాంగ్రెస్ పేరుతో భిక్ష పెట్టారనే విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిందే భిక్ష కానీ అల్లుడిగారిది భిక్ష కాదు ఆయన సామర్ధ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రభువులు ఓటర్లే. ప్రభువు భిక్ష పెడతాడు. ఇందిరాగాంధీ , ఎన్టీఆర్, కెసిఆర్, బాబు, వైఎస్‌ఆర్, జగన్ ఎవరైనా కావచ్చు రాజకీయాల్లో వీరికి ఓట్ల భిక్ష వేసి రాజకీయ జీవితం ప్రసాదించేది ఓటర్లే. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాయకులకు ఓటర్లు భిక్ష పెడతారు కానీ, అధినాయకులు కాదు.

7, డిసెంబర్ 2014, ఆదివారం

పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావును కటాక్షించని లక్ష్మీదేవి



వృత్తిలో నిబద్ధత ఉన్నవారు మాత్రమే తమ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మహనీయులు ఎంతో మంది తమ తమ రంగాల్లో పూర్తిగా లీనమై వ్యక్తిగత జీవితాన్ని, డబ్బును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమ కాలంలో అయ్యో పాపం అనుకునే జీవితాన్ని గడిపారు. వృత్తిపై నిబద్ధత ఉండాల్సిందే అదే సమయంలో లక్ష్మీదేవిపై ఎంతో కొంత శ్రద్ధ చూపాల్సిందే. జీవిత కాలమంతా ఆ దేవతను నిర్లక్ష్యం చేస్తే అంతిమ సమయంలో తానేంటో చూపిస్తుంది. తొలి తరంలో హేమాహేమీలైన సినీ ఉద్దండులందరి జీవితాలు ఈ సత్యాన్ని నిరూపిస్తున్నాయి.

మీ ఆలోచనా శక్తి ఆమోఘం కావచ్చు. ఎవరికీ తెలియని లోకాలు ఎలా ఉంటాయో క్షణాల్లో ఆలోచించి ఔను ఇలానే ఉంటాయి అని కోట్లాది మందితో అనిపించే సామర్థ్యం మీకు ఉండొచ్చు. లోకాల గురించి ఆలోచించే వారు డబ్బు గురించి, దాని శక్తి సామర్థ్యాల గురించి సరిగా అంచనా వేయకపోతే నరకం ఎలా ఉంటుందో అది నీకు జీవిత చరమాంకంలో చూపిస్తుంది. డబ్బు గురించి కచ్చితత్వం లేకపోతే చివరి రోజుల్లో నిరాశ తప్పదు అని చాటి చెబుతుంది.

ఆయనకు పౌరాణిక బ్రహ్మ అని పేరు. బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆయన సినిమా దేవుళ్లను సృష్టించి పౌరాణిక బ్రహ్మగా నీరాజనాలు అందుకున్నారు కమలాకర కామేశ్వరరావు. దేవుళ్లు అంటే వల్లమాలిన భక్తి. లక్ష్మీదేవి కూడా దేవతే. కరెన్సీ రూపంలో కళ్లెదుట కనిపించే ఆ దేవతపై ఆయన ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే జీవితానికి అండగా నిలిచే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఆయనపై లేకపోవడం వల్ల అంతిమ కాలంలో ఆర్థిక ఇబ్బందులతో కన్ను మూశారు. దర్శకత్వం వహించిన సినిమాలకు దర్శకునిగా పారితోషికంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం, కొందరు నిర్మాతలు దీన్ని అలుసుగా తీసుకోవడాన్ని కొందరు ప్రస్తావించినా పట్టించుకునే వారు కాదు. ఇచ్చినంత తీసుకునే వారు ఇవ్వకపోయినా పట్టించుకునే వారు కాదు. ఈ విషయంలో అంతా ఆయన్ని ధర్మరాజు అనేవారు.

దేవుళ్లు ఇలానే ఉంటారు అని ఆయన చూపించారు. హిందీ సినిమా వాళ్లు సైతం దేవుళ్లకు ఆయన గీసిన డిజైన్‌ను అంగీకరించారు. చివరకు ఇప్పుడెప్పుడైనా ఏ సినిమాలోనైనా దేవుడు కనిపిస్తే కమలాకర కామేశ్వరరావు ముద్ర అందులో తప్పకుండా ఉంటుంది. సినిమా దేవుళ్లపై ఆయన అంత బలమైన ముద్ర వేశారు.
***
ఔను నిజం! కైలాసం ఇలానే ఉంటుంది అని మన చేత అనిపించారు. సకల లోకాలను తన మనోనేత్రంతో చూసి మన కళ్ల ముందు కనిపించేట్టు చేశారు. మూడు లోకాలను మనకు చూపిన ఆయన తనకంటూ ఒక చిన్న ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయాడు. అద్దె ఇంటిలోనే కాలం వెళ్లదీశారు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరావు. తన సినిమాల ద్వారా దేవుళ్లను ప్రజల కళ్ల ముందుకు తెచ్చిన ఆయనపై చివరి రోజుల్లో ఆ దేవుళ్లు కరుణ చూపలేదు. నిర్మాతలకు కనకవర్షం కురిపించిన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన కారు కూడా లేకుండా సామాన్య జీవితమే గడిపారు. చివరకు నిరాశతోనే మద్రాస్ నుంచి మకాం నెల్లూరుకు మార్చి చివరి రోజులు కుమారుడి ఇంట్లో గడిపారు.
***
ఓ పెద్దాయన జీవితంలో ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ నిర్మాతగా ఫిల్మ్‌నగర్‌లో ఆయనకు కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు ప్లాట్లు కేటాయించారు. నర్తనశాల, గుండమ్మ కథ లాంటి కలకాలం గుర్తుండే సినిమాలకు దర్శకత్వం వహించిన కమలాకర కామేశ్వరరావు లాంటి వారికి కనులు మూసేనాటికి సొంత ఇల్ల్లు కూడా లేదు.
జీవితం చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక సమస్యలకు తోడు ఒంటరితనం, అయిన వారు దూరం కావడం వంటివి ఆయనను కృంగదీశాయి.
కెవిరెడ్డి, కమలాకర కామేశ్వరరావు మంచి స్నేహితులు. వాహిని సంస్థలో కలిసి పని చేశారు. దర్శకత్వం వహించేందుకు ఎవరికి ముందు అవకాశం వస్తే, వారు రెండవ వారికి సహాయ దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అలా కెవిరెడ్డికి మొదట అవకాశం వస్తే కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకునిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. కెవిరెడ్డి దర్శకత్వం వహించిన భక్త పోతన, యోగివేమన, గుణసుందరి కథ, పాతాళభైరవి సినిమాలకు సహాయ సహాయ దర్శకునిగా పని చేశారు. విజయ వారు తీసిన చంద్రహారం సినిమా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఇద్దరూ సినిమాల్లో అవకాశం కోసం నిరీక్షిస్తున్నప్పుడు మద్రాసులో ఇద్దరూ తెగ సినిమాలు చూస్తూ వాటి గురించి చర్చించుకునేవారు.
డ్రీమ్‌గర్ల్ హేమమాలిని సినిమాకు పనికి రాదన్నవారున్నారు. కామేశ్వరరావు మాత్రం ఆమెలోని నటిని గుర్తించి పాండవ వనవాసం (1965)లో నృత్యం చేసే అవకాశం కల్పించారు. ఆ తరువాత ఆమె హిందీ సినిమాల్లో డ్రీమ్‌గర్ల్‌గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనూ కమలాకర కామేశ్వరరావుపై గౌరవంతో శ్రీకృష్ణ విజయం సినిమాలో నాట్యం చేసింది.

చంద్రహారం (54), తమిళంలో గుణసుందరి కథ, పెంకిపెళ్లాం (56), పాండురంగ మహత్యం (57), శోభ (58), రేచుక్క పగటి చుక్క (59), మహాకవి కాళిదాసు (60), గులేబకావళికథ, గుండమ్మకథ (62), మహామంత్రి తిమ్మరుసు (62), నర్తనశాల (63) పాండవ వనవాసం (65) శకుంతల (66) శ్రీకృష్ణ తులాభారం (66), శ్రీకృష్ణావతారం, కాంభోజరాజు కథ (67) వీరాంజనేయ, కలసిన మనుషులు (68) మాయనిమమత (70) శ్రీకృష్ణ విజయం (71) బాల భారతం (72) ఇందులో రెండు మూడు సినిమాలు మినహాయిస్తే మిగిలినవన్నీ సూపర్ హిట్టయ్యాయి. నర్తనశాల అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎస్‌విఆర్‌కు ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించి పెట్టిన సినిమా ఇది. 78నాటి వినాయక విజయం తరువాత కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం వహించినా అవి నడవలేదు. పౌరాణిక సినిమాలకు ఆయనకు ఉన్న ఇమేజ్‌ను ఉపయోగించుకుందామనే ప్రయత్నమే తప్ప ఆర్థికంగా పెద్దగా ఖర్చు పెట్టే వారు కాకపోవడం వల్ల ఆ తరువాత వచ్చిన సినిమాలు కమలాకర కామేశ్వరరావు పేరును నిలబెట్టే స్థాయిలో లేవు. అదీ కాకుండా క్రమంగా ప్రేక్షకులు పౌరాణిక సినిమాలకు దూరం అవుతున్న కాలం అది. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ నిర్మిస్తే అదే సమయంలో కృష్ణ కురుక్షేత్రం నిర్మించారు. సాంకేతిక విలువల పరంగా కురుక్షేత్రం బాగున్నా, దానవీరశూరకర్ణ డైలాగుల ముందు నిలువలేకపోయింది.
ఆయన అద్భుతమైన సినిమాలు తీసిన కాలంలో దర్శకుడే సుప్రీం. ఆ స్థానాన్ని హీరో ఆక్రమించడాన్ని చూసి జీర్ణం చేసుకోలేకపోయారు. ఆ తరువాత పౌరాణికాలకు కాలం చెల్లింది, కమలాకర కామేశ్వరరావు కాలం చేశారు.

1911లో బందరులో జన్మించిన కమలాకర కామేశ్వరరావు విద్యాభ్యాసం అక్కడే సాగింది. బిఎ ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా సినిమాలపై ఆసక్తి పెంచుకుని సాంకేతిక అంశాల గురించి అధ్యయనం చేశారు. ముట్నూరు కృష్ణారావు కృష్ణాపత్రికలో సినీఫ్యాన్ పేరుతో సినిమా సమీక్షలు రాసే వారు. ఆ పరిచయాలతోనే సినిమా రంగంలో ప్రవేశించారు.
పౌరాణికాలు మాత్రమే తీయగలరు అనే మాటకు సమాధానంగా గుండమ్మకథను చూపించారు. ఎన్నో విజయవంతమైన పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా చరిత్రలో కలకాలం గుర్తుండే సినిమాలను అందించిన ఆయన సొంత ఇళ్లు కూడా సంపాదించుకోలేకపోయారు. 1999 జూన్ ఐదవ తేదీన నెల్లూరులో తన కుమారుడి ఇంట్లో తుది శ్వాస విడిచారు. చివరి కాలంలో మూడు సినిమాలకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని సినిమాలు తీయాలని ప్రయత్నించారు. ఆ కోరిక తీరకుండానే పోయారు.

1, డిసెంబర్ 2014, సోమవారం

మీరు దేవుడు బాబు గారు !

‘‘నువ్వు ఎన్నయినా చెప్పరా.. ఎన్టీఆర్ మహా దార్శనికుడు ’’
‘‘ఏంట్రోయ్! హఠాత్తుగా ఎన్టీఆర్ గుర్తొచ్చారు.. ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవు... ఆయన నిజంగా దార్శనికుడే అయి ఉంటే కుర్చీ లాగేస్తున్న విషయాన్ని ముందే గుర్తించే వారు కదరా! దార్శనికుడు అని నీకు ఎందుకనిపించాడో? చెబితే మేమూ వింటాం కదా? ’’
‘‘మా అల్లుడు నా కన్నా గొప్ప నటుడు అని ఎన్టీఆర్ అన్నారా? లేదా? ’’
‘‘అవును.. అన్నారు.. అంటే ? ‘‘అల్లుడిలో గొప్ప నటుడు ఉన్నాడని అన్నారే అనుకో... అల్లుడు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కదరా? ’’
అక్కడికే వస్తున్నా ఇదిగో ఈ ఫోటో చూడు...


‘‘పరమశివుడు, వెంకన్న స్వామి, సాయిబాబా, అర్జునుడు భలే ఉన్నాయిరా.. ఈ దేవుళ్ల ఫోటోలు. కొత్త సినిమానా ఏమిటి? అన్నగారు సినిమాల్లో నటించడం మానేశారు. పౌరాణిక సినిమాల శకం ముగిసింది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడే కాదు. రావణ బ్రహ్మ, దుర్యోధనుడు ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమయ్యేవారు. దానవీర శూరకర్ణ చూస్తే నాకైతే కచ్చితంగా దుర్యోధనుడు ఇలానే ఉండేవాడు అనిపించింది. కర్ణుడిని అచ్చుగుద్దినట్టు తెరపై దించేశారు అన్నగారు. మళ్లీ ఇన్నాళ్లకు పౌరాణిక సినిమా తీయాలనే సాహసం చేసింది ఎవరురా? ఆ నిర్మాత ఎవరో కానీ పుణ్యత్ముడు ’’
‘‘ఈ ఫోటోలను మరోసారి చూడు.. ఎవరు కనిపిస్తున్నారు.. బాగా తెలిసిన మనిషిలా కనిపించడం లేదూ! ’’


‘‘అవును బాబుగారి లక్షణాలున్నాయి. ఆయన సినిమాల్లో కూడా నటిస్తున్నారా? ’’
‘‘హమ్మయ్య ఇప్పటికి దారిలోకి వచ్చావు. నటించడం కాదురా! జీవించేస్తున్నారు. బాబులా ఉండడం కాదు.. అవి బాబుఫోటోలే... ఆయన అభిమానులు బాబులో దేవుడ్ని చూస్తున్నారు. పోస్టర్లతో ప్రజలకు చూపిస్తున్నారు. అందుకే చెప్పాను బాబులో ఇంత గొప్పనటుడు ఉన్నాడని గుర్తించారు కాబట్టే ఎన్టీఆర్ మహాదార్శనికుడు అన్నాను.’’
‘‘అయినా ఇదేం చోద్యం.. ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వస్తే, బాబు 64 ఏళ్ల వయసులో రాజకీయాల నుంచి సినిమాల్లోకి వెళుతున్నారా? ఏమిటి కొంపదీసి. ’’
‘‘అవి సినిమా పోస్టర్లు కావు.. బాబులో దైవం కనిపిస్తున్నారు అందుకే అభిమానులు అలా పోస్టర్లు వేయించారు’’
‘‘ఏ దేవుడి పాత్రలోనైనా ఎన్టీఆర్ ఇట్టే కలిసిపోయేవారు.. ఎంత అల్లుడైనా ఆ దేవుళ్ల పాత్రలు ఈయనకు సరిపోవు. నీకు అభిమానం ఉంటే ఉండొచ్చు. దేవుడు ఎన్టీఆర్‌లా ఉం డేవాడని జనం డిసైడ్ అయ్యారు. నువ్వు మధ్యలో వచ్చి కాదు కాదు దేవుడు ఎన్టీఆర్ అల్లుడిలా ఉండేవారు అంటే ఎవరు ఒప్పుకుంటారు?’’


‘‘సరే ఎవరి అభిప్రాయం వారిది. దేవుడి పాత్రకు బాబు సరిపోరని నువ్వంటున్నావు. ఈయనే దేవుడని ఆయన అభిమానుల నమ్మకం. నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను, వారి నమ్మకాన్ని నువ్వు గౌరవించాలి. ’’
‘‘నమ్మకాల సంగతి కాదు.. నువ్వు నిజాయితీగా చెప్పు ఆయన దేవుడి పాత్రలకు సరిపోతాడా? ’’
‘‘చూడోయ్ పలనా హీరోగారి కుమారుడు హీరోగా పనికి వస్తాడా? అల్లుడు పనికి వస్తాడా? మాజీ హీరో మనవడు హీరోగా పనికి వస్తాడా? వారి కన్నా బాగా నటించేవారు బయట ఎంత మంది లేరు? అంటే ఏమంటావు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అంతే? ’’
‘‘ఇంతకూ నీ అభిప్రాయం ఏమిటి? దేవుడి పాత్రలకు ఆయన సరిపోతాడనా? సరిపోడనా? ’’
‘‘మళ్లీ పాత్రలంటావు? అభిమానులు ఆయనే దేవుడు అంటుంటే’’
‘‘ నువ్వు ఎన్నయినా చెప్పు నేను ఒప్పుకోను’’
‘‘ నీ ఒప్పుకోలు ఎవడికి కావాలి.. ముందే చెప్పాను ఎవరి నమ్మకం వారిదని.. సరే నీ మాట ఎందుకు కాదనాలి నీతోనే చెప్పిస్తాను.. ఆయన సరిపోతాడని’’
‘‘ఎలా? ’’
‘‘వెయ్యి పాత్రల అద్భుత గ్రంథం అని పాశ్చాత్యులు మహాభారతాన్ని మెచ్చుకున్నారు. ఒక్కో పాత్రది ఒక్కో ప్రత్యేకత ’’
‘‘ ఇప్పుడు మహాభారత సంగతి ఎందుకు కానీ ఒప్పిస్తానన్నావు కదా? ’’
‘‘ అక్కడికే వస్తున్నా? అక్కడున్న దేవుళ్ల పోస్టర్‌లో మొదటి దేవుడు ఎవరు? ’’
‘‘ అర్జునుడిగా బాబు’’
‘‘మహాభారతంలో శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్మ పితామహున్ని కడతేర్చిన దానికి అల్లుడు ఎన్టీఆర్‌ను గద్దె దించిన దానికి పోలిక కనిపించడం లేదా? అలా గద్దె దించినప్పుడు అల్లుడిలో నీకు అర్జునుడు కనిపించడం లేదూ?’’
‘‘ఆ! ’’
‘‘ ఆయనలో ఉన్న ఒక్కో దేవుడి లక్షణాలు చెప్పమంటావా? ’’
‘‘వద్దు... వద్దు... ఇప్పటి వరకు నేను ఆస్తికున్ని.. నన్ను నాస్తికుడిగా మార్చే ప్రయత్నం చేయకు. నువ్వు చెబుతుంటే నాకు భూమిని చాపలా చుట్టిన పురాణ పురుషుడు గుర్తుకొస్తున్నాడు. ’’
‘‘మయుడి పేరు విన్నావా? ’’
‘‘యముడి పేరు వినిపిస్తోంది.’’
‘‘యముడు కాదు మయుడు... సరే నేను చెబుతాను విను. మయుడు ఎగిరే మూడు పట్టణాలను నిర్మించాడు. మయ అనే అద్భుతమైన రాజధానిని నిర్మించుకున్నాడు. ఎన్టీఆర్ పాపులర్ డైలాగు ఏమంటివేమంటివి గుర్తు కొచ్చిందా? ఆ! ఆ మయసభను నిర్మించింది మయుడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించే అద్భుత ప్రపంచమది. అక్కడే ఎన్టీఆర్ కొలను అనుకుని పడిపోయింది.’’
‘‘ఆగాగు 14 విమానాశ్రయాలు, సింగపూర్ లాంటి నగరం, జపాన్‌లాంటి రాష్ట్రం కళ్ల ముందు చూపిస్తున్న అల్లుడిలో ఇప్పుడు నాకు మయుడు కనిపిస్తున్నాడు.’’


‘‘ఉభయ రాష్ట్రాల్లో రియల్ వ్యాపారులు అభినవ మయుడ్ని తలపిస్తున్నారు. ఏం జరుగుతుందో సామాన్యుడి బతుకు ఏమవుతుందో తెలియదు కానీ ఊహా ప్రపంచాన్ని చూపించేస్తున్నారు. పచ్చని పొలాలు వేగంగా కాంక్రిట్ జంగల్‌గా మారుతున్నట్టు, చెట్లకు కరెన్సీ పంట పండుతున్నట్టు కలలు వస్తున్నాయి. ’’


‘‘మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం కలలు కన మన్నారు. పెద్ద కలలే కనమన్నారు కానీ మరీ ఇంత పెద్ద కలలు కాదేమో ! ’’
‘‘నువ్వెన్నయినా చెప్పు నా అనుమానాలు నావి. పాలకులు బాణాలతో ఆకాశానికి నిచ్చెన వేసిన అర్జునుడిలా మిగిలిపోతే సంతోషం. కాళ్లకు రాసుకున్న లేపనం కరిగిపోయిన తరువాత దారి తెలియక హిమాలయాల్లో అయోమయంగా తిరిగిన ప్రవరాఖ్యుడిలా మిగిలిపోకుండా ఉంటే చాలు.