16, నవంబర్ 2014, ఆదివారం

ఆ హీరోయిన్ టై మ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా నిలిచింది - అనాధలా మరణించింది



మూడు రోజుల నుంచి ఆ శవం మంచంపై పడి ఉంది. తలుపులు విరగ్గొట్టి లోనికి వెళ్లి శవాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. ముక్కు మూసుకున్నారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చాలా సేపటి వరకు ఆ శవాన్ని శుభ్రం చేసేందుకు ఎవరూ రాలేదు. మరణించి మూడు రోజులు కావడం వల్ల కుళ్లి పోయింది.
హే భగవాన్ ఆమెమీద ఎందుకంత కక్ష.. పగవానికి కూడా ఇలాంటి మరణం వద్దు అని వౌనంగా రోదించారు ఆ శవాన్ని చూసిన వారు...


***
భగవంతుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఆమె కోసం ప్రత్యేంగా సమయం కేటాయించి పోత పోసినట్టున్నాడు. లేకపోతే ఆమె అంత అందంగా ఎలా ఉంటుంది. సృష్టి ధర్మం అని ఆమెను భూమిపైకి పంపించాడు కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆమెను తన లోకంలోనే ఉంచుకునే వాడేమో ఆ దేవుడు. అందమే ఆమెలా ఉంటుంది అని చెప్పాల్సినంత అందం ఆమెది. కోట్లాది మంది అభిమానులే కాదు... సాటి మేటి నటులు సైతం ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఇతర అందగత్తెలు ఆమె అందాన్ని చూసి ఈర్ష్య పడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత 
టై మ్ మ్యాగజైన్ సైతం ఆమె అందానికి దాసోహం అంది. తన ముఖ చిత్రంగా మార్చుకుంది.
ఇంతకూ ఎవరామె?

అనాధలా మరణించింది, అందగత్తె ఇద్దరూ ఒకరే .. దాదాపు దశాబ్ద కాలం పాటు హిందీ సినిమా అప్సరసగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన పర్వీన్ బాబీ . బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్, హిందీ సినిమాలకు ఫ్యాషన్‌ను నేర్పిన అందగత్తె అమె.
కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసిన ఆ అందగత్తె శాశ్వత నిద్రలోకి జారుకున్న విషయం మూడు రోజుల తరువాత కానీ ప్రపంచానికి తెలియలేదు.
ఆమె అందంగా ఉండడానికి, దయనీయమైన మరణానికి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు. మనిషి తన చేతులతో, తన చేతలతోనే తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

***
గుజరాత్‌లోని జునాఘడ్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించిన పర్వీన్ బాబీ అహమ్మదాబాద్‌లోని స్కూల్‌లో చదువుకుంది. పదేళ్ల వయసులో ఉండగానే తండ్రి మరణించాడు. బహుశా ఆమె జీవితంలో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండి ఉంటుంది. తండ్రి ద్వారా పిల్లలకు ఆత్మవిశ్వాసం అలవడుతుంది. బాల్యంలోనే ఆ భరోసాను కోల్పోయిన పర్వీన్ బాబీ ప్రేమ కోసం పరితపించినట్టు ఆమె ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది. అహ్మదాబాద్‌లో కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 1972లో మోడల్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఆమెకు 73లోనే చరిత్ర అనే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించింది. సినిమా ఫ్లాప్, కానీ పర్వీన్ బాబి అందానికి హిందీ సినిమా రంగం ఫ్లాట్ అయింది. 74లో అమితాబ్‌తో కలిసి నటించిన బజ్‌బూర్ పెద్ద హిట్.. అవకాశాలు వెల్లువెత్తాయి. భారతీయ సినిమా హీరోయిన్ల ఇమేజ్‌ను మార్చేసిన నటిగా గుర్తింపు పొందింది. తన కాలంలో ఆమె ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే... 73లో సినిమా రంగంలోకి ప్రవేశిస్తే, 76జూలైలో ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ముఖ చిత్రంగా నిలిచింది. టైమ్స్ ముఖ చిత్రంగా వెలిగిపోయిన తొలి బాలీవుడ్ నటి. అమితాబ్‌తో కలిసి ఆమె ఎనిమిది సినిమాల్లో నటిస్తే, అవన్నీ సూపర్ హిట్టయ్యాయి. 1970-80ల కాలంలో టాప్ హీరోలైన అమితాబ్, శశికపూర్, ఫిరోజ్ ఖాన్, ధర్మేంద్ర, రాజేష్‌ఖన్నా, వినోద్ ఖన్నా, మనోజ్‌కుమార్, రిషికపూర్, మనోజ్ కుమార్‌లతో హీరోయిన్‌గా నటించింది. 75లో వచ్చిన దీవార్‌లో ఆమె అందం ఇప్పటికీ నిత్యనూతనంగా అభిమానులను అలరిస్తుంది. 77లో వచ్చిన అమర్ అక్బర్ అంథోనీ సినిమాల్లో అమితాబ్‌కు జంటగా నటించింది.

***
తండ్రి లేడు, బంధువులకూ పర్వీన్ బాబీకి సంబంధాలు లేవు. గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ గ్లామర్ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఎంతో మంది చుట్టూ చేరేట్టు చేస్తూంది. అదే అందం ఆమెను అగాధంలోకి తోసేస్తుంది. సినిమా ప్రపంచం మాయ గురించి చెబుతూ ఓ సందర్భంలో తెలుగు నటి రమాప్రభ జీవిత అనుభవంతో ఓ మాట చెప్పారు. వయసు, డబ్బు ఈ రెండింటికే మగాడు ఆకర్షితుడవుతాడు. కానీ స్ర్తి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉంటాయంది. ఎంతో మంది సినిమా హీరోయిన్ల మాదిరిగానే పర్వీన్ బాబీ విషయంలో అదే జరిగింది. మంచి అందగత్తె... విపరీతంగా చదివే అలవాటుంది. ఆధునిక భావాలు. ప్రేమ కోసం తపిస్తోంది. ఇంత కన్నా ఇంకేం కావాలి. ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న నేటి మేటి దర్శకుడు మహేశ్‌భట్ పర్వీన్ బాబీకి చేరువయ్యారు. ఆమె కోరుకున్నది, అతను కోరుకున్నది వేరు వేరు, కానీ ఇద్దరూ ఏకమయ్యారు. పర్వీన్ బాబీ తరుచూ మానసికంగా తీవ్రమైన సంఘర్షణలోకి లోనయ్యేది. పర్వీన్ బాగా చేరువైన తరువాత మహేశ్‌భట్ 82లో అర్త్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కథ తానే రాశారు. ఇది పర్వీన్‌బాబీ, భట్‌ల ప్రేమ కథ అనే ప్రచారం ఉంది. ఈ సినిమా తరువాత పర్వీన్‌బాబి మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు.

ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి టాప్ పొజిషన్‌లో ఉన్న సమయంలోనే పర్వీన్ ఎవరికీ చెప్పకుండా 83లో కనిపించకుండా పోయారు. ముంబై మాఫియా ఆమెను కిడ్నాప్ చేసిందని రకరకాల పుకార్లు వినిపించాయి. ప్రముఖ తత్వవేత్త యుజి కృష్ణమూర్తి, తన స్నేహితుడు వాలైంటెన్‌తో కలిసి ఆ సమయంలో ఆమె అనేక దేశాలు తిరిగింది. కాలిఫోర్నియాలో ఎక్కువ రోజులు ఉన్నారు.

నమ్మిన వ్యక్తులు మోసం చేయడం, ప్రేమించిన వారు అవమానించడం వంటి సంఘటనలు ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపించాయి. చివరకు తానెవరో తనకే తెలియని స్థితికి చేరుకుంది. 84లో జాన్ ఎఫ్ కెన్నడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన ఐడెంటిటీ చెప్పలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అమెను పోలీసులు అదుపులో తీసుకుని మరో 30 మంది పిచ్చివాళ్ల మధ్య ఉంచారు. విషయం తెలిసి యుజి కృష్ణమూర్తి తన పలుకుబడితో ఆమెను బయటకు తీసుకు వచ్చారు. కొంత కాలం తరువాత హఠాత్తుగా ముంబైలో ప్రత్యక్షమయ్యారు. అమితాబ్ మొదలుకుని అనేక మంది తనపై కుట్ర చేస్తున్నారని ఏమేమో మాట్లాడసాగింది. తన వారు అనేవారు ఎవరూ లేరు, ఒక్క మత్తు మందు తప్ప . ఆ మత్తులోనే అనంత లోకాలకు పయనమైంది.

పత్రికలు, పాల ప్యాకెట్లు మూడు రోజులైనా తీసుకోక పోవడంతో అనుమానం వచ్చి తలుపు బద్దలు కొడితే పర్వీన్ బాబీ శవం కనిపించింది. హిందీ చిత్ర సీమ మొత్తం తరలి వస్తుందేమో అనుకుని ఆస్పత్రికి వెళ్లాను కానీ ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు అంటూ ఆనాటి సంఘటనను తలుచుకుంటూ ఓ హిందీ దర్శకుడు గద్గద స్వరంతో పలికాడు.
ఐశ్వర్యం అంటే బంగారం, డబ్బు , భూముల రూపం లోనే కాదు .. మానవ సంబంధాల రూపం లో కూడా ఉంటుంది అని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు .. అందుకే అష్ట 
ఐశ్వర్యా లలో కుటుంబం , సంతానం , బందు  గ నా న్ని కూడా చేర్చారు .. బలమైన కుటుంబం కూడా ఐశ్వర్యమే. మానసికంగా ఆందోళనలో ఉన్నప్పుడు   , ఏది మంచో ఏది చెడో  నిర్ణయించు కోలేనప్పుడు,  సరైన  నిర్ణయం తీసుకోవడానికి కుటుంబం అండగా నిలుస్తుంది . 

ఆమె సంపన్న కుటుంబం లో పుట్టింది కానీ సినిమాల్లోకి వచ్చాక ఆమెకు కుటుంబం తప్ప అన్నీ ఉన్నాయి .  గొప్ప అందగత్తె ఎంతో సంపాదించింది. కానీ కుటుంబ సంబంధాల విషయంలో నిరుపేదగానే మిగిలిపోయింది. మానసికమైన ఒత్తిడి ఏ వృత్తిలోని వారికైనా ఎంతో కొంత సహజమే. గ్లామర్ పోటీ ప్రపంచంలో అది మరీ ఎక్కువగా ఉండొచ్చు. తల్లితండ్రి, భార్యాభర్తలు, పిల్లలు, బంధువులు, మంచి మిత్రులు అనే బలమైన రక్షణ కవచం  ఉన్నప్పుడు ఇలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేకపోతే జీవితం పర్వీన్ బాబీలా విషాదంగా ముగుస్తుంది. సంపదను నిలబెట్టుకోవడమే కాదు బంధాలను కూడా నిలబెట్టుకున్నవారే ఐశ్యర్యవంతులు.

ఏప్రిల్ 4, 1949లో జన్మించిన పర్వీన్ బాబీ, జనవరి 20, 2005లో మరణించారు.

 ‘ఆమె రెండుసార్లు మరణించారు, మానసికంగా మొదటిసారి, శారీరకంగా రెండవ సారి మరణించింది’ అని మహేశ్‌భట్ ఆమె మరణించినప్పుడు కామెంట్ చేశారు. 

మానసికంగా మరణించిన పర్వీన్ బాబీలు నేటి మెటీరియలిస్టిక్ ప్రపంచంలో లెక్కలేనంత మంది ఉన్నారు. 
*  

2 కామెంట్‌లు:

  1. *తత్వవేత్త యుజి కృష్ణమూర్తి, తన స్నేహితుడు వాలైంటెన్‌తో కలిసి*

    వాలెంటైన్ స్విస్ మహిళ, పురుషుడు కాదు. యు.జి. గారు స్విజర్లాండ్ లో ఆమే ఇంటిలో ఉంట్టుండేవారు. మహేశ్ భట్ బిజిగా ఉండి, పర్వీన్ బాబి ఆరోగ్యం సరిగా లేని సందర్భాలలో, యు.జి. సహాయం కోరేవారు. యు.జి. ఆమేకు ఎంత సహాయం చేయాలో అంతా చేసేవారు.

    రిప్లయితొలగించండి
  2. http://ug-krishnamurti.blogspot.in/2010/09/confessions-of-parveen-babi-parveen.html

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం