4, మే 2014, ఆదివారం

దారితప్పిన మేధావి

సబ్బం హరి. ఈ పేరు తలుచుకోగానే ఔను ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? గతంలో ప్రతిరోజూ టెలివిజన్ చర్చల్లో కనిపించే వారు కదా! ఇప్పుడు కనిపించడం లేదేమిటి? అనే ప్రశ్నలు ఒకదాని తరువాత ఒకటి తన్నుకొస్తాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా బలమైన వాదన వినిపించేవారు. ఇప్పుడాయన ఏం చేస్తున్నట్టు? -అంటే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు? అదీ -జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి. ఇది నిజ్జంగా నిజం. ఆ పార్టీకి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. 

టెలివిజన్ చర్చలు దెబ్బతీసిన నాయకుల్లో సబ్బం హరి ఒకరు. వైఎస్సార్ ఉండగా, ఆయనకు గట్టి మద్దతుదారునిగా నిలిచారు. వైఎస్సార్ మరణం తరువాత అంతకుమించి జగన్‌కు అండగా నిలిచారు.. జగన్ మీద ఈగవాలినా సహించక పోయేవారు. రోజూ టెలివిజన్ చానెళ్లలో కనిపిస్తూ జగన్‌కు అండగా నిలిచారు. అంతా బాగానే ఉంది. కానీ గొప్ప మేధావిని అనే గట్టి నమ్మకం ఆయన్ని రాజకీయాల్లో దెబ్బతీసింది. అసలే మేధావిననే నమ్మకం.. పైగా టీవీ చర్చలు. ఊరికే ఉంటారా? జగన్ యూపీఏకు మద్దతిస్తారంటూ ప్రకటించేశారు. సబ్బం వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న తెదేపా -జగన్‌పై దాడి మొదలెట్టింది. దాంతో వైకాపా వాళ్లు మేం ఎవరికి మద్దతిస్తామో చెప్పడానికి సబ్బం హరికి సంబంధమేంటి? ఆయనసలు మా పార్టీనే కాదు, ఆయనకు మా పార్టీ సభ్యత్వం కూడా లేదు -పొమ్మన్నారు.
మేధావి అహం దెబ్బతింది. నేనేమీ వైకాపా సభ్యత్వం కోసం 

దేబిరించలేదు అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌లో ఉండి జై సమైక్యాంధ్ర అంటున్నందున ఏకంగా జై సమైక్యాంధ్రనే నమ్ముకుంటే పోలే అనుకుని కిరణ్ అధ్యక్షతన ఉన్న జై సమైక్యాంధ్ర పార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో బాగా ఊహించి అధినాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డినే పోటీకి దూరంగా ఉంటున్నందున పోటీలో ఉన్న సబ్బం హరి పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలుగుతాడని భావించిన నాయకుడు చివరకు ఇలా అయిపోయారు. జగన్ జైలులో ఉన్నంతకాలం ఆయనకు మద్దతుగా నిలిచారు. తీరా బయటకు వచ్చే సమయానికి పార్టీ వీడి వెళ్లారు. విశాఖ మేయర్‌గా పని చేసిన సబ్బం హరి, 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. పార్లమెంటులో చివరి వరకూ పోరాడారు. సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టటంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. టీవీ చర్చలతో జగన్ పార్టీకి దూరమయ్యారు. కిరణ్‌కు చేరువైనా, కిరణ్‌కే రాజకీయ జీవితం లేనప్పుడు ఇక సబ్బానికేముంటుంది? అన్న సంపతీ డైలాగులు ఎదుర్కొంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఐదుశాతం ఓట్లు కూడా రావని లెక్కలు 
చెబుతున్న సబ్బం, తనకు ఎన్ని శాతం ఓట్లు వస్తాయో చెప్పలేకపోతున్నారు. విశాఖ మేయర్‌గా పట్టణంలో మంచి పట్టుసాధించారు. హేమాహేమీలను తట్టుకుని 2009లో పార్లమెంటుకు ఎన్నికైన సబ్బం రాజకీయ జీవితం ఇప్పుడు క్రాస్‌రోడ్‌లో ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం