27, మార్చి 2014, గురువారం

దేశంలో -తొలి మహిళా హోంమంత్రి

ఒక్క నిర్ణయం -జీవితానే్న మార్చేస్తుంది.
సంక్షోభం సమయంలో సమయస్ఫూర్తిగా తీసుకున్న చిన్న నిర్ణయం -ఆమె రాజకీయ జీవితాన్ని వెయ్యిమైళ్లు ముందుకు తీసుకుపోయింది. దేశంలోనే -తొలి మహిళా హోంమంత్రిని చేసింది.
చంద్రబాబు సీఎం పీఠంపై ఉన్నపుడు -పార్టీ ఎమ్మెల్యే ఎవరు మరణించినా భార్యకు టికెట్ ఇచ్చే సంస్కృతి తెచ్చారు. దాని ప్రకారం -ఒక దశలో 12 మంది వితంతువులు సభలోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి మరణించారు. సొంత పార్టీ వారేకాకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యే మరణించినా టికెట్ తమ పార్టీ నుంచే ఇస్తాననే ప్రతిపాదనతో బాబు ముందుకొచ్చారు. 


జిల్లాలో చక్రం తిప్పుతున్న దేవేందర్‌గౌడ్, మేనల్లుడు మహేందర్‌రెడ్డి, బంధువులంతా తెదేపా టికెట్ తీసేసుకో.. 2020 వరకూ ఆ పార్టీకి ఢోకాలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వైఎస్సార్ -నా మాట నమ్మండి. తెదేపా పనైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. బాగా ఆలోచించండి! -అని ఇచ్చిన సలహా ఆమె రాజకీయ జీవితానికి సోపానంగా మారింది. సంక్లిష్ట పరిస్థితిలో సమయస్ఫూర్తి నిర్ణయం తీసుకున్న ఆమె -సబితా ఇంద్రారెడ్డి. కాళ్లదగ్గరకు వచ్చిన చాన్స్ వదులుకున్నారని అంతా జాలి చూపినా -ఆమె ధైర్యం వీడలేదు. కాంగ్రెస్ తరఫునే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. పోటీ చేశారు, విజయం సాధించారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పదేళ్లపాటు మంత్రిగా ఉన్నారు.


దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ ప్రభుత్వంలో పని చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా భర్త రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్నందున రాజకీయాల్లో ఆమె ఎలాంటి ఇబ్బందీ పడలేదు. ఇంద్రారెడ్డి భార్యగా రాజకీయాల్లో ప్రవేశించి -సొంత వ్యక్తిత్వంతో ధృడంగా, స్వతంత్రంగానే వ్యవహరించారు.
వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిని చేసిన పాదయాత్రకు తొలి అడుగు పడింది చేవెళ్ల నుంచే. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొత్త పథకమైనా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారు. వైఎస్సార్ రెండోసారి విజయం సాధించాక రచ్చబండను తిరుపతి నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ -ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
చేవెళ్ల నుంచి రెండుసార్లు, మహేశ్వరం నుంచి ఒకసారి విజయం సాధించారు సబిత. వైఎస్ ప్రభుత్వంలో గనుల మంత్రిగా పని చేశారు. ఆకాలంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై సిబిఐ కేసు ఎదుర్కొంటున్నారు. బిఎస్సీ చదివిన సబితా ఇంద్రారెడ్డి ఉన్నంత వరకు గృహిణిగానే ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మరణించిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌ను దించేసే సమయానికి ఆయన హోంమంత్రి. భార్యాభర్తలు ఇద్దరూ రెండు వేర్వేరు పార్టీల ప్రభుత్వాల్లో హోంమంత్రులుగా పని చేసిన రికార్డు ఉంది. 


సబితకు ముగ్గురు పిల్లలు. కుమారుడు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఆమె ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదేశాలను పట్టించుకోని పోలీసులు, ముఖ్యమంత్రి ఒత్తిడి, తెలంగాణవాదుల విమర్శలు వీటి మధ్య ఆమె ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. గనుల కేటాయింపుపై సిబిఐ కేసు వల్ల సబిత 2013లో మంత్రి పదవికి రాజీనామా లేఖ ఇచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం