20, మార్చి 2014, గురువారం

కుండబద్ధలు కొట్టే సిల్లీ నేత టిజి వెంకటేష్

నేతా  శ్రీ 5 

కర్నూలులో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక తొలి బహిరంగ సభ. జనం పెద్ద సంఖ్యలోనే వచ్చారు. వేదిక ఎందుకు ఏర్పాటు చేశారో? వెంకటేశ్ ఏం చెబుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్ ఒక కుండను తీసుకొచ్చి వేదిక ముందు పెట్టాడు. జనంలో మరింత ఆసక్తి పెరిగింది. కొద్దిసేపటి తరువాత వెంకటేశ్ పెద్ద కర్రను పట్టుకుని ముందుకొచ్చాడు. ఆయన ముఖాన్ని చూసిన వారు ఎవరిపైనో దాడికి వచ్చాడనుకున్నారు. కర్రను పైకి లేపి బలంగా కుండపై కొట్టాడు. అది బద్దలైంది. ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. అప్పుడు మైకు వద్దకొచ్చిన టీజీ వెంకటేశ్ -నేను ఏంచెప్పినా కుండబద్దలు కొట్టి చెబుతాను -అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. రాజకీయాల్లో ఆయన సిల్లీ పనులకు ఇదో ఉదాహరణ. ఆయన సీరియస్‌గా చెప్పాలనుకున్నారో, మీడియా దృష్టిని ఆకట్టుకోవాలని ప్రయత్నించారో కానీ జనం అంతా ఆయన చర్యను సిల్లీగానే తీసుకున్నారు.


రాముడు- భీముడు సినిమాలో రాముడు అమాయకంగా కనిపిస్తే, భీముడు అందరినీ చితగ్గొడుతుంటారు. రెండు పాత్రల్లోనూ ఎన్టీఆర్ ఇమిడిపోయారు.
సరిగ్గా టీజీ వెంకటేశ్ కూడా అంతే. వ్యాపారాల్లో అయన ఎంత సీరియస్‌గా ఉంటారో, రాజకీయాల్లో అంత సిల్లీగా ఉంటారు. ఆ వెంకటేశ్ ఈ వెంకటేశ్ ఒకరేనా? అని చూసిన వారు ఆశ్చర్యపోవాలి.
ఆదోనికి చెందిన టీజీ వెంకటేశ్ రాయలసీమకు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబం. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. విజయవంతమైన వాణిజ్య వేత్తకు ఏ సమయంలో ఏం చేయాలో బాగా తెలుసు. రాజకీయాల్లో సైతం టీజీ వెంకటేశ్ ఈ సూత్రాన్ని చక్కగా పాటిస్తున్నారు.


టి డిపి ఎమ్మెల్యేగా ఉంటూనే బిజెపికి చేరువయ్యారు. కర్నూలులో టిడిపి ఎమ్మెల్యేగా బిజెపి సమావేశాలకు హాజరయ్యారు. 2004లో ఓడిపోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై రోశయ్య మంత్రివర్గంలో మంత్రి అయ్యారు, కిరణ్ మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పని ఖాళీ అయిందని భావించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వ్యాపారవేత్తగా ఇప్పుడు మళ్లీ టిడిపిలో చేరారు. సీమాంధ్రను అభివృద్ధి చేయగల సామర్థ్యం బాబుకే ఉందని చెబుతున్నారు. బాబును వీడివెళ్లిన పదేళ్ల తరువాత ఆయన బాబు సామర్థ్యాన్ని గుర్తించారు.


తన పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగుల్లో మద్యం, సిగరేట్ తాగే అలవాటు లేనివారికి ప్రత్యేక ప్రోత్సహాకాలు ఇచ్చారు.
కర్నూలులో కెఇ కృష్ణమూర్తి వర్గంతో రాజకీయ వైరం. చివరకు కేబుల్ టీవీలకు సైతం ఈ వైరం ప్రాకింది. సై అంటే సై అంటూ నెలకు ఐదు రూపాయలకే కెబుల్ టీవీ కనెక్షన్ ఇచ్చి ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీ గూటిలో ఉన్నారు. పవర్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్న టీజీ వెంకటేశ్ పవర్ పాలిటిక్స్‌ను బాగానే వంటబట్టించుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం