25, డిసెంబర్ 2013, బుధవారం

కేజ్రీవాల్‌కు దేవుడే దిక్కు

పూచిక పుల్లను చేతిలోకి తీసుకుని మంత్రిస్తే అది మహాశక్తివంతమైన ఆయుధం అవుతుంది. సీతమ్మ రావణుడితో నేరుగా మాట్లాడడం ఇష్టం లేక గడ్డిపోచతో మాట్లాడుతుంది. చీపురు పుల్లలు, గడ్డిపోచలు ఇప్పుడే కాదు మన పురాణాల్లో సైతం మహత్తరమైన పాత్ర పోషించాయి. మూడు దశాబ్దాల పాటు బెంగాల్‌లో పాతుకుపోయిన కమ్యూనిస్టులను మమతక్క గడ్డిపోచతోనే మట్టికరిపించింది. అది గడ్డిపోచ గొప్పతనమా? దానిలో మహత్తర శక్తులను నింపిన మమత గొప్పతనమా? లేక మూడు దశాబ్దాల పాలనతో గడ్డిపోచకు కూడా చులకైనయ్యే విధంగా పాలించిన ఎర్రన్నలది తప్పా? కాల మహిమనా? అంటే సమాధానం ఎవరికి తోచినట్టు వారు చెబుతారు.

 ఆయుధాన్ని చేపట్టకుండా ఒంటి చేత్తో మహాభారత యుద్ధాన్ని నడిపించిన శ్రీకృష్ణుడంతటి వాడు చివరకు పూచిక పుల్లలాంటి బాణానికి ప్రాణాలు విడిచాడు. మహామహావీరులు సైతం కాలం కలిసి రానప్పుడు పూచిక పుల్లల చేతిలో మట్టికరిచిపోతారు. సీతను కాకాసురుడు ముక్కుతో పొడుస్తుంటే శ్రీరాముడికి ఆగ్రహం వచ్చి గడ్డిపోచను అభిమంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తాడు. ఇందిరాగాంధీ రాజ్‌నారాయణ్ చేతిలోఓడిపోవడం, ఎన్టీఆర్ చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓడిపోయి, బాబు చేతిలో హరీమనడం ఇలాంటిదే.
ఢిల్లీ ప్రజలకు రాజకీయ కాకాసురులపై ఆగ్రహం కలిగి గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చి చరిత్ర సృష్టించారు. పూర్తి మెజారిటీ రాకపోవడంతో జనం తయారు చేసిన బ్రహ్మాస్త్రం కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో దేశంలో సంచలనం సృష్టించిన ఫలితాలు మొదటిది బెంగాల్‌లో కమ్యూనిస్టు కంచుకోట కూలిపోడవం అయితే ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా చీపురుకట్ట పార్టీని జనం ఆందలమెక్కించడం. 


రాజ్యం వీర భోజ్యం అన్నారు. నిజమే ఇంత కాలం రాజ్యం సంపన్నులకు భోజ్యంగా మారింది. పార్టీల పేర్లు ఏమైనా సంపన్నుల చేతిలోనే అధికారం ఉంటూ వచ్చింది. ఇంట్లో ఒక మూల ఎవరికీ కనిపించకుండా బతుకీడుస్తుంది చీపురు కట్ట. అలాంటి చీపురు కట్టకు కేజ్రీవాల్ మహర్దశ పట్టించాడు. కాదేది కవిత్వాని కనర్హం అని శ్రీశ్రీ అంటే కాదెవరు అధికారానికి అనర్హులు అని కేజ్రీవాల్ చీపురు కట్టకు అధికార హోదా కల్పించారు. సింహాసనం పై కూర్చోబెట్టారు.


నిర్భయ సంఘటన తరువాత చివరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి షీలాదీక్షిత్ సైతం నిజమే మా అమ్మాయి కూడా ఢిల్లీలో ఆడవారికి భద్రత లేదంటోంది అని చెప్పుకొచ్చారు. షీలాదీక్షిత్ కుటుంబ అభిప్రాయమే ఇదైతే, ఇక మా గతేం కాను అనుకున్న ఢిల్లీ వాసులు తొలుత నిర్భయ కోసం ఉద్యమించి తరువాత తమ కోసం ఆమ్ ఆద్మీ పార్టీని నమ్ముకున్నారు. అధికారానికి ఒక అడుగు దూరంలోనే కేజ్రీవాల్‌ను నిలిపివేశారు. చెత్తను ఊడ్చడానికైనా చీపురుకు చెయ్యి ఆసరా తప్పదు అని నచ్చజెప్పి కాంగ్రెస్ కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించింది. కేజ్రీవాల్ మనసులో ఏ ముందో కానీ ఈ నిర్ణయంతో అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ఊపరి పీల్చుకున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కేజ్రీవాల్ ఇక కాంగ్రెస్ అవినీతిపై ఏం విచారణ జరిపిస్తాడని బిజెపి నాయకులంటున్నారు. ఎక్కడికి వెళ్లినా భారత్‌మాతాకీ జై అంటూ ఆమ్ ఆద్మీయులు నినాదాలు చేస్తున్నారు. భారత్ మాతా పార్టీ బిజెపికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. ఆమ్ ఆద్మీ దేశ వ్యాప్తంగా పోటీ చేస్తే ఆంతో ఇంటో బిజెపి ఓట్లకే తూట్లు పడతాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ చేరువ కావడంతో బిజెపి ఊపిరి పీల్చుకుంటోంది.


అయ్యా మీరు ముఖ్యమంత్రి.. మీకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తాం అంటే కేజ్రీవాల్ అచ్చం తెలుగు నేతల డైలాగులే చెబుతున్నారు. నాకు దేవుడే దిక్కు, మీ భద్రత అవసరం లేదని చెప్పారు. చాలా మంది తెలుగువారు ఎన్టీఆర్‌ను శ్రీరాముడికి శ్రీకృష్ణుడిగా కొలిచేవారు. తాను దేవుడినని ఎన్టీఆర్‌కు గట్టినమ్మకం ఉండేది. దేవుడిననుకున్న ఎన్టీఆర్‌కే వెన్నుపోటు తప్పనప్పుడు, దేవుడిపై భారం వేసిన కేజ్రీవాల్‌కు తప్పుతుందా? దేవుడిపై భారం వేసిన కేజ్రీవాల్‌కు రాజకీయ గండం ఏ రూపంలో రానుందో వేచి చూడాలి. అయినా కేజ్రీవాల్ మనం అనుకున్నంత ఆమాయకుడేం కాదనిపిస్తోంది.


నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్టు, బిజెపి కాంగ్రెస్‌లు ఒకందుకు మద్దతు ప్రకటిస్తే, కేజ్రీవాల్ మరొకందుకు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నాడు. తాను చేయాలనుకున్న మార్పులు చేస్తాడు, ఎక్కడైనా తేడా వచ్చి ప్రభుత్వం పడిపోతే అది తనకు మద్దతు ఇచ్చిన వారి తప్పుకానీ తనది కాదని చెప్పుకునే రాజకీయ వ్యూహం కేజ్రీవాల్‌కు ఉన్నట్టుగానే ఉంది. అందుకే అన్నీ బహిరంగమే అంటున్నాడు. సర్వేలో మీ అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేయమంటేనే చేస్తున్నానని చెప్పుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నాడు.


ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఆచితూచే ఆడుగులు వేశాడు. చివరకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేయాలనే నిర్ణయం సైతం. రామాయణంలోని చిత్రవిచిత్రాలను కళాకారులు ప్రదర్శించే మైదానం అది. అంతే కాదు దేశ రాజకీయాల్లో అనేక మలుపులకు ఆ మైదానం సాక్షిగా నిలిచింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్‌నారాయణ్ తొలి సభ, అరెస్టుకు ముందు చివరి సభ జరిపింది ఇక్కడే. ఎమర్జన్సీ ఎత్తేశాక మహామహులు జనతా పార్టీగా ఆవిర్భవించింది ఇక్కడే. అన్నా హజారే ఉద్యమం సాగింది ఇక్కడే. ఇప్పుడు ఇక్కడే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ మద్దతుపై ఏడు భాషల్లో కేజ్రీవాల్ వివరణ ఇస్తూ యూ ట్యూబ్‌లో చేర్చారు.
రామ్‌లీలా మైదానం ఒకప్పుడు మంచినీటితో కళకళలాడిన పెద్ద చెరువు. ఇప్పుడది రాజకీయ నెలవు. కేజ్రీవాల్ చెరువులో బురదగా మారిపోతాడా? బురద గుంటలో పూవుగా వికసిస్తారా? వేచి చూద్దాం. జనం ప్రభుత్వాల పై భరోసా వదిలేసి దేవుడే దిక్కు అనుకుంటున్నారు . కేజ్రివాల్ కూడా  దేవుడి పైనే భరోసా వేస్తే ఇక ఎలా ?