18, డిసెంబర్ 2013, బుధవారం

రాజకీయ నాటకం!

భీముడు బీడీ కాలుస్తూ ద్రౌపది వైపు చిలిపి గా చూస్తుంటే పోరా పోకిరీ అని ద్రౌపది భీముడ్ని ఒక్క తన్ను తన్ని తెరవెనుక నుం చి స్టేజిపైకి వచ్చింది. స్టేజీని, జీవితాన్ని వేరు చేసేది చిన్న తెరమాత్రమే. అప్పటి వరకు తెర వెనుక నిర్లక్ష్యంగా కనిపించిన ద్రౌపది తెరపైకి రాగానే తన ను తాను పవిత్రంగా మార్చుకుని మహాపతివ్రత గా నటించేస్తుంది. చిల్లర వేషాల భీముడు బీడిని నాలుగు దమ్ములు లాగించి పారేసి తెరపైకి రాగా నే మహాబలసంపన్నుడిగా మారిపోయాడు. మ హాసాధ్వి సీతమ్మ తన కష్టాలతో జనాన్ని కన్నీళ్లు పెట్టిస్తుంది. నేను వదిన పాదాలు మాత్రమే చూశా ను ముఖాన్ని చూడలేదు అని డైలాగు చెప్పి తెర వెనక్కి వెళ్లిన లక్ష్మణుడు సీత పాత్రధారితో చిలిపి వేషాలు వేయవచ్చు.


తొలిసారి చంద్రమండలంపై కాలు పెట్టినవాడు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాడు ఎలా ఆశ్చర్యపోయాడో తెర ముందు పాత్రలను తెర వెనుక వేషాలు  తొలిసారి చూసినప్పుడు అలానే ఆశ్చర్యపోతాడు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో సైతం ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.


తెర ముందు నటన, తెర వెనుక జీవితం. బాత్రూమ్‌లో స్నానం చేసేప్పుడు తప్ప మనిషి మెలుకువ ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటాడంటాడు రజనీష్. ఎంత డబుల్ రోల్ సినిమా అయినా నటుడు ఒక పాత్రలో ఒకేసారి నటిస్తాడు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణలో ముప్పావు డజను పాత్రల్లో నటించినా, కమల్‌హాసన్ దశావతారాల్లో కనిపించినా ఆ మహానటులు సైతం ఒకసారి ఒక పాత్రలోనే నటించారు. కానీ రాజకీయ నటులు మాత్రం ఒకేసారి ఒకే సమయంలో అనేక బహు పాత్రల్లో బహుముఖ ప్రతిభను చూపాల్సి ఉంటుంది. ఇలాంటి అరుదైన నటన అసెంబ్లీ సమావేశాల్లో చూసే భాగ్యం లభించింది.


***
తెలుగు నటుడు అప్పుడే భీకర కరుణ రసాత్మకంగా నటించి మీరు వెళ్లి బిల్లును అడ్డుకోండి అని సగం సైన్యాన్ని పంపించాడు. మిగిలిన సైన్యం అప్పటి వరకు చేతులు కట్టుకుని మీ ఆజ్ఞకోసం ఎదురు చూస్తున్నాం మహారాజా అని వినయంగా అడిగారు.
ముందు వెళ్లిన ఆంధ్ర సైన్యం బిల్లును అడ్డుకుంటుంది. మీరు వెళ్లి వారిన అడ్డుకోని కింద పడేయండి అని తెలంగాణ సైన్యాన్ని తెలుగు రాజు ఆజ్ఞాపించాడు. సైన్యాధ్యక్షుడు చెప్పినట్టుగానే వారి సైన్యం తమ తమ బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చింది. తెర ముందు మాత్రమే చూసిన వారికి అయ్యో పాపం నిన్న మొన్నటి వరకు అన్నాదమ్ముల్లా భుజం భుజం కలిపి నడిచిన ఈ సోదరులు కత్తులు దూసుకుంటున్నారు ఎంతటి దౌర్భాగ్యస్థితి అని బాధతో కన్నీళ్లు వస్తాయి. షూటింగ్ ముగిశాక ముచ్చటించుకునే వీరిని చూస్తే మళ్లీ కన్నీళ్లు వస్తాయి నవ్వును ఆపుకోలేక.


***
సాలార్‌జంగ్ మ్యూజియంలో ఒకే బొమ్మను ఒకవైపు నుంచి చూస్తే యోధునిగా మరోవైపు నుంచి చూస్తే మహిళగా కనిపిస్తుంది. ఒక ప్రతిమ రెండు రూపాల్లో కనిపించడం వింతే. యువనేత పార్టీ సైతం అంతే వారి పార్టీ పేరులోనే రెండు రూపాలు దాగున్నాయి. వై యస్ ఆర్ అంటే అందరికి తెలిసింది మాజీ ముఖ్యమంత్రి అని,  కాని వాళ్ళు మాత్రం యువత నవత అంటూ ఏదో చెబుతారు. పార్టీ పేరులోనే కాంగ్రెస్ పెట్టుకొని తమది  కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచే కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతం అన్నట్టుగా చెబుతారు . చనిపోయిన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. అలా అని పైకి ఆ మాట చెప్పరు. జైలో ఒకటిన్నర ఏళ్లు బయట రెండేళ్లు మూడున్నర ఏళ్లు అనుభవం మాత్రమే ఉండడం వల్ల థర్టీ ఇయర్ ఇండ్రస్ట్రీ నటునితో నటనలో పోటీ పడలేక ఎక్కువ రోజులు తన వల్ల డబుల్ యాక్షన్ సాధ్యం కాదని గ్రహించి ఏకపాత్రాభినయానికి సిద్ధమయ్యారు. 


దాంతో ఆయనకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. యుద్ధ ఫలితం ముందే తెలిసినా గాలిలో యుద్ధం చేయక తప్పదని ఒకే సైన్యం ఒకే సైన్యాధ్యక్షునిగా యుద్ధం చేసేస్తున్నాడు. దాంతో మిగిలిన వారి యుద్ధాల్లా వీరి యుద్ధంలో పెద్దగా ట్విస్ట్‌లు కనిపించడం లేదు.
***
 అంతకు కొద్ది  సేపటి క్రితమే సీమాంధ్ర తెలంగాణ తెలుగు ఎమ్మెల్యేలు దాదాపుగా బాహాబాహికి దిగారు. తప్పేవరిదో ఎవరు ముందు ఎవరిని తోశారో ప్రత్యక్ష సాక్షులు తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా సాక్షం చెప్పారు .  ఆ దృశ్యం అయిపోయిన కొద్ది సేపటికే రెండు ప్రాంతాల తెలుగు ఎమ్మెల్యేల చర్చ మాత్రం విన్నవారికి వీనుల విందు చేసింది.
‘‘లింగారెడ్డన్నా 50 ఏళ్లపాటు తెలంగాణ వాళ్లే ముఖ్యమంత్రులు అని ముందే తీర్మానం చేసి ఉంటే ఈ సమస్యనే వచ్చి ఉండేది కాదు. కోలా కృష్ణమోహన్, గాలి జనార్దన్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, వందల కోట్ల నుంచి వేల కోట్ల వరకు ఎన్ని కుంభకోణాల పేర్లు తీసుకున్నా, ఎందరి పేర్లు వినిపించినా అంతా మీ వాళ్లే. మేం సగర్వంగా చెప్పుకోవడానికి కనీసం వంద కోట్ల కుంభకోణం చేసిన వాడైనా మా తెలంగాణ వాడు ఒక్కడన్నా ఉన్నా డా? ఈ విషయంలో మేం తలెత్తుకుని తిరగలేక పోతున్నాం అని తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అంటే మా వాళ్లు మాంసం తిన్నామని మెడలో బొక్కలు వేసుకొని తిరిగే వాళ్లు అంటు లింగారెడ్డి బదులిచ్చాడు. ఇద్దరిది ఒకే పార్టీ ప్రాంతాలు వేరు.


***
‘‘సిఎం ఇప్పుడే చెప్పాడు విభజన సాధ్యం కాదని, ’’
‘‘తల క్రిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగదు’’ మరో గొంతు సమాధానం.
‘‘ సమైక్యాంధ్రకు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు’’ ఒక గొంతులోని ఆశావాదం.
‘‘విభజన తరువాత జగన్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను ఏకం చేయాలని ఉద్యమిస్తాడు.’’
ఔనా? ఒకరి ఆశ్చర్యం
‘‘ఆర్టికల్ 3తో రాష్ట్రాలను విభజించినప్పుడు కలపడం కూడా సాధ్యమే’’ ఒకరి ఆశ
‘‘ మెమో తెలంగాణా కోసం 60 ఏళ్ళు ఉద్యమించం కదా ..  విడిపోయాక , విడిపోయిన రెండు రాష్ట్రాలను కలపాలని  మీరు 60ఏళ్లు ఉద్యమించండి’’మరొకరి అసహనం.
స్ర్తిపాత్ర లేని నాటకంగా ప్రదర్శించడాన్ని మేం ఒప్పుకోం అని ఒక మహిళా ఎమ్మెల్సీ మరణించినట్టు నటిస్తే, తోటి ఎమ్మెల్సీ అప్పుడే పోయావా అక్కా అంటూ ఏడుస్తూ మండలీ  నాటకాలాడగలదని చూపించారు.
పార్లమెంటు ఆవరణలో మరో నటుడు వేసిన వేషం వేయకుండా గంటకో వేషం మారుస్తూ బుడుబుక్కల వేషం, నారదుని వేషంతో తన నటనా దాహాన్ని తీర్చుకుంటున్నాడు. సినిమాల్లో అవకాశాలు లేని హిరోయిన్ లు బుల్లి తెరను నమ్ముకున్నప్పుడు , అవకాశాలు లేని క్యారక్టర్ ఆర్టిస్ట్ కమ్ యంపి రాజకీయాల్లో వేషాలు వేస్తే తప్పేముంది ..  

2 కామెంట్‌లు:

  1. "వై యస్ ఆర్ అంటే అందరికి తెలిసింది మాజీ ముఖ్యమంత్రి అని" - YSR మాజీ ముఖ్యమంత్రి కాలేదు ఎప్పుడూ, దివంగత ముఖ్యమంత్రి అంటారు అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  2. చివరకు జర్నలిస్ట్స్ కూడా పాత్రలు మార్చినప్పుడు రాజకీయ నాయుకులు గురుంచి ఆలోచించడం అనవసరం అనుకుంటా!... అర్ధం అయింది అనుకుంటా ఎందుకు చెపుతున్ననో.....?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం