5, ఆగస్టు 2013, సోమవారం

తెలంగాణ , ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలే మేలు

తెలంగాణ ఏర్పాటుకు యుపిఏ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. సమైక్యాంధ్ర,తెలంగాణాల పేరు తో రాష్ట్రంలో ప్రజలు, పార్టీలు ఇంత కాలం రెండుగా చీలిపోయాయి. పోటాపోటీ ఉద్యమాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అని రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు కానున్నాయనే వాస్తవాన్ని గ్రహించాలి. రెండు రాష్ట్రాలు ఇక ఉద్యమాలతో కాదు అభివృద్ధిలో పోటీ పడాలి. పొరుగున ఉన్న తమిళనాడు తరహా రెండు ప్రాంతీల పార్టీల రాజకీయాలు మన రెండు రాష్ట్రాల్లో ప్రారంభం అయితే రెండు రాష్ట్రాలకు మేలు.

తెలుగుదేశం ఆవిర్భవించిన సమయంలో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి అందుకే ప్రాంతీయ పార్టీలు పుడుతున్నాయి అని ప్రాంతీయ పార్టీలను స్వాగతించిన వారు బలంగా చేసిన వాదన. తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలకు, మన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు చాలా తేడా ఉంది. రంగులు, ప్రచార తీరుతో సహా అచ్చంగా తమిళనాడు ప్రాంతీయ పార్టీని అనుకరించి టిడిపిని ఏర్పాటు చేసినా ఎందుకో గానీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలు గు భాషను నిలబెట్టే విషయంలో తమిళ పార్టీలను మన తెలుగు పార్టీలు ఏ మాత్రం అనుసరించలేకపోయాయి.

నిజంగా ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను ప్రాంతీయ పార్టీలు నెరవేర్చాలంటే తమిళనాడు తరహాలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు ఉండాలి తప్ప, మన రాష్ట్రంలో మాదిరిగా ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ మధ్య పోటీ అనేది ఉపయోగకరం కాదని తేలిపోయింది. టిడిపి ఆవిర్భావానికి ముందు, తరువాత కూడా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల గురించి బాగానే ప్రయత్నాలు జరిగాయి.

తెలుగు సంస్కృతి, భాష, తెలుగు వాడి ఆత్మగౌరం అంటూ, సామాజిక న్యాయం అంటూ ఎన్ని ముసుగులు వేసినా రాజకీయ పార్టీల అసలు లక్ష్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే. తెలుగు సంస్కృతి, తెలుగు వారి అత్మగౌరవం, తెలు గు భాష అంటూ టిడిపి ఆవిర్భావ సమయంలో ఎన్ని మాటలు చెప్పినా చివరకు టిడిపి సైతం అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించే ఒక పార్టీగానే మారింది తప్ప. తెలుగు కోసం ప్రత్యేకం అనే గుర్తింపు నిలుపుకోలేక పోయింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో తెలుగు అమలు ఎంత అద్భుతంగా ఉందో అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, తెలుగు భాష పేరు మీదనే ఏర్పడిన రాజకీయ పార్టీ ఒకటిన్నర దశాబ్దాల పాటు పాలించిన రాష్ట్రం అయినా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో తెలుగు అమలు సిగ్గుపడాల్సిన స్థాయిలో ఉంది. తెలుగు పేరుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ వచ్చీ రాగానే చేసిన పని తెలుగు భాష, సంస్కృతుల కోసం అంతో ఇంతో పని చేసే అకాడమీలను రద్దు చేశారు. ఆస్థాన కవిని ఇంటికి పంపించారు. సరే అప్పటి వరకు ఆయా స్థానాల్లో ఉన్నది కాంగ్రెస్ అభిమానులు అనే కోపం ఉంటే వారిని తప్పించి టిడిపి అభిమానులను నియమించినా బాగుండేది కానీ ఏకంగా వాటిని రద్దు చేసి తెలుగుదనం అనేది కనిపించకుండా చేశారు. తెలుగు మహిళా బహిర్భూమి వంటి తెలుగు పేర్లు తప్ప అధికార భాషగా తెలుగు అమలు కోసం పెద్దగా కృషి జరిగిందేమీ లేదు. ఆ తరువాత వచ్చిన తెలుగు పాలకుల తీరు సైతం అంతే.

తమిళనాడులో మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. తమిళ భాష, సంస్కృతుల విషయంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలు రెండింటి మధ్య పోటా పోటీ ఉంటుంది. తమిళనాడులో అయితే డిఎంకె, లేదంటే ఏఐఎడిఎంకెనే అధికారంలోకి వస్తుంది. జాతీయ పార్టీలు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానికి తోకల్లా ఉండాల్సిందే. బిజెపి, కాంగ్రెస్ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారితో జత కట్టడానికి ఈ రెండు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తమిళనాడుకు చెందిన రెండింటిలో ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమితో కలిసి పోతుంది. దీనివల్ల ఆ రాష్ట్రానికి కేంద్రం పెద్దపీట వేయక తప్పని పరిస్థితి. రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ మన నాయకులు తమిళనాడుతో పోలుస్తూ మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విమర్శిస్తుంటారు.
మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ సాగింది. జాతీ య పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అంతే. ఆ పార్టీ ఎంపిలు రాష్ట్రంలో ఎంత మంది ఉన్నా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేంత పరిస్థితి ఉండదు. ఒక వేళ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంటే, ప్రభుత్వంలో కూడా చేరరు కాబట్టి రాష్ట్రానికి మొండి చేయి తప్పదు. కేంద్రంలో అయితే కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి, లేదంటే బిజెపి నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ పార్టీలకు దూరంగా ఉండడం వల్ల రాష్ట్రం భారీగానే నష్టపోవలసి వచ్చింది.

 ఏ పార్టీతో జత కట్టాలి, ఏ పార్టీకి దూరంగా ఉండాలనేది ఆయా పార్టీలు లాభనష్టాల లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకుంటాయి అవి వాటి ఇష్టం కానీ..ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ మధ్య ఉండే పోటీ వల్ల రాష్ట్రం నష్టపోయింది. అలా కాకుండా రెండు ప్రాంతీయ పార్టీలు, లేదా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. తెలుగుదేశం అయినా ప్రజారాజ్యం అయినా సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా ఆ పార్టీలకు అధికారం కోరుకునే సామాజిక వర్గాల అండ తప్పని సరిగా ఉంటుంది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్‌ఆర్ ఇమేజ్ వెలిగిపోతున్న సమయంలో ఆవిర్భవించడం వల్ల ప్రజారాజ్యం నిలబడలేకపోయింది. దాంతో రెండు ప్రాంతీయ పార్టీల వ్యవస్థ ఏర్పాటు అవకాశం తప్పిపోయింది.

ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి పోయి నట్టే . తెలంగాణ ప్రాంతానిదో ప్రత్యేక రాజకీయం. సీమాంధ్రలో ఇంత కాలం  అయితే కాంగ్రెస్ లేదంటే టిడిపి అన్నట్టుగా పరిస్థితి ఉంటే, తెలంగాణలో మాత్రం అసెంబ్లీలో గుర్తింపు పొందిన పార్టీలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీల ప్రతినిధులు తెలంగాణ నుంచి గెలిచిన వారున్నారు. టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్, ఎంఐఎం, బిజెపి, లోక్‌సత్తా, సిపిఐ, సిపిఎం పార్టీల ప్రతినిధులు తెలంగాణ నుంచి గెలిచారు.
ఇప్పుడు తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రంగ ప్రవేశం చేసింది. తెలంగాణలో ఆ పార్టీ ఉనికిస్వల్పమే . కేంద్రం తెలంగాణా ఏర్పాటు పై నిర్ణయం తీసుకోగానే  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యం యల్ ఏ లు  రాజీనామా చేయడం తో తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకు పోయింది.అయితే సీమాంధ్రలో బలంగా ఉంది. ఒకవేళ తెలంగాణ ఏర్పడి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీనే, ఇప్పుడున్న నాయకులే  తిరిగి అధికారంలోకి వస్తే రాజకీయ ముఖ చిత్రంలో తక్షణం  పెద్దగా మార్పు కనిపించక పోవచ్చు. క్రమంగా మార్పు అనివార్యం . 

స్వాతంత్య్ర పోరాట కాలంలో ఈ దేశానికి స్వాతంత్య్రం అవసరం లేదు, బ్రిటీష్ వారే పాలించాలని వాదించిన కొన్ని సామాజిక వర్గాలు,  జమిందార్లు స్వాతంత్య్రం రాగానే ఖద్దరు ధరించి అధికారం చేపట్టారు. ఇది ఎక్కడైనా తప్పని అనివార్యమైన పరిణామం. ఇప్పుడు తెలంగాణ వస్తే ఇదే దోరణి తెలంగాణలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. వీళ్లు కొత్తగా ఖద్దరు ధరించాల్సిన అవసరం కూడా లేదు. ఖద్దరులోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ మంత్రులు కొందరు ముఖ్యమంత్రికి అండగా నిలిచారు. ఓవైపు యువకుల ఆత్మహత్యలు జరుగుతుంటే మరోవైపు తమ నియోజక వర్గాల నుంచి జనాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వెళ్లిన  తెలంగాణ మంత్రులు ఉన్నారు. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేయగానే హైదరాబాద్‌లో సభను నిర్వహించి బోనాలు ఎత్తుకుని హడావుడి చేసిన మంత్రులే ఆ తరువాత తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రికి సన్నిహితం అయ్యారు. చివరకు తాజాగా కోర్ కమిటీ సమావేశం తరువాత ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ ఆవశ్యకతపై గట్టిగా వాదించగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం అంత కన్నా గట్టిగా వాదించారు. కోర్‌కమిటీ తరువాత సీమాంధ్ర మంత్రులు ముఖ్యమంత్రిని కలిస్తే, తెలంగాణ మంత్రులు కొందరు దామోదర్‌ను, కొందరు కిరణ్ కుమార్‌రెడ్డిని కలిశారు. ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి పదవికి జరిగే పోటీలో ముందు వరుసలో ఉంటారని భావిస్తున్న మంత్రి మొదటి నుంచి తెలంగాణ వాదానికి దూరంగా, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటున్నారు. తెలంగాణ ప్రకటన రాగానే ఇప్పుడు మళ్ళి వారి హడావుడే కనిపిస్తోంది . అదే జరిగితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో పెద్దగా మార్పు ఉండదు.

తెలంగాణ అంశంలో కెసిఆర్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా, టిఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా అభివృద్ధి చేయడంలో ఆశించిన స్థాయిలో జరగలేదు . కొన్ని లక్షల మందికి చెందిన రాజకీయ పార్టీ భవిష్యత్తుపై ఆయన అలవోకగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిపేస్తాను అని ఒకసారి, కలిపేది లేదని ఒకసారి మాట్లాడుతున్నారు. 
 ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం అవసరమని కెసిఆర్ తెలంగాణ ప్రజలను ఒప్పించ గలిగారో దాని కోసం కృషి చేయడమే అసలైన సవాల్. దాని కోసం టిఆర్‌ఎస్ తెలంగాణలో బలమైన రాజకీయ పక్షంగా నిలవాలి.
తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ రెండేసి బలమైన ప్రాంతీయ పార్టీలు ఉంటే తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకోవడానికి రెండు రాష్ట్రాలు, రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. తమిళనాడులో తమిళ సంస్కృతి, భాషకు దక్కే గౌరవం, అభివృద్ధి విషయంలో ఆ రాష్ట్రానికి లభించే ప్రాధాన్యత కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు దక్కే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు: