28, ఆగస్టు 2013, బుధవారం

సమన్యాయం!

నాయకులంటే వేలిముద్ర గాళ్లు అని తేలిగ్గా చూస్తారు కానీ భాషామాతల్లికి వారు చేసిన సేవ సామాన్యమైనదేమీ కాదు. కళామతల్లికి హీరోలు చేసే సేవకు ప్రచారం లభించినట్టుగా భాషామతల్లికి నాయకులు చేసే సేవ గుర్తింపునకు నోచుకోలేదు. నాయకులు ఎనె్నన్నో కొత్త పదాలు కనిపెట్టి భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అంతరించి పోతున్న పదాల గురించి ఆందోళన చెందుతున్నారు కానీ నాయకులు కొత్తగా కనిపెట్టిన పదాలను చూసి సంబరపడడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎంత గొప్ప పదం! మనిషి మెదడు కన్నా కంప్యూటర్ గొప్పదే కావచ్చు కానీ ఆ కంప్యూటర్ కూడా ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తేనే పని చేస్తుంది. మరి చట్టం తన పని తాను ఎలా చేసుకుపోతుందో? అంతుచిక్కని వ్యవహారమే. చట్టవ్యతిరేక పనులకు పాల్పడే సందర్భంలోనే చట్టం గురించి ఈ మాట ఎక్కువగా మాట్లాడతారు. బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు ఈ పదాన్ని జాతికి అంకితం చేశారు. దేశానికి స్వాతం త్య్రం తెచ్చిన వారికి స్వాతంత్య్రం పెద్దగా ఉపయోగపడనట్టుగానే ఈ పదాన్ని సృష్టించిన పివికి పెద్దగా ఉపయోగపడలేదు. కానీ రాజకీయ దొంగలందరికీ ఇది బుల్లెట్ ఫ్రూప్ అంత భద్రత కల్పిస్తోంది. ప్రధానమంత్రిగా ఉండి చివరకు తన కేసులను వాదించిన న్యాయవాదులకు ఫీజులు చెల్లించేందుకు సొంత ఇంటిని అమ్మకానికి పెట్టాడంటే పివికి ఈ పదం ఏ మాత్రం ఉపయోగపడలేదని అర్ధం అవుతూనే ఉంది.

 మాటలను అమ్ముకునే రాజకీయాల్లో మౌనం ఎంత శక్తి వంతమైన భాషో ఆయన నిరూపించారు. వీటి తరువాత అత్యంత శక్తివంతమైన పదం నో కామెంట్ దీన్ని కూడా రాజకీయ నాయకులే భాషామతల్లికి అంకితం చేశారు. నో కామెంట్ ఆవిష్కర్త ఎవరో కానీ దీన్ని పలకని నేరస్తుడు, రాజకీయ నాయకుడు ఉండడు.


ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఏటేటా కొత్త కొత్త పదాలను చేరుస్తుంటారు. అలానే మన నాయకులు కనిపెట్టిన పదాలతో కొత్త నిఘంటువు రూపొందించే పనికి ఎవరైనా పూనుకుంటే బాగుండేది. మహాభారతంలో స్ర్తి పాత్రలు, రామాయణంలో పురుష పాత్రలు అంటూ ఎవేవో వాటిపై పిహెచ్‌డిలు చేసేవాళ్లు ఒకసారి మన నేతలు కనిపెట్టిన పదాలు అనే అంశంపై పరిశోధన చేస్తే భాషామ తల్లికి తెలుగు నాయకులు చేసిన కృషి ప్రపంచానికి తెలిసొస్తుంది. చెన్నారెడ్డి కాలంలో కోటి అనేది చాలా పాపులర్ వర్డ్. ఇప్పుడు కోటి కాస్తా లక్ష కోట్లకు చేరుకుంది. అంజయ్య కాలంలో పాపం ఆరణాలే పాపులర్. కోట్లకు పడగలెత్తినా నిర్మోహమాటంగా నీతులు చెప్పగలుతున్న నేటి నాయకులను చూసిన వారికి ఆరణాల కూలీ అంటే పిచ్చోడేమో అనిపిస్తుంది.


ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత పాపులర్ పదం సమ న్యాయం. సమ న్యాయం అంటే ఏమిటో? దాన్ని తెరపైకి తీసుకు వచ్చిన వారు కూడా చెప్పడం లేదు. భాషా శాస్తవ్రేత్తలు నానా కష్టాలు పడి మొత్తం 51 న్యాయాలను గుర్తించారు. ఆ 51 జాబితాలో లేనిదే ఈ 52వ న్యాయం. దీన్ని మన నాయకులు కనిపెట్టారు. దీని పేరు ‘‘సమ న్యాయం.’’ తెనాలి రామలింగడు తిలకాష్ట మహిష బంధనం అంటే ఎవరికీ అర్ధం కాలేదు. తీరా పలుపుతాడును చూశాక ఇదా?అనుకున్నారు. అలానే ఈ సమ న్యాయం ఏమిటిరా? బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. అల్లుడికి బయ్యారం గనులు, కొడుక్కు బ్రాహ్మణీ స్టీల్ ఇదే కదా సమ న్యాయం అనేది కొందరి  అనుమానం .
 తారక రాముడి  అధికారం  వచ్చినట్టుగా ... అదే సంప్రదాయం ప్రకారం అల్లుడిగా వారసత్వం తన కొడుక్కు దక్కాలనేది హరికృష్ణ వాదన. అల్లుడు గారేమో తన కొడుకునే వారసునిగా తయారు చేస్తున్నాడు .. దాంతో కోపం వచ్చిన హరికృష్ణ చైతన్య రథం ఎక్కుతున్నారు . రాజ్యం ఎలాగు రెండు ముక్కలు అవుతుంది కాబట్టి అర్థ రాజ్యం తన కొడుక్కు , మిగిలిన అర్థ రాజ్యం అల్లుడికి ఇచ్చి సమన్యాయం పాటించ వచ్చు అనేది మధ్య వర్తుల సలహా . అప్పడు ఇటు లోకేషుడు , అటు తారకుడు ప్రజలకు సేవ చేసుకొని  సమన్యాయం తో తరిస్తారు.. గిట్టని వారేమో తాత  గారిలా 60 ఏళ్ళ వయసులో సినిమా జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం రావచ్చు కదా అప్పుడే తొందరేమిటి అంటున్నారు . రాజ్యం తో బాటే రాజకీయ జీవితం ముగిసిపోతుందని కొందరి బాధ   


తనకు పోటీగా ఉన్న భక్తుడు ఏం కోరుకుంటే నాకు రెట్టింపు ఇవ్వండి అన్నాడట వెనకటికో భక్తుడు. ఓహో అలానా! అయితే నాకు ఒక కన్నుపోయేట్టుగా వరం ఇవ్వు స్వామి అని రెండో భక్తుడు వేడుకుంటే వీడికి ఒక కన్ను పోటీ దారునికి రెండు కళ్ళూ పోయాయి. అసలు మాకు దక్కని హైదరాబాద్ వాళ్లకీ దక్కొద్దు మీరు తీసుకెళ్లండి అని కేంద్రాన్ని కోరడం సమ న్యాయం అందామా? అంటే ఇది సమ అన్యాయం అవుతుంది కానీ సమ న్యాయం ఎలా అవుతుందని సందేహం. తెలంగాణకు అన్యా యం జరిగింది కాబట్టి మేం విడిగా ఉంటామని వాళ్ళు డిమాండ్ చేస్తే మీ డిమాండ్‌కు మా మద్దతు అని మహానేత మరణించిన ఇడుపుల పాయలో మాట తప్పని వంశానికి చెందిన వంశోద్ధారకుడు బహిరంగ ప్రకటన చేశారు. తీరా సమయం వచ్చే సరికి అమ్మగారు సమ న్యాయం చేయండి లేదంటే సమైక్యంగా ఉంచండి అంటున్నారు. సమైక్యంగా ఉంచితే అది సమన్యాయం ఎలా అవుతుంది ఒక ప్రాంతానికి అన్యాయం చేసినట్టే అవుతుంది కదా? అప్పుడు వారికి ఎలా సమ్మతం అవుతుందో? సమ న్యాయం అంటే ఏమిటో వాళ్లు చెప్పక పోవడం వల్ల ఎవరికి వారు నిఘంటువుల వేటలో పడిపోయారు. దీన్ని అర్జంట్‌గా 52వ న్యాయంగా చేర్చాలి తప్పదు. ఆకాశంలో చంద్రుడు మనం ఎటు పోతే అటు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. రెండు కొమ్మల మధ్య కదలని చంద్రుడిని చూపించి చంద్రుడు కదలడు అని చెబుతారు. ఆజ్ఞానులు నిజాన్ని గ్రహించలేనప్పుడు విజ్ఞులు ఇలా అర్ధం చేసి చెప్పడాన్ని ‘శాఖా చంద్ర న్యాయం’ అన్నారు.


ముసలి నీటిలో ఎంతో బలంగా ఉంటుంది. స్థాన బలిమి తప్ప తన బలం కాద ని చెప్పడానికి ‘శ్వాన మకర న్యాయం’ అన్నారు. గుడ్డివాళ్లు ఏనుగును వర్ణించడాన్ని ‘ఆంధగజన్యాయ’మన్నారు.‘కాకతాళీయ న్యాయం’, ‘అజాగళస్తన న్యాయం’, ‘గోము ఖ వ్యాఘ్ర న్యాయం’ వంటి న్యాయాలను గుర్తించిన మ న పెద్దలు సమ న్యాయాన్ని మాత్రం ఊహించలేక పోయారు. ఇలాంటి కొత్త కొత్త పదాలను సృష్టించిన నాయకుల సేవలను గుర్తుంచుకోవడం మన ధర్మం.
ఇప్పుడు సమైక్య రాజ్యం లో రెండు సామజిక వర్గాల మధ్యనే అధికార మార్పిడి జరుడుతోంది. రాజ్యం రెండు ముక్కలయితే .. తక్షణం కాక పోయినా ఆ తరువాతైనా  ఈ రెండు సామజిక వర్గాలకు సమ న్యాయం దక్కుతుందని అంటున్నారు .. ఎలా అంటే రెండు సామజిక వర్గాలకు అధికారం దూరం అయ్యే అవకాశాలు సుదూరంగా కనిపిస్తున్నాయి .. 

2 కామెంట్‌లు:

  1. బావుంది. నేను కూడా ఈ సమన్యాయ ఏంటి అని ఒకటే చించుకుంటున్నాను.
    మీరు చక్కగా అర్థం చెప్పారు. నాకు బాధ తప్పింది.

    రిప్లయితొలగించండి
  2. ఆ రోజుకోసం ఎదురు చూద్దాం

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం