12, జూన్ 2013, బుధవారం

గూఢచారి నంబర్ వన్

‘‘చూడు పారూ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్నదానికీ ఎప్పుడో ఒకప్పుడు ది ఎండ్ పడుతుంది. మనం చదువుకునేప్పుడు గర్జించు రష్యా గాండ్రించు రష్యా అని పాడుకునే వాళ్లం రష్యా ముక్కలవుతుందని అనుకున్నామా? ప్రపంచమంతా సోవియట్ రష్యాలా ఎర్రబారుతుందని మనం అనుకుంటే చివరకు ప్రపంచంలానే రష్యా మారిపోయింది. మార్పును జీర్ణం చేసుకోవాలి’’ అంటూ ముకుంద్ చెప్పుకుపోతూనే ఉన్నా డు. పారు ముఖంలో ఎలాంటి మార్పు లేదు.


2020 వరకు తానే అధికారంలో ఉంటానన్న నేత 2004లోనే అధికారం వదులుకుని 2014కు మనసు రాయి చేసుకుని కొడుకు కోసం త్యాగం చేయడం లేదా? విశాల రాష్ట్రాన్ని పాలించాలనుకున్న యువనేత జైలు పాలనకు తలొగ్గడం లేదా? నాయకులే మార్పును అర్ధం చేసుకున్నప్పుడు మనమెంత?


ఋతురాగాలు సీరియల్ ముగుస్తుందని నువ్వు, నేనే కాదు, ఆ సీరియల్ తీస్తున్న వారూ అనుకోలేదు. కానీ విధి బలీయమైనది మనుషులు ఊహించనివి చేయడమే ఆ దేవుడు ఆడే నాటకం. మనం ఊహించినట్టే జరిగితే ఇక ఆ దేవుణ్ణి మనం గుర్తు చేసుకోం కదా?.’’ అంటూ అనునయించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.  అప్పటికీ ఆమెలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

 ‘‘మన ప్రేమ చిగురించిన కొత్తలో ప్రారంభమైన ఋతురాగాలు, మన పిల్లలు ఉద్యోగంలో చేరుతున్న కాలంలో ముగిసింది. మరో సీరియల్ తీస్తానని మంజులా నాయుడు చెప్పారు కదా? కొద్ది రోజులు ఓపిక పట్టాలి తప్పదు’’ అని ముకుంద్ చెబుతుంటే, ఒక్కసారి ఆమె కోపంగా ముఖం ఇటు తిప్పి మీరేం మాట్లాడుతున్నారు అని అడిగింది. ఏదో దిగులుగా ఉన్నావని మాట్లాడాను కానీ నీ ముందు నేనెందుకు మాట్లాడతాను పారూ అని సంజాయిషీ ఇచ్చాడు. ముకుంద్.


‘‘ నా జీవితంలో ఇంత అవమాన పడాల్సి వస్తుందని అనుకోలేదు. ఈ రోజు నాకు తలతీసేసినట్టు అయింది. మన కాలనీ పంకజం కొడుకు ఎవరో అమ్మాయితో పారిపోయాడట’’! అని పారు చెప్పగానే పాపం సుబ్బారావు కొడుకు ప్రేమించిన అమ్మాయితో పారిపోయాడా! ఆ సుబ్బారావు వాడి కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తనను వృద్ధాప్యంలో కొడకు ఆదుకుంటాడని ఎన్ని కలలు కన్నాడు. చివరకు వాడేమో తండ్రిని అప్పుల్లో పడేసి ప్రేయసితో ఉడాయించాడా? ఈ వయసులో ఆ కష్టం తట్టుకోవడం ఇబ్బందే, వాళ్లకొచ్చిన సమస్యకు నువ్వింతగా బాధపడుతున్నావంటే కనిపించవు కానీ నీ మనసు వెన్న పారూ వెన్న అని ముకుంద్ తన్మయంగా చెప్పాడు. ‘‘వెన్న కాదు డాల్డా కాదు. నేను బాధపడేది అందుకు కాదు.


ఈ విషయం నీకు తెలుసా అని పక్కింటి లక్ష్మి అడిగే సరికి తల కొట్టేసినట్టు అయింది. ఒకే కాలనీలో పక్క పక్కన ఉంటాం సుబ్బారావు, పంకజంల కొడుకు లేచి పోవడం గురించి లక్ష్మి చెప్పేంత వరకు నాకు తెలియలేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా? నాకీ విషయం తెలియదు, లక్ష్మికి తెలుసు అంటే నా కన్నా లక్ష్మి పవర్ పుల్ కదా? అదీ నా బాధ.
ఇలాంటి సమాచారం కోసమే కదా! పంకజాక్షికి రెట్టింపు డబ్బు ఇస్తున్నాం. అందుకే ఈ రోజు నుంచి పంకజాక్షిని పనిలో నుంచి తీసేస్తున్నట్టు చెప్పాను ’’ అని పారు చెబుతుండగానే పంకజాక్షి ఇంట్లోకి వచ్చింది. మీరైనా చెప్పండి బాబు గారు నేను చేసింది చిన్న తప్పు కాదు నాకు తెలుసు. మొన్న మా ఆయన సినిమాకు వెళదాం అంటే అమ్మగారు ఆఫీసు నుంచి రాకముందే హడావుడిగా వెళ్లిపోయాను, నినే్నమో జ్వరంతో రాలేదు. నాకు చెప్పకుండా ఇంత ముఖ్యమైన సమాచారం పక్కింటావిడకు చెబుతావా? అని అమ్మగారికి కోపం రావడం ధర్మమే కానీ మళ్లెప్పుడూ ఇలా జరగదని పార్లమెంటు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను బాబూ అంటూ పంకజాక్షి టీవిలో వార్తలు చూస్తూ ఆవేదనగా చెప్పింది.


‘‘ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు పార్లమెంటును ఎందుకు బలి చేస్తావు. పార్లమెంటు మీద వద్దు కానీ మరోసారి అలా చేయనంటుంది క్షమించి వదిలేయ్ పారూ ’’అని నచ్చజెప్పాడు. కాలనీలోని విలువైన సమాచారం కోసం పనిమనిషి పై ఆధారపడ్డ నీ తెలివి అద్భుతం పారూ అని ముకుంద్ మెచ్చుకున్నాడు. పూర్వం రాజు లు దేశం నిండా గూఢచారులను నింపేవారు. సైన్యం తక్కువుంటే మిత్ర దేశం నుంచి తెచ్చుకోవచ్చు కానీ గూఢచారులు తక్కువుంటే సింహాసనం కిందకు నీళ్లు వచ్చినా తెలియదని భయపడేవారు. రాజులు పోయి ప్రజాస్వామ్యం వచ్చాక డ్రైవర్లను, పని వాళ్లను కూడా గూఢచారులుగా ఉపయోగించుకోవడం అలవాటైంది. 

పూర్వం రాజుల కైనా ప్రజాస్వామ్యంలో ప్రభువులకైనా కామన్ గూఢచారి క్షౌరం చేసే వ్యక్తే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల తన వ్యక్తిగత క్షురకునితో కనీసం అరగంట సేపు మాట్లాడేవారట!పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునే వారట! టీవి చర్చల్లో కొట్టుకున్నట్టుగా కాకుండా బార్బర్ షాపుకొచ్చిన వాళ్లు దేశ రాజకీయాలు, ఎవరు ఎంత సంపాదించారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు చక్కగా చర్చించుకుంటారు. అందుకే ఎన్టీఆర్ క్షురకునితో మాట్లాడేవారట. ఇందిరాగాంధీకి ఎమర్జన్సీ సమయంలో అందరు మాట్లాడుకునే సమాచారం ఇచ్చిన డ్రైవర్ ఆ తరువాత కేంద్ర మంత్రి అయ్యారు.’’ అని ముకుంద్ తనకు తెలిసిన విషయం చెప్పాడు.


‘‘ఆ క్షురకున్ని, డ్రైవర్‌ను ఎవరైనా మేనేజ్ చేశారనుకోండి, సింహాసనం కదిలేంత వరకు నాయకుడ్ని భ్రమల్లో ఉంచవచ్చు కదా? ’’ అని పారూ ఆడిగింది. అందుకేనేమో కొందరు నేతలు తమ నీడను కూడా తాము నమ్మరు .. నీకే ఇంత నెట్‌వర్క్ ఉంటే నేతలకెంత ఉండాలని అనుకున్నాడు ముకుంద్
ముక్తాయింపు: ఎదుటి వాడి  సమాచారాన్ని సేకరించడం లో  అందరూ మొనగాళ్లే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం