15, మే 2013, బుధవారం

సీతారాముల ఓట్ల రామాయణం

‘‘ఏంటీ ? అంత దీక్షగా రాసుకుంటున్నావు’’
‘‘రామాయణం రాస్తున్నాను’’
‘‘మార్కెట్‌కెళ్లి వంద రూపాయలు పెడితే దొరుకుతుంది కదా? రాయడం ఎందుకు?’’
‘‘ఇది పాత జోకే. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తున్నాను అంటే శ్రీశ్రీ అన్న మాట ఇది.
కొత్త మాట ఏదైనా చెప్పు.’’


‘‘రాజకీయాలు మాట్లాడే నువ్వు ఎన్నికల ఏడాదిలో రామాయణ కథ రాసుకోవడం ఏమిటి?సరే ఏం రాశావో చూద్దాం. ఇలా ఇవ్వు..’’


‘‘ ఇంకా ముగించలేదు’’


‘‘నీ పిచ్చికాక పోతే రాజకీయ కథలకు ముగింపు ఉంటుందా? రాజకీయం అనేది అంతులేని కథ.’’


***
పర్ణశాలలో సీత వంటిరిగా కూర్చుంది. లక్ష్మణుడు గీసిన గీతలను తదేకంగా చూస్తోంది. ఇంతలో రావణడు వచ్చాడు. మారు వేషంతో కాదు అసలు వేషంతో. మాతా నేను మారాను. పూర్తిగా మారాను అంటూ రావణుడు అసలు వేషంతో సౌమ్యంగా సీతను పలకరించాడు. తల్లీ మారిన నన్ను పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. గీత లోపలే ఉండి మాట్లాడు తల్లీ. ఇది త్రేతాయుగం కాదు. కలి యుగం జాగ్రత్తగా ఉండాలి తల్లి. అప్పుడంటే ఒకడే రావణుడు. ఇప్పుడు అడుగడుగునా రాక్షసులను మించిన మనుషులు’’ అంటూ రావణుడు జాగ్రత్తలు చెప్పుకుపోతున్నాడు.


ఇంతలో బంగారు లేడి అటు నుంచి పరుగులు తీస్తూ కనిపించింది. సీత హాయిగా నవ్వుకుని నాథా ఆ బంగారు లేడి నాకు కావాలి అంది. ఆ మాట వినగానే లేడి పరుగులు ఆపి తానే సీత వద్దకు వచ్చి సీతమ్మ తల్లీ ఈ రోజుల్లో బంగారం ధర కాస్త తగ్గిందని బంగారు లేడి కూడా ఉంటుందనుకుంటే ఎలా గమ్మా! బంగారు లేడి అంతా మోసం. అలాంటిది ఉండదు. అంటూ కలికాలంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో బంగారులేడి చెప్పసాగింది. ఇంతలో ఇద్దరు ముగ్గురు మనుషులు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు నాయకులు అనే జాతికి చెందిన వాళ్ళు . రాక్షసులు ఒక సారి ఒకరిని మాత్రమె స్వాహా చేస్తారు కానీ వీరిలో కొందరు ఒక సరి కోట్ల మందిని స్వాహా చేయగల శక్తి వంతులు .  వాళ్లను చూడగానే రావణుడు, మయాలేడి రూపంలో ఉన్న మారీచుకుడు, తదితర రాక్షసులంతా వణికిపోయారు. 

‘‘మీరేం బయపడవద్దు బంగారు తల్లి మా ప్రభుత్వం నిర్భయ చట్టం తెచ్చింది. నిర్భయంగా ఉండండి ’’అని కొందరు మనుషులు చెప్పారు.
నేను రామ బాణాన్ని అంటూ ఒకావిడ, నేను మారిన మనిషిని అంటూ ఇంకొకాయన. ఎవరినీ నమ్మవద్దు అందరూ దుర్మార్గులే మమ్ములనే నమ్మాలి అంటూ కొందరు ... మా కోసం కాదు మీ కోసం వచ్చాము , మిమ్ము;లను చైతన్య పరచడానికి వచ్చాం అని అంతా  కోరస్ గా పలికారు .  


సీతకు కోపం వచ్చింది. రామాయణాన్ని ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మారిస్తే సహించేది లేదు. వెళ్లండి అంటూ గద్దించింది.
దాంతో మనుషులంతా వెళ్లిపోయారు.


మనుషులుగా వెళితే సీత నమ్మేట్టుగా లేదు. దగ్గరకు రానిచ్చేట్టుగా లేదు .  మనం రాక్షస రూపం దాల్చాల్సిందే అని మనుషులు తమలో తామే మాట్లాడుకున్నారు. మనకు ఎవరి మీద నమ్మకం లేదు. మన మీద ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి మనమందరం రావణాసురుడు, మాయ లేడిగా వేషం మార్చుకుని సీతను అపహరించడానికి వెళదాం. సీత ఎవరిని నమ్మితే వారిదే విజయం అనుకున్నారు.

 త్రేతాయుగంలో రావణుడు మారువేషంతో సీతను అపహరించడానకి వెళితే ఇప్పుడు కాళీ యుగం లో  నాయకులైన మనుషులు రావణుడు, మాయాలేడి రూపంలో సీతను నమ్మించడానికి వెళ్లారు.


మాయాలేడి కనిపించగానే దాన్ని పట్టి తీసుకు రమ్మని సీత రాముడ్ని పంపింది. రాముడి ఆర్తనాదం విని లక్ష్మణుడు అటు వెళ్లాడు. అది చూసి రావణుడు పర్ణశాలకు వచ్చాడు. రావణుడి వేషంలో ఉన్న నాయకుల మాటలు నమ్మి చూసి సీత ఓటు కోసం గీతదాటి బయటకు వస్తోంది.
***
కథ అక్కడి వరకే ఉంది. ముగింపు లేదు. ఇంతకూ ఇందులో ఓటు కోసం రావణుడిగా వేషం మారి వెళ్లింది ఎవరు? సీతారాములు నమ్మింది ఎవరిని? మారిన మనిషి బాబా, జైలు పక్షి జగనా? కొత్తగా నీతిమతం పుచ్చుకున్న కిరణా? ’’
‘‘ఆపు నీ ప్రశ్నలు .. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు . ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానం . రావణుడి లక్షణం లేని నాయకుడు ఎవరో ఒక్కరి పేరు చెప్పు చూద్దాం... నాయకుడు, రావణుడు, రాక్షసుడు అనేవి లక్షణాలు   అది మనిషి పేరు కాదు’’

‘‘అయినా సీతారాములు మరీ అంత అమాయకులా? బంగారు లేడి ఉంటుందని నమ్మడానికి, మారువేషంలో వచ్చిన రావణుడిని గుర్తుపట్టక పోవడానికి. సరే త్రేతాయుగం నాటి సీతారాములు అలా నమ్మారనుకుంటే అది కాల మహిమా అలానే ఉంటుందని అనుకుందాం. ఇది కలియుగం సీతారాముల కథ అన్నావు. ఈ యుగంలో కూడా అంత అమాయకంగా ఎలా ఉంటారు? ఎందుకో నీ కథతో నేను ఏకీభవించడం లేదు ’’


‘నా కథ నా ఇష్టం. ఏకీభవించడం ఏకీభవించక పోవడం నీ ఇష్టం. అప్పుడైనా ఇప్పుడైనా సీతారాములు అమాయకులని ఎవరన్నారు?
బంగారు లేడి ఉండదని అయోధ్య రాముడికి తెలియదా ? బిక్షకుని వేషం లో వచ్చింది రావణుడని సీతా మాతకు తెలియదా ? రావణ సంహారం జరగాలంటే తప్పదని తెలిసే త్రేతా యుగం లో  సీతా  రాములు తెలియనట్టు ఉన్నారు . 

ఓటు ఎత్తుకెళ్లడానికి వచ్చిన నాయక మనుషుల గురించి కలియుగం లో  ఈ సీతారాములుకు తెలియక కాదు. షో నడవాలి అంటే ఎవరో ఒకరికి ఓటు వేయాలి. మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి అంటే ఒక్కడూ మిగలడు. రంగంలో ఎవరూ లేకపోతే ప్రజాస్వామ్య నాటకం నడవదు. ఇక్కడ పాత్రలకూ, పాత్ర దారులకు, ప్రేక్షకులకు అందరికీ అన్నీ తెలుసు. నాటకం నడవడానికే అందరూ ఏమీ తెలియనట్టు ఉంటారు అంతే’’


‘‘సరే ఇంతకూ సీతారాములు ఎవరిని నమ్మారు. వారి ఓటు ఎవరు అపహరించారు. ’’
‘‘ఇప్పుడే ఎలా చెబుతాను ఇంకా కథ ముగించలేదు కదా?
‘‘మరి ఎప్పుడు ముగిస్తావు’’


‘‘నాకిప్పుడు మూడ్ లేదు. 2014లో ముగిస్తాను. అప్పటి వరకు వేచి చూడు ’’ 

‘‘ఈ కథకు జనం తమ మనసులో ఎప్పుడో ముగింపు రాసుకున్నారు . రచయితగా అది నీకు తెలియదేమో .. అది ఒప్పుకోవడానికి నీకు మొహమాటం ఆడ్డు వస్తోంది  ’’ 

‘‘కావచ్చు ముగింపు ఎవరిష్టం వారిది ’’ 

2 కామెంట్‌లు:


  1. మొత్తం మీద మీరు 'రామాయణం తో పీడ కల ' కన్నట్టు న్నారు !!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారు రామాయణం చదివితే పీడా పోతుంది కానీ ... పీడకలలు రావండి ( సరదాగానే )

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం