5, డిసెంబర్ 2012, బుధవారం

యుగాంతం లో రాంగోపాల్ వర్మ సినిమా .. కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు .. చందన ,బొమ్మన డిస్కౌంట్ సేల్స్

డిసెంబర్ 22న యుగాంతమని ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. నానా గడ్డికరిచి కూడబెట్టిన డబ్బును వదిలివెళ్లాలంటే ఏ నాయకుడికైనా మనసెలా ఒప్పుతుంది? ఓటర్లందరినీ ఆలోచింప చేస్తున్న యుగాంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నాయకులు తంటాలు పడుతున్నారు. యుగాంతంపై హాట్ హాట్ సినిమాలు తీసేందుకు సినిమా వాళ్లు కెమెరాలతో సిద్ధమవుతున్నారు. చానల్స్ యుగాంతాన్ని తమ స్టూడియోకి రప్పించి చర్చ నిర్వహించడానికి తంటాలు పడుతున్నాయి.


***
యుగాంతంపై సినిమా తీయనున్నట్టు కిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ‘‘ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా సినిమా తీయవచ్చుననే కొత్త కానె్సప్ట్‌తో రవితేజతో దొంగల ముఠా సినిమా తీస్తే, ఒక్క పైసా రాలేదు. నా కానె్సప్ట్‌ను ప్రజలు సరిగా అర్ధం చేసుకోలేదు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా సినిమా అని నేను చెబితే ఆ సినిమా చూసేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దని ప్రేక్షకులు అనుకున్నారు. ఒక్కోసారి ప్రేక్షకులు మన ఆలోచనా స్థాయిలో ఆలోచించక పోవడం వల్ల ఇలానే జరుగుతుంది. ఆ ప్రయోగం తరువాత తెలుగులో మరో అద్భుత ప్రయోగంగా యుగాంతం సినిమా తీస్తాను. ఇందులో నటీనటులు ఎవరో నాకే తెలియదు. యుగాంతం జరుగుతుంటే అప్పుడే షూటింగ్ చేస్తాం. ప్రపంచంలో ఇదే తొలి లైవ్ షూటింగ్ సినిమా అవుతుంది.’’ అని రాంగోపాల్ వర్మ ప్రకటించారు.
***

తెలుగునేత పాదయాత్రలో ఆవేశంగా మాట్లాడుతున్నారు.‘‘ఒక్క వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫ్యాక్షనిజం రాష్ట్రానికి ప్రమాదం అని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. కొండలను,గుట్టలను కొల్లగొట్టారు. వారి పాపాల వల్లనే యుగాంతం జరగబోతుంది. యుగాంతానికి ముమ్మాటికీ జగనే కారణం. తండ్రిపై ఒత్తిడి తెచ్చి ఇలా చేశారు. తండ్రి కొడుకులు కలిసి దేవునితో చెలగాటం ఆడారు యుగాంతానికి కారణమవుతున్నారు. జగన్ కోసం వైఎస్‌ఆర్ రాష్ట్రాన్ని కొల్లగొడితే దేవుడికి ఆగ్రహం వచ్చి యుగాంతానికి సిద్ధమయ్యారు. 82లోనే యుగాంతం జరిగే ప్రమాదం ఏర్పడింది. కానీ అప్పుడు ఎన్టీఆర్, తరువాత నేను స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల యుగాంతం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఆగే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అసమర్ధుడు. ఢిల్లీ వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని గంట సేపు ఆపలేని వారు యుగాంతాన్ని ఆపగలరా? నేను కుర్చీలో కూర్చుంటేనే యుగాంతం నిలిచిపోతుంది.


అక్కడెవరో తమ్ముడు తెలంగాణ తెలంగాణ అని అరుస్తున్నాడు. చూడు తమ్ముడు నేను తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఒక్క ఓటరును కూడా నేను వ్యతిరేకించను అలాంటిది. నాలుగు కోట్ల ఓటర్లను ఎలా వ్యతిరేకిస్తానని అనుకున్నావ్ బ్రదర్. యుగాంతానికి కెసిఆర్ కూడా కారణమే’’ అని చెప్పుకుపోతుంటే. ఇంతలో ‘‘సార్ మీరు యుగాంతం అయిపోయేంత వరకు ఇలానే మాట్లాడేంత శక్తి మీకుందనే విషయం మాకు తెలుసు. మీరు ఉపన్యాసం ఆపితే యుగాంతాని కన్నా ముందే ఈ వార్తను ఆఫీసుకు పంపించుకుంటాం’’ అని కుర్ర విలేఖరి చీటిరాసి పంపడంతో బాబు ఉపన్యాసం ముగించారు.
***

విజయమ్మ ఒక చేతిలో బైబిల్, మరో చేతిలో మైకు పట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మీ కోసం మీ పిల్లల కోసం కాదు మా కోసం మా అబ్బాయి కోసం ఏడవండి. వైఎస్‌ఆర్ రెక్కల కష్టం మీద ఈ విశ్వం ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డి చేసిన పాపం ఏమిటి? యుగాంతం కాకుండా ప్రజలను కాపాడడమే ఆయన చేసిన పాపమా? కాంగ్రెస్, టిడిపి పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. ఈ ఘోరాన్ని చూడలేక దేవుడికి కోపం వచ్చి, యుగాంతానికి సిద్ధపడ్డాడు. యుగాంతాన్ని ఆపే శక్తి ఒక్క జగన్‌కే ఉంది. అందుకే కిరణ్ బాబులు భయపడి జగన్ బాబును జైలులో పెట్టారు. జగన్ బాబు జైలు గోడలు బద్ధలు కొట్టుకొని వస్తారు. యుగాంతాన్ని అడ్డుకుంటారు.
షర్మిల మైకు అందుకుని ‘‘యుగాంతాన్ని అడ్డుకోవడానికి నేను జగనన్న వదిలిన బాణాన్ని. నా మాట నమ్మండి జగనన్న బయటకు వస్తారు. యుగాంతం సంగతి తేలుస్తారు. అందుకే బెయిలు రాకుండా అధికారపక్షం, ప్రతిపక్షం కుమ్మక్కయ్యాయి.’’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.
***


‘‘నేను స్పష్టమైన తెలుగు మాట్లాడేంత వరకు యుగాంతం రాదు’’ అని అర్ధం అయి కాకుండా కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పిన మాటలతో హాలు చప్పట్లతో మారుమ్రోగింది. యుగాంతం భయంతో బిక్కుబిక్కుమంటున్న వారంతా హాయిగా ఊపిరి పీల్చుకుని చప్పట్లు కొట్టారు.‘‘మేడమ్ సోనియాగాంధీ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. నాకు తెలుగు నేర్పేందుకు ఢిల్లీ నుంచి హై కమాండ్ దూతను పంపిస్తానని, నేను తెలుగు నేర్చుకునేంత వరకు యుగాంతం కాదని మేడం స్వయంగా చెప్పారు’’ అని కిరణ్ ముగించారు. ఆ తరువాత మాట్లాడిన చిరంజీవి తాను రాజకీయాలను నేర్చుకుని, హిందీ మాట్లాడేంత వరకు యుగాంతం కాదని అన్నారు.
యుగాంతం తరువాత రిటైర్‌మెంట్ తీసుకుంటానని సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. ఈ ప్రకనటను స్వాగతించిన అక్కినేని నాగేశ్వరరావు తనదీ అదే నిర్ణయమని అన్నారు.
***

తెలుగు చానల్స్ అన్నీ యుగాంతం లైవ్ కవరేజ్ ముందస్తుగానే ప్రారంభించాయి. యుగాంతాన్ని తమ చానల్ చర్చలకు ఆహ్వానించామని ఓ టీవి ప్రకటించింది. యుగాంతాన్ని ముందుగా ప్రపంచానికి చూపేది కూడా తమ చానలే అని బోడుప్పల్ నుంచి టీవి ప్రతినిధి బోడిగుండయ్య లైవ్‌లో చెప్పారు.
యుగాంతం కోసం చందన బొమ్మన బ్రదర్స్ లో సరికొత్త డిజైన్స్ తో  90 % డిస్కౌంట్ సేల్స్  ప్రకటించారు 

5 కామెంట్‌లు:

  1. మీ కోసం మీ పిల్లల కోసం కాదు మా కోసం మా అబ్బాయి కోసం ఏడవండి.

    హ హ.. డయిలాగు అదిరిందండీ.. :-)

    రిప్లయితొలగించండి
  2. ‘‘నేను స్పష్టమైన తెలుగు మాట్లాడేంత వరకు యుగాంతం రాదు’’ :)

    యుగాంతాన్ని ముందుగా ప్రపంచానికి చూపేది కూడా తమ చానలే అని బోడుప్పల్ నుంచి టీవి ప్రతినిధి బోడిగుండయ్య లైవ్‌లో చెప్పారు. :)

    Very nice

    రిప్లయితొలగించండి
  3. బాగుందండీ....ఇన్ని లింకులు ఉంటే యుగాంతం ఎప్పటికీ రాదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం