28, నవంబర్ 2012, బుధవారం

అప్సరసలు - ఆమ్ ఆద్మీ - నేతలు


    ఢిల్లీలో చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకుల కన్నా వయసులో సగం ఉన్నా ఎత్తుగడల్లో రెట్టింపు తెలివి చూపిస్తున్నారు అరవింద్ కెజ్రీవాల్.
దేశంలో ఓట్ల పండగ పుట్టక ముందు నుంచి పుట్టిన పార్టీలు నుంచి వచ్చే ఎన్నికల కోసం పుట్టిన పార్టీల వరకు అందరి గుండె చప్పుడు సామాన్యుడే కదా!
వేశ్య విటుల కోసం పరితపించినట్టు, కల్లు కంపౌండ్ వాడు తాగుబోతుల కోసం , కాటికాపరి శవాల కోసం చూసినట్టు రాజకీయ పార్టీలు ఏవైనా తమ వినియోగదారుడైన సామాన్యుడి కోసం చూస్తుంటాయి. కస్టమర్ ఈజ్ గాడ్ అని చెప్పిన గాంధీజీ మాటను ఉత్తరాది వాళ్లు ఇప్పటికీ తమ షాపుల్లో రాసి పెడతారు. వినియోగదారుడే వ్యాపారికి దేవుడు కదా? రాజకీయ నాయకులు మహాత్మాగాంధీని మరిచిపోయారు కానీ వినియోగదారుడే దేవుడు అని ఆయన చెప్పిన మాట మరువలేదు. హిందీ ప్రాంతం వ్యాపారుల కోసం మహాత్మాగాంధీ ఇంగ్లిష్‌లో చెప్పిన ఈ మాటను ప్రజలే దేవుళ్లు అని తెలుగు నాయకులు తెలుగులోకి అనువాదం చేసుకున్నారు. రాజకీయం, వ్యాపారం ఒకటే కాబట్టి ఒకే నినాదాన్ని ఇద్దరూ నమ్ముకున్నారు. రాజకీయ వ్యాపారం నడిచేది సామాన్యుడితోనే అందుకే ప్రతి పార్టీ సామాన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతుంది. ఎన్నికల మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రచారం, నినాదాలు అన్నీ సామాన్యుడి చుట్టే తిరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చాక పని చేసేది అసామాన్యుల కోసమే అయినా చచ్చినట్టు సామాన్యుల చుట్టు తిరగాల్సిందే!
దేశం ఇంత అధ్వాన్నంగా ఉండడానికి ప్రజాస్వామ్యంలోనే లోపముందని మోకాలిని చేతితో నిమురుతూ చెప్పుకొచ్చాడో మేధావి. ఏమిటా లోపం అని అడిగితే, స్టాక్ మార్కెట్ గురించి తెలుసా? ఒక కంపెనీ షేర్లను వందగా విభజిస్తారు. నీ దగ్గర ఎంత డబ్బుంటే అన్ని వందల చొప్పున షేర్లు కొనవచ్చు. కంపెనీ మీటింగ్‌లో నీకు వంద షేర్లకో ఓటు ఉంటుంది. అంటే చిన్న మదుపరికి వద్ద వంద షేర్లు ఉంటే ఒక ఓటు లక్ష షేర్లు ఉన్న పెద్ద మదుపరికి వెయ్యి ఓట్లు ఉంటాయి. ఈ విధానం వల్లనే స్టాక్ మార్కెట్‌తో పాటు కంపెనీలు కళకళలాడుతున్నాయి. మరి ప్రజాస్వామ్యంలో నీ వద్ద ఉన్న డబ్బును ఏ మాత్రం గౌరవించకుండా తల ఒక్కంటికి ఒక్క ఓటు మాత్రమే ఇస్తున్నారు. దీని వల్లనే ప్రజాస్వామ్యం ఇలా ఆమ్ ఆద్మీని దేవుడిగా కొలవాల్సి వస్తోంది అని ఏడ్చాడు.
మళ్లీ మన కెజ్రీవాల్ వద్దకు వద్దాం.
సామాన్యులను స్వల్పకాలంలో మహా సంపన్నులుగా మార్చిన జగన్ అయినా, ప్రపంచానికి రాజకీయ పాఠాలు నేర్పించిన నేతగా అభిమానులు నిరాజనాలు పలికే బాబు అయినా చివరకు సామాన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నించాలి. వీరిని లక్ష్యంగా చేసుకుని రాజకీయం నడపాలి. అప్సరసలు అత్యంత సుందరంగా ఉండేవారట! ప్రబంధాల్లో వారి అందం గురించి చదివితనే మనసు ఎక్కడికో పోతుంది. ఇక వారిని నేరుగా చూస్తే... అంతటి అందగత్తెల ప్రధాన బాధ్యత ఏళ్ల తరబడి స్నాన పనాలు లేకుండా జెడలు కట్టిన తల వెంట్రులతో ముక్కు మూసుకొని తపస్సు చేసే మునులను రంజింప చేయాలి. పాపం నాయకులు కూడా ఇంతే ఎంత అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తేనేం చివరకు అప్సరసలు మునుల ముందు నృత్యం చేసినట్టు నాయకులు సామాన్యుల ముందు కళావిన్యాసాలు ప్రదర్శించాలి. కల్లు ముంత పట్టుకోవాలి, తాటి చెట్టేక్కాలి, టీ కొట్టులో టీ తయారు చేయాలి, చెప్పులు కుట్టాలి, పాలిష్ చేయాలి, గడ్డం గీయాలి. ముసలమ్మ కష్టాలు విని కన్నీరు కార్చాలి.జైలులో బంధించినా జనం కోసం తపించాలి ఎనె్నన్ని కళలు చూపాలి. ఇంత చేసినా ఫలితం ఉంటుందా? అంటే చెప్పలేం. ప్రవరాఖ్యుని లాంటి వాళ్లు అస్సలు చలించరు, వరూధిని లాంటి నేతలు ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడాలి. ఇన్ని కళలు ప్రదర్శించినా సామాన్యుడి మనసులో ఎవరున్నారో చివరి వరకు చెప్పడు. నా మనసులో ఉన్నది నీవే ప్రియా అని అందరికీ చెబుతున్నట్టు కనిపిస్తాడు కానీ మనసులోని మాట చివరి వరకు రహస్యంగా ఉంచుకుంటాడు.

 అల్లరి నరేష్ సినిమాలా మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే నమ్మకం కూడా లేకపోయినా ఖర్చు, హడావుడి మెగాస్టార్ సినిమా లెవల్‌లో చేయక తప్పదు. మళ్లీ మనం కేజ్రీవాల్‌ను పక్కన పెట్టేసి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈ నాయకుల కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివిన వాడు ఎందుకంటే... మగ జనాభాలో కనీసం సగం మంది మందుబాబులే ఉంటారు మినిమం గ్యారంటీ అని ఆ మధ్య ఒకరు మందు బాబుల పార్టీ పెట్టారు. అది ఎన్నికల్లో పని చేయలేదు. ఆడా మగా అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ ప్రేమించేస్తారు కదా? అని ఒకరు ప్రేమికుల పార్టీ పెట్టారు. జస్పాల్‌భట్టీ కొత్త కోణంలో ఆలోచించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కుంభకోణాల కోసమే కదా? అని ఏకంగా గోటాలా పార్టీ (కుంభకోణాల పార్టీ) పెట్టారు.ఎంత కష్ట పడ్డా సూట్ కేసుల కోసమే కదా అని నిర్మోహ మాటంగా సూట్కేస్ పార్టీ పెట్టారు. ఇవేవీ ఎన్నికల మార్కెట్‌లో నిలువలేకపోయాయి.

 అందరు నాయకులు సామాన్యుడి కోసం పరితపిస్తుంటే కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేసి ఆ సామాన్యుడి పేరుతోనే పార్టీ పెట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అని ప్రకటించే సరికి నేతలు లబోదిబో మన్నారు. ఇప్పుడు ఎవరు ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడినా అది కెజ్రీవాల్ పార్టీ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. కాంగ్రెస్‌కే హాత్ ఆమ్ ఆద్మీకే సాత్ అంటూ సోనియా హయాంలో పుట్టిన నినాదం కాంగ్రెస్‌కు బాగానే వర్కవుట్ అయింది. ఆమ్ ఆద్మీ నినాదాన్ని మా నుంచి వేరు చేయలేరు అంటూ కాంగ్రెస్ నేతలు వాపోయారు. కెజ్రీవాల్ ఆమ్ ఆద్మీనే తన పార్టీ పేరుగా పెట్టడంతో తొలి విజయం సాధించారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ తన పేరున్న పార్టీని ఆదరిస్తాడా? తనను దేవుడన్న పార్టీని గెలిపిస్తారా? తన నామ స్మరణతోనే కాలం గడిపే పార్టీలను ఆదరిస్తారా? చూడాలి.

2 కామెంట్‌లు:

  1. ఎప్పటి లాగా నే సెటైర్ పేలింది.

    మీ అభిమాని
    శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
  2. ఆమ్ ఆద్మీ పార్టీ, మరో లోక్ సత్తా అవుతుంది.

    అంత కంటే ఎక్కువ మన ఓటర్ల నుండి ఆశించక్కర్లేదు.


    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం